గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో గ‌ణ‌నీయంగా పెర‌గాలి

విద్యాశాఖ అధికారులు దీన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి

డిగ్రీ విద్యను అత్యుత్తమంగా అందించాలి

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలి

ఇంట్లో చ‌దువుకునే పిల్లలందరికీ విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నాం

అమ్మాయిలు చ‌దువుల‌కు దూర‌మ‌వ్వ‌కూడ‌దు

జీఆర్‌ఈ, జీ మ్యాట్‌ పరీక్షలపై విద్యార్థులకు మంచిశిక్షణ ఇవ్వాలి

సమర్థులు, ప్రతిభ గ‌ల వారినే టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలి

ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి

విద్యాశాఖ అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) గణనీయంగా పెరగాలని, క‌చ్చితంగా దీన్ని ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌ని విద్యాశాఖ అధికారుల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. గతం కన్నా జీఈఆర్‌ పెరిగిన మాట వాస్తవమే.. అయినా, దీంతో మనం సంతృప్తి చెందకూడదు.. జీఈఆర్‌  80శాతానికి పైగా ఉండాలని సూచించారు. ఉన్న‌త విద్య‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జీఈఆర్‌, యూనివ‌ర్సిటీలు, కోర్సులు త‌దిత‌ర అంశాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించారు. 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఏమన్నారంటే.. 
ఉద్యోగాలను కల్పించే చదువులు దిశగా కోర్సులు ఉండాలి. ఇప్పుడున్న కోర్సులకు సంబంధించి అనుబంధకోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు వీలుగా ఇంగ్లిషుపై పట్టు, ప్రావీణ్యం విద్యార్థులకు రావాలి. వీటిపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి. జీఆర్‌ఈ, జీ మ్యాట్‌ పరీక్షలపైన కూడా విద్యార్థులకు మంచి శిక్షణ ఇవ్వాలి. 

ఫీజురీయింబర్స్‌ మెంట్, వసతి దీవెనలను ఒక పిల్లాడికే పరిమితం చేయడంలేదు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చ‌దువుకుంటున్నారో అంతమందికీ విద్యాదీవెన, వసతి దీవెన ఇస్తున్నాం. ఇంతకుముందు చదివించే స్తోమత లేక, చాలామంది అబ్బాయి చదువుకుంటే చాలు అని.. అమ్మాయిలను పై చదువులకు పంపలేని పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితులను పూర్తిగా తీసేయడానికి ఇంట్లో చ‌దువుకునే పిల్లలు అందరికీ కూడా విద్యాదీవెన, వసతి దీవెన వర్తింపు చేస్తున్నాం. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారు. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారిలో చైతన్యం తీసుకురావాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. 

ఉత్తమ యూనివర్సిటీలుగా..
రాష్ట్రంలో 4, 5 యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని, దేశంలో ఉత్తమ యూనివర్శిటీల స్థాయికి తీసుకెళ్లాలి. దీన్ని ఒక లక్ష్యంగా తీసుకుని ముందడుగులు వేయాలి. పట్టభద్రులకు తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్‌షిప్‌. కోర్సులో భాగంగా వీరికి ఇంటర్న్‌షిప్. మూడు విడతల్లో ఇంటర్న్‌షిప్‌. మొదటి ఏడాది 2 నెలలు, రెండో ఏడాది 2 నెలలు, మూడో ఏడాది 6 నెలల ఇంటర్న్‌షిప్‌. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్యకాలేజీల్లో కూడా ఇంటర్న్‌షిప్‌ కోసం ఏర్పాట్లు చేయాలి. 

ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉండాలి. నియోజకవర్గంలో ఉన్న జూనియర్‌ కాలేజీని డిగ్రీకాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి. దీనికోసం నాడు – నేడు కింద ఈ పనులు చేపట్టాలి. అత్త్యుత్తమంగా డిగ్రీ విద్య అందించాలి. ఈ కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను తీసుకురావాలి. చదువులు  ఏదోరకంగా సాగితే చాలు అన్నవాళ్లు డిగ్రీ కోర్సులను ఎంచుకునే భావన ఇవాళ దేశంలో ఉంది. కానీ, విదేశాల్లో డిగ్రీ అన్నది చాలా అత్యుత్తమ కోర్సుగా భావిస్తారు. మన రాష్ట్రంలో కూడా డిగ్రీకోర్సులను సమర్థవంతంగా తీసుకురావాలి. ఇప్పుడున్న డిగ్రీకాలేజీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి. మన ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీకాలేజీలో జాయిన్‌ అయ్యారంటే.. ఆ విద్యార్థికి మంచి విజ్ఞానం రావాలి.

డిగ్రీ విద్య – ప్రత్యేక యూనివర్సిటీ పరిధిలో..
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీకాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలి. ఇందులో మంచి పరిజ్ఞానం ఉన్నవారిని ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలి. డిగ్రీ కోర్సులకు విలువను జోడించండి. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలి. ఏపీలో డిగ్రీలు చదివితే.. మంచి జీతాలు వచ్చే పరిస్థితిని తీసుకురావాలి.

బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌..
టీచింగ్‌ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి. టీచింగ్‌ స్టాఫ్‌ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదు. ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది. సమర్ధులైన వారిని, ప్రతిభ ఉన్నవారిని టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలి. వారికీ పరీక్షలు నిర్వహించి.. ఎంపిక చేయాలి. టీచింగ్‌ స్టాఫ్‌ కమ్యూనికేషన్ల నైపుణ్యాన్నికూడా పరిశీలించాలి.
యూనివర్శిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవి. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి.

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన సమీక్షా సమావేశానికి  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్, ఆర్‌జీయూకెటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్ కె.సి.రెడ్డి, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమ చంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top