ఇలా చేయడం వల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం 

పీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి: రాష్ట్రవ్యాప్తంగా 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాని మోదీకి తెలిపారు .సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని, ఇలా చేయడం వల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందన్నారు.  ప్రతి పది లక్షల మందికి 47,459 పరీక్షలు జరిపామని చెప్పారు. మరణాలు రేటు 0.89 శాతంగా ఉందన్నారు. క్లస్టర్లలోనే 85 నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెల్లడించారు. కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ నివారణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 

ప్రతి పది లక్షల మందికి 47 వేలకు పైగా పరీక్షలు..
రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందికి 47 వేలకు పైగా క‌రోనా  పరీక్షలు నిర్వ‌హిస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.  వైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్‌ చేస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ వచ్చే నాటికి వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదని ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఉన్నాయని, టెస్టుల విషయంలో స్వాలంబన సాధించామని తెలిపారు. దాదాపు 2లక్షల మంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్‌ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారని సీఎం వెల్లడించారు. అవసరమైన అందరికి టెస్టులు చేస్తున్నామని, ప్రతి రోజు 9వేల నుంచి 10వేల కేసులు నమోదువతున్నాయని తెలిపారు. 

109 కోవిడ్ కేర్ సెంట‌ర్లు..56 వేల‌కు పైగా బెడ్లు..
రాష్ట్రంలో 138ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నాని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 109కోవిడ్‌కేర్‌ సెంటర్లు, 56వేలకుపైగా బెడ్లు ఉన్నాయని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు కేవలం 3,286 మాత్రమే ఉండేవని తెలియజేశారు.ప్రస్తుతం రాష్టంతో11 వేలకుపైగా ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నాయని వెల్లడించారు. గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నామని ప్రధాని మోదీకి సీఎం వైయ‌స్ జగన్‌ వివరించారు. అలాగే హెల్ప్‌ డెస్క్‌లను పెట్టామని, పేషెంట్లను త్వరగా అడ్మిట్‌ చేయించడానికి వీరు సహాయపడుతున్నారని తెలిపారు.

ప్ర‌తి మండ‌లానికి కొత్త 108 అంబులెన్స్‌

 ప్రతి మండలంలో 108అంబులెన్స్‌ ఉన్నాయని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  కోవిడ్‌కు ముందు 108 అంబులెన్స్‌ వాహనాలు 443 ఉంటే, కోవిడ్‌ సమయంలో మరో 768అంబులెన్స్‌లు సమకూర్చుకున్నామని చెప్పారు. 108, 104 వాహనాలు కలిపి కొత్తగా 1088పైగా తీసుకొచ్చామని వివరించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహానగరాలు తమకు లేవు, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలిక సదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవని వైయ‌స్‌ జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకుచ్చారు. 

కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి..

రాష్ట్రంలో వైద్య సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్రప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయ‌స్‌ జగన్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top