మ‌న ఇంట్లో స‌మ‌స్య‌గానే భావించి వారికి అండ‌గా నిల‌వాలి

ముంపు బాధితుల ఒక్కో ఇంటికి రూ.2 వేలు సాయం అందించండి

స‌హాయ కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేయండి

గోదావ‌రి వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్ష‌

ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని కోరారు. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని సీఎం ఆదేశించారు. ఖర్చు విషయంలో వెనుకాడ వద్దని సూచించారు. గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. `నేను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నానని` సీఎం వైయ‌స్ జగన్‌ తెలిపారు.

సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. వారు ఇస్తున్న క్షేత్రస్థాయి సమాచారంపై వెంటనే చర్యలు తీసుకోవాల‌ని, సమాచారం తీసుకోవడం కోసం ఒక అధికారిని కూడా నియ‌మించాల‌ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వారు గమనించిన అంశాలను వెంటనే పరిష్కరించాల‌న్నారు.  వరద తగ్గుముఖం పట్టగానే 10 రోజుల్లో పంట నష్టం అంచనాలు పంపించాలి. ఎన్యుమరేషన్‌ 10 రోజుల్లోగా చేయాలి. విద్యుత్, కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారుల‌ను ఆదేశించారు.

 

Back to Top