రాష్ట్ర ఆదాయ పెరుగుద‌ల‌పై దృష్టిపెట్టండి

ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి

కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి

పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయండి

అవినీతి ఘటనలు, లోపాలు ప్రవేశించకూడదు

ఉచిత రిజిస్ట్రేష‌న్ల‌తో పేద‌ల‌కు భారీ ల‌బ్ధి

ఓటీఎస్‌ ద్వారా రూ.400.55 కోట్లు, టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేష‌న్ల‌తో మరో రూ.1,230 కోట్ల లబ్ధి

ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో సీఎం సమీక్ష

తాడేప‌ల్లి: అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఉన్న‌తాధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఓఆర్‌ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాల‌న్నారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలన్నారు. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్ర‌త్యేక‌ దృష్టిపెట్టాలని సూచించారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలన్నారు. ఆదాయాన్ని ఆర్జించే శాఖలు ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్యం, ఎక్సైజ్, అటవీ, పర్యావరణం, గనులశాఖలపై సీఎం వైయస్ జగన్ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాల‌న్నారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్‌ఓపీలను పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టిసారించాల‌న్నారు.  

పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్‌ సేవలను సమీక్షించి.. తగిన మార్పులు, చేర్పులు చేయాల‌ని సూచించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదని ఆదేశించారు.  ఆమేరకు పటిష్టమైన ఎస్‌ఓపీలను అమలు చేయాలన్నారు. 

ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు భారీ లబ్ధి..
ఉచితంగా రిజిస్ట్రేషన్లు వల్ల పేదలకు భారీగా లబ్ధి చేకూరిందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు మరో రూ.1,230 కోట్ల మేర లబ్ధి చేకూరిందని వివ‌రించారు. గతంలో ఎన్నడూ ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు. 

ఈ స‌మీక్షా స‌మావేశంలో ఉప‌ముఖ్య‌మంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ శాఖ) కె నారాయణ స్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,  సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top