వక్ఫ్‌  భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

మైనార్టీ సంక్షేమ శాఖపై  సీఎం వైయస్ జగన్‌ సమీక్ష 

వైయస్సార్‌ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్‌ ఆస్తులు కూడా సర్వే 

కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌  ఏర్పాటు దిశగా చర్యలు 

మైనార్టీలకూ సబ్‌ప్లాన్‌ కోసం అధికారులు ప్రతిపాదన

విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్‌ నిర్మాణం

అసంపూర్ణంగా నిలిచిపోయిన  క్రిస్టియన్‌ భవన్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం

తాడేప‌ల్లి:  వక్ఫ్‌  భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. వక్ఫ్‌ భూములపై పూర్తి స్ధాయిలో అధ్యయనం చేయాల‌ని అధికారులకు సూచించారు. వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో భాగంగా ఆ భూముల చుట్టూ కాంపౌండ్‌ వాల్ నిర్మించాల‌ని, ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలని తెలిపారు.  నిర్మాణం చేపట్టిన తర్వాత ఆయా చోట్ల హోంగార్డులను నియ‌మించి వాటికి రక్షణ క‌ల్పించాల‌న్నారు. ఆ భూములను ఏ మేరకు వాడుకోగలమో నిపుణలు సలహా తీసుకోవాలి సూచించారు. సోమ‌వారం  తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మైనార్టీ సంక్షేమ శాఖపై  సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు.  

వక్ఫ్‌ ఆస్తులు కూడా సర్వే 
వైయస్సార్‌ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్‌ ఆస్తులు కూడా సర్వే చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలో ఉన్న సుమారు 500 ఎకరాల వక్ఫ్‌ బోర్డు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌  ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

మైనార్టీలకు కొత్త శ్మశాన వాటికలు ఏర్పాటుకు  సీఎం వైయస్‌.జగన్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ యేడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వీటి నిర్మాణం చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అవసరాలకు తగినట్టుగా కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాల‌న్నారు. 

ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లింపులు జరగాల‌ని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇమామ్‌లు, మౌజంలకు గౌరవ వేతనం కోసం కొత్తగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వివ‌రించ‌గా.. వీటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

మైనార్టీలకూ సబ్‌ప్లాన్‌ కోసం అధికారులు ప్రతిపాదన రూపొందించ‌గా, దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. సబ్‌ప్లాన్‌ అమలు అయితే నిధులు కూడా మరింత పెరుగుతాయని చెప్పారు.  మైనారిటీ విద్యార్ధుల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగతున్నాయని   అధికారులు వెల్ల‌డించారు. నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించిన పనుల ప్రగతిని సీఎంకు  అధికారులు వివ‌రించారు. 5 గురుకుల పాఠశాలలు, 2 వసతి గృహాలకు సంబంధించి రూ.75 కోట్లతో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. 

పెండింగ్‌ బిల్లులు, బకాయిలు చెల్లించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌  అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభమైన అన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని  ముఖ్యమంత్రి సూచించారు. మైనార్టీ శాఖలో పెండింగ్‌ సమస్యల పై పూర్తి స్ధాయి నివేదిక ఇవ్వాలని అధికారులను  సీఎం ఆదేశించారు.

మైనార్టీ విద్యార్ధుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక ధ్యాస పెట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 
కర్నూలులో ఉర్ధూ యూనివర్సిటీ పనులపై  సీఎం ఆరా తీశారు. ప్రయారిటీ కింద తీసుకుని ఫోకస్డుగా యూనివర్సీటీ పనులు చేపట్టాలని ఆదేశించారు. నాడు–నేడు తరహాలో పనులు చేపట్టాల‌ని  అధికారులకు సీఎం  స్పష్టం చేశారు.

ఉర్ధూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. 
అకాడమీని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. షాదీఖానాలు నిర్వహణను కూడా మైనారిటీశాఖకు బదిలీ చేయాల‌ని ఆదేశించారు. మైనారిటీశాఖలో ఖాళీ పోస్టుల వివరాలను  అధికారులు వెల్ల‌డించారు. ఉద్యోగ నియమకాలకు సంబంధించి ఆర్ధికశాఖ అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. 

విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్‌ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు
హజ్‌ హౌస్‌ నిర్మాణానికి సీఎం అంగీకారం తెలిపారు. హజ్‌ కమిటీలు, వక్ఫ్‌ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, అర్ధాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణ ప‌నులు స‌కాలంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజద్‌ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ కె శారదా దేవి, ఏపీ సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ సీఈఓ పి రవి సుభాష్, ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వీసీ అండ్‌ ఎండీ అలీం బాషా, ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top