అనంతపురం: రైతుకు తోడుగా నిలిచిన రైతు భరోసా వ్యవస్థ కావాలా? ..దళారీ వ్యవస్థ కావాలా? అని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మోసం చేసే పాలన కావాలా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమ చేస్తున్నామని అన్నారు. బీమా పరిహారం రూ.1,117 కోట్లు పంపిణీకి శ్రీకారం చుట్టామని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. టీడీపీ పాలనలో ఐదేళ్లలో చంద్రబాబు బీమా పరిహారంగా రైతులకు చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు. మేము అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించింది రూ. 7,802 కోట్లు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాం. ప్రతి ఏటా మూడు విడతల్లో వైయస్ఆర్ రైతు భరోసా అందిస్తున్నామన్నారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల 985 కోట్లు రైతు భరోసా ఇచ్చాం. గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు తీసుకొచ్చి రైతులకు సేవలు అందిస్తున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు.. రైతులకు అరకొరగా బీమా డబ్బులు చెల్లించారు. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోంది. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదు. చంద్రబాబు కరువును పారద్రోలాడని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిసిగ్గుగా అసత్యాలు రాశాయని సీఎం దుయ్యబట్టారు. విత్తనం మొదలు పంట అమ్మకం వరుకు ఆర్బీకే రూపంలో రైతుకు తోడుగా ఉంటున్నామని సీఎం తెలిపారు. శనివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దివంగత మహానేత జయంతిని పురస్కరించుకొని వైయస్ఆర్ రైతు దినోత్సవంలో సీఎం వైయస్ జగన్ పాల్గొని 2022–ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధి కలిగిస్తూ బీమా పరిహారం విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. దేవుడి దయతో ఈ రోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ..ప్రేమానురాగాలు పంచిపెడుతున్న ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుగు వారి గుండెల్లో తెలుగు రైతుల గుండెల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోయే ఓ మంచి వ్యక్తి..ఓ మహా మనిషి పుట్టిన రోజు ఈ రోజు. డాక్టర్ వైయస్ఆర్ గారి జయంతి, నాన్నగారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా రైతు దినోత్సవంగా అన్నదాతకు పాదాభివందనం చేస్తూ జరుపుకుంటున్నాం ఇవాళ. నాన్నగారు గుర్తు వచ్చినప్పుడెల్లా రైతన్నలకు తాను ఏరకంగా స్పందించారు అన్నది గుర్తుకు వస్తుంది. ఉచిత విద్యుత్, జలయజ్ఞం గుర్తుకు వస్తుంది. రైతు, పేద వర్గాలకు అండగా నిలుస్తూ మహానేత తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ, 104, 108 గుర్తుకు వస్తుంది. కుయ్ కుయ్ అంటూ ఆ సౌండ్ గుర్తుకు వస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తుకు వస్తుంది. లక్షల్లో కట్టిన ఇల్లు గుర్తుకు వస్తాయి. ఇలా అనేక పథకాలకు మంచి పేరు గుర్తుకు వస్తుంది. మహానేత నాన్నగారు జ్ఞాపకం వస్తారు. భౌతికంగా నాన్నగారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయనను గౌరవిస్తూ వ్యవసాయ రంగంలో మనం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఆరోగ్య రంగంలో మనం అమలు చేస్తున్న ప్రతి పథకం, గృహ నిర్మాణానికి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయనను గౌరవిస్తూ డాక్టర్ వైయస్ఆర్ పేరు పెట్టాం. ఆయన జ్ఞాపకార్థంగా ఆయన పేరు పెట్టాం. రైతు దినోత్సవం రోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ నిలిచి నిరుడు సంవత్సరం వర్షాల కారణంగా పంటలు నష్టపోతే మళ్లీ మరుసటి ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే అక్షరాల 10లక్షల మంది రైతులకు ఈ రోజు రూ.11.10 కోట్లు భీమా పరిహారంగా బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా ఒక్క రూపాయి కూడా రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియంగా కట్టాల్సిన అవసరమే లేకుండా రైతుల తరఫున ప్రీమియం కడుతున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు..మన రాష్ట్రంలోనే ఇది ఉంది. రైతు ప్రతి ఎకరా కూడా నష్టపోకూడదని ఆర్బీకే పరిధిలో ఈక్రాపింగ్ నమోదు చేస్తున్నాం. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ బ్యాంకు రుణాలు తీసుకుని, రుణాలు తీసుకోలేని రైతులకు, నోటిఫై పంటలను ఉచిత బీమా పరిధిలోకి ప్రతి రైతును తీసుకువచ్చాం. దేవుడి దయ వల్ల ఈ నాలుగేళ్ల పాలనలో సకాలంలో కావాల్సినంత వర్షం కురిసినా కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా నాలుగేళ్లు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. అయినా కూడా అప్పుడప్పుడు అధిక వర్షాలు, ఇతర కారణాల వల్ల జరిగిన పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకొని 54.48 లక్షల మంది రైతులకు ఈ నాలుగేళ్ల కాలంలో ఉచిత పంట బీమా ద్వారా రూ.7802 కోట్లు పరిహారం చెల్లించాం. రైతు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా మనందరి ప్రభుత్వం నిలిచింది. ఒక్కసారి ఆలోచన చేయండి.గత ప్రభుత్వంలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో సగటున ప్రతి ఏటా 300 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించేవారు. ఇదే ఉమ్మడి అనంతపురంలో చంద్రబాబు పాలనలో ప్రతి ఏటా జిల్లా అంతా కూడా కరువే. అటువంటి పరిస్థితిలో కూడా ఆ చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారంగా ఇచ్చింది అరకొరనే. ఐదు కరువు సంవత్సరాల్లో కూడా అప్పటి ప్రభుత్వం రూ.3411 కోట్లు మాత్రమే ఐదేళ్లలో చెల్లించారు. కేవలం 30 లక్షల మంది రైతులకు మాత్రమే. కరువు కాటకాలతో రైతులు ఇబ్బంది పడుతున్నా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. మీ బిడ్డ పరిపాలనలో ఈ నాలుగేళ్లలో బీమా పరిహారంగా రూ.7802 కోట్లు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అది కూడా 54.48 లక్షల మంది రైతులకు చెల్లించాం. బీమా పరిహారానికి సంబంధించి నిజాలు ఈ మాదిరిగా ఉంటే..చంద్రబాబు ఏమంటున్నారు. దుష్ట చతుష్టయం ఏమంటుందో తెలుసా?. బీమా పరిహారంపై ముసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రతి ఒక్క రైతు తరఫున కూడా మొత్తం కట్టాల్సిన ప్రీమియం సొమ్మును ప్రభుత్వం ఇప్పటికే కట్టేసింది. ఏ రైతు ఇబ్బంది పడకూడదు. ఏ గ్రామంలో ఎన్ని ఎకరాల్లో పంట వేశాడని ఈ–క్రాప్ నమోదు చేయిస్తున్నాం. మనసుతో ఇవన్నీ మన ప్రభుత్వం చేస్తే..ఆ బీమా కంపెనీల నుంచి రైతులకు పరిహారం అందకూడదని ఎందుకు అనుకుంటాం. ప్రీమియం కట్టినప్పుడు రైతులకు ఎంత ఎక్కువ మొత్తం ఇప్పించాలని ప్రభుత్వం తాపత్రయపడుతుంది. వాస్తవాలు ఇది అయితే..ఏరకంగా వక్రీకరిస్తారో గమనించాలి. గ్రామస్థాయిలోనే ఆర్బీకేలు వచ్చాయి. ఎవరికి బీమా వస్తుంది, ఎంత నష్టం జరిగిందో రైతుల కళ్లెదుటే జాబితాలు ఏర్పాటు చేశాం. అభ్యంతరాలు తీసుకుంటున్నాం. టెస్టింగ్ చేయిస్తున్నాం. ప్రతి రైతుకు కూడా బీమా పరిహారం అందిస్తున్నాం. అయినా కూడా ఈ రోజు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో రైతులకు అందాల్సిన బీమా పరిహారం అందలేదని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నోరెత్తలేదు. చంద్రబాబు రెయిన్ గన్తో కరువును పారద్రోలాలని ఫోటోలకు ఫోజులు ఇస్తే నిసిగ్గుగా రాశారు. ఈ రోజు మన ప్రభుత్వంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ప్రీమియం మన ప్రభుత్వమే చెల్లించింది. గతేడాది పంట నష్టం జరిగితే ఈ ఏడాది ఖరీఫ్లోనే మన ప్రభుత్వం అండగా నిలిచింది. ముసలి కన్నీరు కార్చుతున్నారు ఈ దుర్మార్గులు. ఈ రోజు ఒక్క బీమా ప్రీమియం విషయంలోనే కాదు..పరిహారం విషయంలోనే కాదు..ఈ నాలుగేళ్లుగా రైతు పక్షపాత ప్రభుత్వంగా మనసు పెట్టి విప్లవాత్మక మార్పులు చేశాం. 1. ఉచిత పంటల బీమా ప్రతి రైతుకు కవర్ అయ్యేవిధంగా ప్రతి ఎకరాకు, ప్రతి రైతు తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. దేశంలో ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో మాత్రమే ఈ మార్పు ఉంది. 2. గతంలో ఎప్పుడు జరగని విధంగా వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్. ఇలాంటి పథకం ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ రైతు ఇబ్బంది పడకుండా ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13500 క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం ఇస్తున్నాం. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.61500 రైతుల చేతుల్లో నేరుగా బటన్ నొక్కి పెట్టడం జరిగింది. అర కోటి రైతులకు ఈ ఒక్క పథకానికే రూ.30,985 కోట్లు అందజేశాం. ఈ రోజు మన రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు కనీసం అర హెక్టార్ భూమి కూడా లేదు. ఒక హెక్టార్ 70 శాతం రైతులు ఉన్నారు. మనం ఇచ్చే రూ.13500 పంట వేసేటప్పుడు, పంట కోసే సమయంలో ఇస్తున్నాం. ఈ డబ్బులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 80 శాతం పంట ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. చిన్న సన్నకారు రైతులకు గొప్ప సంజీవిని రైతు భరోసా పథకం 3. దేశంలోనే విప్లవాత్మక మార్పు..దేశం మొత్తం మన రాష్ట్రానికి వచ్చి చూస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు గొప్ప మార్పు. విత్తనం మొదలు పంట కోత వరకు రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న గొప్ప వ్యవస్థ మన గ్రామంలోనే ఉంది. ఇలాంటి విప్లవాత్మక మార్పు దేశంలో ఎక్కడా లేదు. ఆర్బీకే వచ్చినందుకు ఎరువులు, విత్తనాల కోసం బారీ క్యూలు పోయాయి. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు మన గ్రామంలోకే వచ్చాయి. రైతులకు సూచనలు, సలహాలు మన ముంగిటకే వచ్చాయి. పంట అమ్ముకోవాలంటే ఆర్బీకేలో సంప్రదిస్తే చాలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ప్రతి రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న వ్యవస్థ ఆర్బీకే. 4. ఈ–క్రాప్..ఇది కూడా దేశంలో ఎక్కడా జరగడం లేదు. మన రాష్ట్రంలో ఎలా జరుగుతోందని ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకుంటున్నారు. ఈ–క్రాప్ ద్వారా నిజమైన రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ఏ రైతు ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేశాడన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ క్రాప్ ఆధారంగా ఏ ఒక్క రైతు నష్టపోకూండా పారదర్శకంగా బీమా, వడ్డీ లేని రుణాలు, ఇన్ఫుట్ సబ్సిడీ, పంటల కొనుగోలు కూడా ఈ–క్రాప్ కీలకంగా రైతు పక్షాన నిలుస్తోంది. గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడమని అడుగుతున్నాను. ఇది మన ప్రభుత్వం తీసుకువచ్చిన గొప్ప మార్పు ఈ–క్రాప్. 5. ఏ సీజన్లో పంట నష్టం జరిగినా కూడా ఆ సీజన్ ముగియకమునుపే పంట నష్టపరిహారం ఆ రైతు చేతుల్లో పెడుతున్న రాష్ట్రం మన ఏపీ మాత్రమే. రైతు పంటలు నష్టపోకూడదు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగియకముందే పరిహారం ఇస్తున్న రాష్ట్రం మనదే. మీ బిడ్డ హయాంలోనే ఇది కనిపిస్తోందని సగర్వంగా చెబుతున్నాను. ఇప్పటి వరకు అక్షరాల 22.74 లక్షల మంది రైతులకు రూ.1965 కోట్లు పంట నష్టపరిహారంగా ఈ నాలుగేళ్లలోనే సరైన సమయంలో సరైన పద్ధతిలో నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశాం. ఎక్కడా దళారులు, మధ్యవర్తులు లేరు. 6.ఏ సీజన్లో పంటనష్టం జరిగినా ఆ సీజన్ ముగియక ముందే పరిహారం అందిస్తున్నాం. సున్నా వడ్డీకి రైతులకు రుణాలు అందిస్తున్నాం. సున్నా వడ్డీ రుణాల్లో ఏపీ అగ్రగామిగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కోసం రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్ల కోసం నాలుగేళ్లలో రూ.58,767 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటల కొనుగోళ్ల కోసం మరో రూ.7,633 కోట్లు ఖర్చు చేశాం. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం రైతులకు ఎప్పటికీ ఉచిత విద్యుత్ ఇచ్చేలా విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నాం. చుక్కల భూములకు సంపూర్ణ భూహక్కు కల్పించాం. పశువుల కోసం 340 అంబులెన్స్లు ఏర్పాటు చేశాం. పాడి రైతులకు ఆదాయం వచ్చేలా అమూల్ను తీసుకొచ్చాం. మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా?. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా?. రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. ఏ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి. గతంలో పేదలను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. చంద్రబాబు పాలనలో డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది. రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తారు. నైతికత లేని వ్యక్తిని చంద్రబాబు అంటారు. వీళ్లలా నాకు అబద్ధాలు చెప్పడం రాదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.