ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌కు అన్ని రకాల సౌకర్యాలు కల్పించండి

ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం

తాడేప‌ల్లి: ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌కు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎం కార్యాలయ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మంది ప్రజలను తరలించామని, వచ్చే వరదను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున సహాయ చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేశామని అధికారులు ఆయనకు వివరించారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.

► వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. 
► ముంపునకు గురయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టాలని, ఎలాంటి ప్రాణనష్టం లేకుండా.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. 
► దీనికోసం ప్రత్యేకంగా సహాయ పునరావాస శిబిరాలు తెరిచి, బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. 
► ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు సహాయ చర్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
► రక్షణ చర్యలు, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రాష్ట్ర విపత్తు దళం (ఎస్డీఆర్‌ఎఫ్‌), జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సహా సంబంధిత సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. 
► రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
► గోదావరి వరద ఉధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు. 
► కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షాలు, అనంతర పరిస్థితులపై సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆరా తీశారు. వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. 

Back to Top