బాపట్ల: రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడు వద్ద ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభలో పాల్గొనేందుకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు. చరిత్రలో నిలిచిపోయేలా పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద కోల్కత–చెన్నై జాతీయ రహదారి పక్కనే వందలాది ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 44 నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో కదలిరానున్నారు. వీరిని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సీఎం జగన్ ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. రాప్తాడు సభ ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతిపెద్ద ప్రజాసభగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. మూడు సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. టైమ్స్నౌ–ఈటీజీ, జీన్యూస్ మ్యారిటైజ్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని తేలడంతో చివరి ‘సిద్ధం’ సభకు కూడా ఉరిమే ఉత్సాహంతో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.