`అమ్మఒడి` స్ఫూర్తి కొనసాగాలి.. పిల్ల‌లంతా బ‌డిబాట ప‌ట్టాలి

రూ.వేల కోట్ల ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు సుంద‌రంగా తీర్చిదిద్దాం

ఈ ఏడాది నుంచి 75 శాతం హాజరు నిబంధనను పరిగణలోకి తీసుకోవాలి

2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరుకు అనుసంధానం చేయాలి

2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలి

స్కూళ్ల పనితీరు ర్యాంకింగ్‌లపై టీచ‌ర్ల అభిప్రాయం త‌ప్ప‌నిస‌రి

ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

విద్యా కానుకలో విద్యార్థుల‌కిచ్చే స్పోర్ట్స్‌ డ్రస్, షూ ప‌రిశీలించిన సీఎం 

తాడేపల్లి: పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే `అమ్మ ఒడి` ప్రధాన ఉద్దేశమ‌ని, అమ్మ ఒడి ప‌థ‌కం స్ఫూర్తి కొనసాగాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌కు సూచించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు సుంద‌రంగా తీర్చిదిద్దామ‌ని సీఎం చెప్పారు. విద్యాశాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై అధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సుదీర్ఘంగా చ‌ర్చించారు. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతంపై సీఎం చ‌ర్చించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కారణంగా పాఠశాలలపై కరోనా ప్రభావం పెద్దగా లేదని అధికారులు తెలిపారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తయినందున వారుకూడా విధుల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి.. ఆగస్టులో పిల్లల హాజరు 73 శాతంగా ఉందని, సెప్టెంబరులో 82 శాతానికి పెరిగిందని, అక్టోబరు నాటికి 85శాతం నమోదైందని అధికారులు వివ‌రించారు. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు.  

‘అమ్మ ఒడి’ పథకం స్ఫూర్తి కొనసాగాలి:
పిల్లల్ని బడిబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ప్రధాన ఉద్దేశమ‌ని, ఆ దిశగా తల్లులను, పిల్లలను చైతన్యం చేయడానికి అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. అమ్మ ఒడితో పాటు విద్యాకానుకను అమలు చేస్తున్నామ‌న్నారు. వేల కోట్లరూపాయలు ఖర్చుచేసి తొలివిడతలో 15వేలకుపైగా స్కూళ్లు తీర్చిదిద్దామ‌న్నారు. అమ్మ ఒడి స్ఫూర్తి కొనసాగాల‌ని, పిల్లలంతా బడిబాట పట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. అమ్మ ఒడి పథకం అమలు సందర్భంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో 75శాతం హాజరు ఉంచాలన్న నిబంధన పెట్టామ‌ని, కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఆ నిబంధనలను అమలు చేయలేని పరిస్థితి నెలకొంద‌న్నారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించామ‌ని, మార్చి చివరి వారంలో కోవిడ్‌ ప్రారంభమైంద‌ని సీఎం చెప్పారు. అమ్మ ఒడి అమల్లోకి వచ్చిన 2–3 నెలలు తిరగకముందే కోవిడ్‌ ప్రారంభం కావ‌డంతో స్కూళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింద‌న్నారు. తిరిగి 2020, నవంబరు, డిసెంబరుల్లో పాఠశాలలు తెరిమ‌ని చెప్పారు. జనవరి 2021లో మళ్లీ అమ్మ ఒడి ఇచ్చాం, మళ్లీ రెండో వేవ్‌ కోవిడ్‌ వచ్చింద‌ని, దీంతో  పరీక్షలే నిర్వహించలేని పరిస్థితులు ఏర్ప‌డ్డాయ‌న్నారు. ఈ ఏడాది కూడా జూన్‌లో ప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఆగస్టు 16 నుంచి ప్రారంభించామ‌న్నారు. 

2022 నుంచి ‘అమ్మ ఒడి’ పథకానికి హాజరుకు అనుసంధానం చేయాల‌ని, పిల్లలను చదువులబాట పట్టించాలన్నదే అమ్మ ఒడి పథకం ఉద్దేశమ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పున‌రుద్ఘాటించారు. ఈ పథకానికి సంబంధించిన స్ఫూర్తిని కొనసాగించాల‌ని, 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను ఈ ఏడాది నుంచి పరిగణలోకి తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. సాధారణంగా జూన్‌లో స్కూళ్లు ప్రారంభం అయితే ఏప్రిల్ వరకూ కొనసాగుతాయ‌ని, కాబట్టి.. ఆ విద్యా సంవత్సరంలో పిల్లల హాజరును పరిగణలోకి తీసుకోవాల‌న్నారు. హాజరును పరిగణలోకి తీసుకుని జూన్‌లో పిల్లల్ని స్కూల్‌కు పంపే సమయంలో, విద్యాసంవత్సరం ప్రారంభంలోనే అమ్మ ఒడిని అందించాల‌న్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక రెండూ కూడా పిల్లలు జూన్‌లో స్కూల్‌కి వచ్చేటప్పుడు ఇవ్వాల‌ని, అకడమిక్‌ ఇయర్‌తో అమ్మ ఒడి అనుసంధానం కావాల‌ని అధికారుల‌కు సూచించారు. 

అన్ని స్కూళ్లకూ- సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. 2024 నాటికి పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాల‌ని సూచించారు. 

ప్రతి హైస్కూల్‌కు కచ్చితంగా ప్లే గ్రౌండ్ ఉండాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. దీనిమీద మ్యాపింగ్‌చేసి.. ప్లే గ్రౌండ్‌లేని చోట భూ సేకరణచేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. కాలక్రమేణా ప్రి హైస్కూల్‌  స్థాయి వరకూ ప్లే గ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. 

విద్యాకానుకపై సీఎం సమీక్ష..
డిసెంబర్‌ నాటికి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికి విద్యాకానుకను వారికి అందించాలన్నారు. విద్యాకానుకలో భాగంగా పిల్లలకు స్పోర్ట్స్‌ డ్రస్, రెగ్యులర్, స్పోర్ట్స్‌కి ఉపయోగపడేలా ఉండే షూల‌ను సీఎం ప‌రిశీలించి, కొన్ని సూచనలు చేశారు. ప్రతి స్కూల్‌కు నిర్వహణ ఖర్చుల కింద కనీసం రూ.1 లక్షను వారికి అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. త‌ద్వారా మరమ్మతులతో పాటు ఏ సమస్య వచ్చినా తీర్చుకునే అవకాశం వారికి ఉంటుందన్నారు.  దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాల‌ని అధికారులను సీఎం ఆదేశించారు. 

స్కూళ్ల పనితీరుపై సోషల్‌ ఆడిట్‌ద్వారా ర్యాంకింగ్‌లు ఇస్తామంటూ అధికారులు ప్ర‌తిపాదించ‌గా.. ఇలాంటి ఏ మార్పులు తీసుకువచ్చినా ముందుగా టీచర్లతో మాట్లాడాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. చిరునవ్వుతో వారిని ఆహ్వానించి వారి అభిప్రాయాలూ తీసుకోవాలన్నారు. అయోమయానికి, గందరగోళానికి దారితీసేలా ఉండకూడదని, దీనివల్ల అపోహలు పెరుగుతాయన్నారు.  అపోహలను మరింత రెచ్చగొట్టి.. పక్కదోవ పట్టించే ప్రయత్నాలకు ఆస్కారం ఇవ్వకూడద‌ని సూచించారు. ఎలాంటి సంస్కరణలు, మార్పులు తీసుకురావాలనుకున్నా దాని వెనకున్న ఉద్దేశ్యాలను టీచర్లకు స్పష్టంగా చెప్పాలన్నారు. భాగస్వాములందరూ కలిసి ముందుకు సాగితే విజయవంతం అవుతాయని సూచించారు. 

ర్యాంకింగ్‌లు కూడా ఎందుకు ఇస్తున్నామో టీచ‌ర్ల‌కు స్పష్టంగా చెప్పాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ వెనకబడి ఉన్నామో తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ విధానం ఉండాలని, టీచర్లను తొలగించడానికో లేదా వారిని అభద్రతా భావానికి గురిచేయడానికో ఇలాంటి విధానాలు కావనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని అధికారులను ఆదేశించారు. తప్పులు వెతకడానికి, ఆ తప్పులకు బాధ్యులను చేయడానికీ ఈ విధానాలు కావనే విషయాన్ని పదేపదే చెప్పాలన్నారు. స్కూళ్లను నడిపే విషయంలో, విద్యార్థులకు బోధన అందించే విషయంలో, నాణ్యతను పాటించే విషయంలో ఎక్కడ వెనుకబడి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ సోషల్ ఆడిటింగ్‌ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.  

టీచర్ల మ్యాపింగ్‌ను వెంటనే పూర్తిచేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా పిల్లలకు బోధించే విధానాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలన్నారు. ఈనెలాఖరు నాటికి మ్యాపింగ్‌ పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. పాఠ్యప్రణాళికను మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని,  దీనిపై తర్వాత సమావేశంలో వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. 

ఎయిడెడ్‌ స్కూళ్లను ఎవ్వరూ బలవంతం చేయడంలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌కు వివ‌రించారు. ఎయిడెడ్‌ యాజమాన్యాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నడుపుతుంద‌న్నారు. లేదా వాళ్లు నడపాలనుకుంటే వారే నడుపుకోవచ్చన్న విషయాన్ని స్పష్టంగా తెలియ‌జేయాల‌న్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాల‌న్నారు. ఇది స్వచ్ఛందం అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ. ఆర్‌. అనురాధ, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ (దిశ స్పెషల్‌ ఆఫీసర్‌) కృతికా శుక్లా, ఎండిఎం అండ్‌ శానిటేషన్‌ డైరెక్టర్ బి. ఎం. దివాన్,  పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి. ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top