అమరావతి: ప్రతి నెల కొత్త సంక్షేమ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ప్రతి నెల కొత్త సంక్షేమ పథకం అమలు చేయాలని వారికి సూచించారు. ఏడు నెలల పాటు వరుసగా పథకాల అమలు క్యాలెండర్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
- సెప్టెంబర్ చివరి వారంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేలు.
- అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ప్రారంభం.
- పడవలు, బోట్లు ఉన్నవారికి రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం.
- నవంబర్ 21న మత్స్యదినోత్సవం సందర్భంగా పథకం అమలు. లీటర్ డీజిల్పై ఉన్న రూ. 6 సబ్సిడీని రూ. 9కి పెంచబోతున్నాం.
- మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి డిసెంబర్ 21న రూ. 24 వేలు.
- జనవరి 26న అమ్మఒడి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తాం.
- ఫిబ్రవరి చివరివారంలో నాయీ బ్రాహ్మణులు, షాపులున్న టైలర్లు, రజకులకు రూ. 10 వేలు అందజేస్తాం.
- ఫిబ్రవరి చివరి వారంలో ‘వైయస్ఆర్ పెళ్లి కానుక’ ఇవ్వబోతున్నాం.
- ఉగాది నాటికి ఇల్లు లేని నిరుపేదలకు స్థలాల పట్టాలు పంపిణీ చేస్తాం.
- అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు కేటాయించాం. సెప్టెంబర్ నుంచి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు.