తిరుపతి : భారీ డ్రిల్లింగ్లో ఏ మాత్రం అనుభవం లేని డీప్ ఇండస్ట్రీస్కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండంల, ఇరుసుమండలంలో ఓఎన్జీసీ కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని వల్ల మోరి బావి–5 వద్ద భారీ బ్లోఅవుట్ జరిగి, 150 అడుగలకు పైగా మంటలు చెలరేగి వేలాది ఎకరాల్లో పంటలు తగలబడి, వందల కోట్ల నష్టం జరిగింది. ఈ దుర్ఘటన వెనుక ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంటే, దీన్ని సహజంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించి ప్రభుత్వ పెద్దలు మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డీప్ ఇండస్ట్రీస్ అనే ఓ అమెరికన్ కంపెనీకి అనుభవం లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అందుకే బ్లోఅవుట్ జరగ్గానే తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా కంపెనీ ప్రతినిధులు అక్కడి నుంచి పారిపోయారు. మరోవైపు సీరియస్గా సహాయ పనులు చేయాల్సిన అధికారులు నవ్వుతూ కనిపించారు. అందువల్లే బ్లోఅవుట్పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. లోతైన విచారణ జరపాలి: అందుకే డీప్ ఇండస్ట్రీస్ సంస్థకు కాంట్రాక్టు ఎలా దక్కిందనే దానిపై లోతైన విచారణ జరపాలి. అప్పుడే ప్రభుత్వ పెద్దలు, కంపెనీ ప్రతినిధుల మధ్య ఎన్ని వేల కోట్లు చేతులు మారాయో తెలుస్తుంది. అసలు ఎవరి ద్వారా ఈ కంపెనీ సహజ వాయువును వెలికి తీసే కాంట్రాక్టు దక్కించుకుందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కాగా, ప్రమాద ఘటనను కూడా కొందరు ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్నారని, అది మరీ దారుణమని భూమన కరుణాకర్రెడ్డి ఆక్షేపించారు.