క‌ల నిజం కావాలి

ఏడాదిన్న‌ర‌లో విద్యారంగంలో `నాడు-నేడు` ప‌నులు పూర్తిచేయాలి

నిధుల స‌మీకర‌ణ‌పై క‌చ్చిత‌మైన ప్రాణాళిక ఉండాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

`నాడు-నేడు` కార్య‌క్ర‌మం, వాట‌ర్ గ్రిడ్‌, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం స‌మీక్ష‌

తాడేపల్లి: `నాడు-నేడు` పనులపై ప్ర‌భుత్వం కన్న కల నిజం కావాలని, స‌ంవ‌త్స‌ర‌న్న‌ర‌లోగా విద్యారంగంలో `నాడు-నేడు` కింద చేప‌డుతున్న‌ పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో స్కూల్స్‌, ఆస్ప‌త్రుల్లో నాడు-నేడు కార్యక్ర‌మంపై, వాట‌ర్ గ్రిడ్‌, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై మంత్రులు ఆదిమూల‌పు సురేష్‌, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. నిధుల సమీకరణపై క‌చ్చితమైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా లక్ష్యాలు, అంతే వేగంతో పనులు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

`నాడు-నేడు` కార్యక్రమం అత్యంత ప్రధానమైంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. విద్యారంగంలో `నాడు-నేడు` పనులపై తాము కన్న కల నిజం కావాలని సూచించారు. ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో కూడా నాడు-నేడు, కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత ముఖ్యమైనదన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌లో భాగం పోలవరం నుంచి అదనపు జలాల తరలింపు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ పనులు, తాగునీటి వసతి కల్పన, కృష్ణా–కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా చేపట్టాల్సిన నివారణ పనులు త్వరగా ముందుకు సాగాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.

Back to Top