మీ బిడ్డగా.. మీ అందరి మంచికై ఆరాటపడుతున్నా 

ప్రతీ పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నాం

13 నెలల్లో రూ.43 వేల కోట్లతో 3.98 కోట్ల మందికి మేలు చేశాం

‘వైయస్‌ఆర్‌ కాపు నేస్తం’తో 2,35,873 మందికి సాయం

మిగిలిపోయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు నెలరోజుల గడువు

అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

ఈ 13 నెల‌ల కాలంలో కాపు సామాజికవర్గానికి రూ.4,770 కోట్లు ఖర్చు చేశాం

గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.1,870 కోట్ల మాత్రమే వెచ్చించింది

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: ప్రతీ సంక్షేమ పథకం పారదర్శకంగా అమలు చేస్తున్నాం. అర్హత ఉన్నవారికి ఎలా మంచి చేయాలని ఆరాటపడే ప్రభుత్వం మనది. ఎక్కడా వివక్షకు తావు లేకుండా.. అవినీతికి చోటు లేకుండా మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత ఉంటే చాలు మంచి చేసేందుకు ఆరాటపడుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడటం లేదన్నారు. 

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ద్వారా కాపు సామాజికవర్గానికి చెందిన అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. పేద కాపు అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా వారి కాళ్ల మీద వారు నిలబడేట్లుగా అడుగులు వేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ప్రారంభోత్సవానికి ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 13 జిల్లాల్లోని లబ్ధిదారులతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం ఏం మాట్లాడారంటే..

13నెలల కాలంలో 3.98 కోట్ల మందికి లబ్ధిచేకూర్చాం
దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  ఈ 13 నెలల కాలంలో అక్షరాల 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్ల పైచిలుకుతో లబ్ధి చేకూర్చగలిగామని గర్వంగా తలెత్తుకొని చెప్పగలుగుతున్నా.  ఈ సొమ్మును కూడా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లకే డబ్బును చేర్చగలిగాం. ఎక్కడా వివక్షకు తావు ఇవ్వలేదు. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు అర్హత ఉన్నవారందరికీ మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతి అనేది ఎక్కడా లేకుండా లబ్ధిదారుల చేతుల్లో డబ్బు పెట్టగలిగాం. 

13 నెలల్లో కాపులకు రూ.4,770 కోట్లు
కాపు అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు సంబంధించి 13 నెలల కాలంలో ఎంత ఖర్చు చేశామని చూస్తే.. ‘జగనన్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్‌ కానుక, వాహన మిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, విదేశీ విద్యా దీవెన, ఇళ్ల పట్టాలు.. కాపు నేస్తం’ సహా కలుపుకొని చూస్తే అక్షరాల రూ.4,770 కోట్లతో 22.89 లక్షల మంది కుటుంబాలకు మేలు జరిగేలా చేయగలిగామని సగర్వంగా.. మీ ఇంటి బిడ్డగా చెప్పగలుగుతున్నా.

ఐదేళ్ల పాటు వరుసగా రూ.75 వేల సాయం
ప్రతీ పథకం ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల అక్క ఆ ఇంట్లో ఉన్నా కూడా కచ్చితంగా బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఉంటే చాలు సంవత్సరానికి రూ.15 వేల చొప్పున ఐదేళ్ల పాటు వరుసగా రూ.75 వేలు ఇచ్చి అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేట్లుగా అడుగులు వేస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 మంది అక్కచెల్లెమ్మలకు
వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ప్రతి పేద అక్కచెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపుగా 2,35,873 మంది పేద కాపు అక్కచెల్లెమ్మలకు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి నగదు జమ చేయనున్నారు. ప్రభుత్వం అందించే సాయం పాత అప్పులకు జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు సూచించాం. 

కంగారుపడకుండా.. దరఖాస్తు చేసుకోండి
ఎవరికైనా పొరపాటున వైయస్‌ఆర్‌ కాపు నేస్తం సాయం అందకపోయి ఉంటే దయచేసి ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. మన ప్రభుత్వం ఎలా ఎగరగొట్టాలని చూడదు.. అర్హుత ఉంటే ఎలా ఇవ్వాలని ఆరాటపడే ప్రభుత్వం మనది. గ్రామ సచివాలయాల్లో పూర్తిగా లబ్ధిదారుల జాబితా ప్రదర్శించారు. ఆ పక్కనే ఈ పథకానికి సంబంధించి అర్హతకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రదర్శిస్తున్నాం. పొరపాటున లిస్టులో కనిపించకపోతే కంగారుపడకుండా దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల 24వ తేదీ వరకు గడువు పెంచుతున్నాం. మిగిలినవారికి కూడా సాయం అందిస్తాం. 

గుండెల మీద చేతులు వేసుకొని పాలనలో తేడాను గమనించండి
ప్రజలంతా గుండెల మీద చేతులు వేసుకొని పాలనలో తేడాను గమనించాలని మీ బిడ్డలా సవినయంగా కోరుకుంటున్నా. గత ప్రభుత్వం చేసేందేమిటో ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున రూ.5 వేల కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం ఇచ్చిందెంతా అని చూస్తే ఐదేళ్లలో మొత్తం కలిపి కేవలం రూ.1874 కోట్లు మాత్రమే. ఏడాదికి సగటు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితులు గత పాలనలో చూశాం. అదే ఈ సంవత్సరం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో వచ్చిన మనందరి ప్రభుత్వం 13 నెలల కాలంలోనే కాపులకు రూ.4,770 కోట్లు ఖర్చు చేశాం. 

ఇంకా ఎక్కువగా మంచి చేయడానికి..
దీని ద్వారా మీకు సంపూర్ణంగా మంచి జరగాలని కోరుకుంటూ దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా ఎక్కువగా మీకు మంచి చేయడానికి రాబోయే రోజుల్లో దేవుడి సహకరించాలని ప్రార్థిస్తూ వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి శ్రీకారం చుడుతున్నాను’. అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top