తాడేపల్లి: భారతీయులందరికీ పరమ పవిత్రమైనది భారత రాజ్యాంగమని, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, మొండితోక జగన్మోహన్రావు, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కనకరావు మాదిగ, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సమానత్వ సాధన దిశగా గొప్ప కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరితార్ధులయ్యారని తెలిపారు. ఆయన అందించిన రాజ్యాంగం వలనే దేశంలో ప్రజలంతా సమాన హక్కులు అనుభవించే అవకాశం లభించిందని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తొలి అడుగులు వేశారని గుర్తుచేశారు. సమాజంలో అసమానతలు, పేదరికం నిర్మూలన దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారని వివరించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ఆచరణలో అమలు చేసి చూపుతున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్కే దక్కుతుందన్నారు.