ఏపీలో ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలియడం లేదు : బొత్స

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీరు హైదరాబాద్‌లో ఉన్నారని ఏపీలో ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఏపీ ఒకటేనని చెప్పారు. మీరు ఏమైనా సలహాలు ఇస్తే పరిశీలిస్తామని, మంచి అనుకుంటే అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజధానిపై ఎఫెక్ట్‌ పడుతుందని విశాఖలో కరోనా పరీక్షలు చేయడం లేదంటూ.. టీడీపీ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో పాజిటివ్‌ కేసులున్నాయని తెలంగాణ రాజధాని మార్చేస్తారా? అని ప్రశ్నించారు. ఏపీలో కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అధికార యంత్రాంగం మొత్తం కరోనాపైనే దృష్టిపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో లక్ష ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల ద్వారా 10 నిమిషాల వ్యవధిలో ఫలితం వస్తుందని బొత్స సత్యనారాయణ తెలిపారు.  
 

Back to Top