హైదరాబాద్: ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ మాట్లాడుతున్నాడని, చంద్రబాబు మాట్లాడేదానికి, ప్రవర్తనకు పొంత లేకుండా పోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఒక పక్క టీడీపీ 150 సీట్లు గెలుచుకుంటుందని అనుకుంటూనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. చంద్రబాబుకు అసహనం ఎక్కువైంది. చీఫ్ సెక్రటరీని అనరాని మాటలు అనడం, రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వివేదిని అనరాని మాటలు అనడం, సమీక్షలు నిర్వహించడం ఏ ఒక్కటీ ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు చంద్రబాబులో కనిపించడం లేదు. సమీక్షలు జరుపుతున్నారు.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో నియమాలు ఉన్నాయి... ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటే తప్ప, ఎక్కడా అధికారులను పిలిపించి సమీక్షలు చేయరాదని ఉంది. పూర్వం పోలింగ్ జరిగిన తరువాత పది రోజులకు ప్రభుత్వం ఏర్పడేది.. ఈ సారి నెల రోజుల పైన ఫలితాలు విడుదల పట్టింది కాబట్టి జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు.. అపద్ధర్మ ముఖ్యమంత్రికి తగిన నియమాలు ఉంటాయి. పోలవరం, సీఆర్డీఏ, రివ్యూలు పెట్టారు. పోలీస్ రివ్యూ గత మూడు నెలలుగా హోంగార్డులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు, డీఏలు ఏవీ ఇవ్వలేదు. ఫండ్స్ అని ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు స్కీమ్లు పెట్టి వాడుకున్నారు. ఇంత దారుణమైన పాలన జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు గురించి చివరి నిమిషంలో రివ్యూ చేయాల్సిన అవసరం ఉందా..? 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. 2016 సెప్టెంబర్ 8వ తేదీ వరకు కేంద్రంతో మాట్లాడుకొని ప్రత్యేక హోదా వద్దు,, ప్యాకేజీ కావాలని పీయూష్ గోయల్ ఆ లేఖను కూడా చూపించారు. పోలవరం తీసుకున్నారు. 2014 నుంచి 2016 వరకు ఎందుకు పోలవరంను పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు అథారిటీకి సమాచారం ఇవ్వలేదు. రాష్ట్రం తరుపున ఎవరినీ నియమించలేదని కేంద్రం చెబుతుంది. పోలవరంను పక్కనబెట్టి పట్టిసీమ అనేది మొదలు పెట్టుకున్నారు. పోలవరం రైట్ కెనాల్ చేసే పనే పట్టిసీమ చేస్తుంది. ఎందుకు పట్టిసీమ కోసం రూ. 16 వందల కోట్లు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. పట్టిసీమకు రూ. 600 కోట్లు అనవసరంగా ఖర్చు చేశారని కాగ్ చెప్పింది. కాంట్రాక్టర్ను బాగు చేయడానికి ఖర్చు చేశారని చెప్పింది. రాజధాని రివ్యూ అంటున్నాడు. ఎమ్మెల్యే క్వార్టర్స్ తయారైనాయా లేదా.. రోడ్లు తయారయ్యాయా లేదా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది అవసరమా..? 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తరువాత ఐదు సంవత్సరాలు రాజధానిలో ఏం చేశారు. శివరామకృష్ణ కమిటీకి 1500 ఎకరాలు రాజధాని కట్టడానికి చాలని చెప్పారు. అది క్రమక్రమంగా 5 వేలు ఎకరాలు అన్నారు. తరువాత లక్ష ఎకరాలు అన్నారు. 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకొని తరువాత 50 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకొని లాస్టుకు అరణ్యభూమి కూడా 50 వేల ఎకరాలు కావాలని చెప్పి రియలెస్టేట్ వ్యాపారం చేశారు. జపాన్, సింగపూర్, కొరియా తిరగని దేశం లేదు. చివరకు వచ్చి రాజమౌళి డిజైన్లు తీసుకుంటానని చెప్పాడు. ఇది చంద్రబాబు చేసిన కాలయాపన మాకీ అండ్ అసోసియేట్స్ అని జపాన్ వాళ్లను ఆర్కిటెక్ట్ గురించి తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రొఫెషనలిజం లేదని వారు వెళ్తూ చెప్పారు. సంవత్సరం ముందు రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తున్నారు. చంద్రబాబు మళ్లీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుందంట. రాజధాని ప్రాంతంలో కంప చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పోలీసులను రివ్యూ చేయాలంట. ఐదేళ్లు పోలీస్ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించాడు. ఒకపక్కన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాడంట. ఐదేళ్లలో 23 మంది వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారికి టికెట్లు లేకుండా వారి జీవితాలను నాశనం చేయడం ప్రజాస్వామ్య పరిరక్షణా..? చంద్రబాబు, స్పీకర్ కలిసి రక్షించిన ప్రజాస్వామ్యం ఇదేనా..? చంద్రబాబు చెప్పేదానికి, చేసే దానికి ఒక్కదానికి కూడా పొంత ఉండదు. మాట్లాడితే.. నిప్పు అంటాడు. నీతితో ఐదేళ్లలో పాలన జరిగిందా.. జీఓ 22తో వేల కోట్ల రూపాయలు అంచనాలు పెంచడం నీతా..? పట్టిసీమ నీతా..? పోలవరం ప్రాజెక్టులో అవినీతి లేదా..? ప్రభుత్వ భూ కేటాయింపుల్లో నీతి ఉందా..? సీఆర్డీఏ భూముల్లో అవినీతి లేదా..? ప్రభుత్వ సంస్థలకు రూ. 4 కోట్లకు ఎకరాకు ఇచ్చారు.. చంద్రబాబుకు నచ్చిన వాళ్లకు మాత్రం రూ. 40 లక్షలకు ఎకరా ఇచ్చారు. దీంట్లో ఎంత నీతి ఉంది.. ఎంత అవినీతి ఉందో ఎవరికైనా అర్థం అవుతుంది. ఏదీ వదిలిపెట్టకుండా దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉచితంగా ఇసుక తెచ్చుకున్నవారు ఉన్నారా..? చివరకు దేవుడి భూములు, పుష్కరాలు పేరుతో కూడా దోచుకున్నారు. పుష్కరాలకు రూ. 3 వేలు ఖర్చుపెడతారా.. మీరు కట్టించిన మెట్లు ఇప్పటి వరకు ఉన్నాయా..? అసెంబ్లీలో చాలా చండశాసనుడిని అని మాట్లాడారు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకొని ఈడ్చుకొని వస్తే ఇప్పటి వరకు ఈ చండశాసనుడు చేసిందేమీ లేదు. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ కాంట్రాక్టర్లను బెదిరిస్తూ దొరికిపోతే.. ఇప్పటి వరకు చర్యలు లేవు. సభాపతి కుమారుడు ఓపెన్గా దొరికిపోతే ఏం చర్యలు తీసుకోలేదు. చింతమనేని ప్రభాకర్పై ఏమైనా చర్యలు తీసుకోలేదు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ట్రాన్స్పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై కేశినేని నాని, బోండా ఉమా, బుద్ధా వెంకన్న దూషణలు చేస్తే ఇంత వరకు కేసు కట్టలేదు. ఈ రోజు కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయమని చెప్పింది. ఆర్టికల్ 214లో ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని ఉంది. చంద్రబాబు ఎందుకు నాలుగున్నర సంవత్సరాలు హైకోర్టు ఏర్పాటు చేయలేదు. చివరి మూడు నెలల ముందు చంద్రబాబుకు కోర్టు అవసరం వచ్చింది. రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దు. ఇన్కం ట్యాక్స్ రావొద్దు. ఎలక్షన్ కమిషన్, ఈడీ వద్దంటున్నాడు. మీకు నచ్చింది ఏదీ చంద్రబాబూ.. ఎన్నికల నినాదం మీ భవిష్యత్తు నా బాధ్యత అని పెట్టాడు. సేవా మిత్ర అని ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం రోడ్డున పడేశారు. మహిళల పేర్లు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ నంబర్లు అని ప్రైవేట్ సంస్థల చేతిలో పెట్టారు. దీన్ని వాడుకొని ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచన. అదృష్టవశాత్తు ఈసీ జోక్యం చేసుకొని ఆపగలిగింది. ఆఖరికి సినిమాల్లో కూడా వివక్ష. యాత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు చూడకుండా కుట్రలు చేశారు. కొత్తగా చంద్రబాబు డ్రామా మొదలు పెట్టారు. ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడుతున్నాడు. టీడీపీకి 150 సీట్లు వస్తున్నాయని చెబుతున్నాడు. మరి ట్యాంపరింగ్ ఎవరు చేసినట్లు చంద్రబాబూ..? చెప్పే మాటలకు చేసే చేష్టలకు పొంతన ఎక్కడైనా ఉంటుందా.. ? వేమూరి హరిప్రసాద్ అనే వ్యక్తి వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తానని మాట్లాడుతున్నాడు. ఈవీఎంల కేసుల్లో ఇంతకు ముందు అరెస్టు అయిన వ్యక్తిని చంద్రబాబు సీఈసీ దగ్గరకు తీసుకెళ్తున్నాడు. ఆపరేషన్ గరుడ అని యాక్టర్ శివాజీతో చెప్పిస్తున్నారు. నిజానికి యాక్టర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేయించాలి. పరిపాలన మీద నమ్మకం లేక కేవలం ఒక్క పసుపు – కుంకుమ పేరు మీద ఓటు అడుగుతున్నారు. రూ. 25 వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాలకు వడ్డీ కట్టలేదు. రూ. 10,500 కోట్లు పొదుపు సంఘాల మహిళల తరుపున కట్టాల్సి ఉన్నా.. ప్రభుత్వం కట్టలేదు. పసుపు కుంకుమ అని మహిళలను మోసం చేస్తున్నారు. ఇది చాలక కొత్తగా అన్నదాత సుఖీభవ అని అంటున్నారు. ఎన్నికల వచ్చాయని మార్చి నెలలో రూ. వెయ్యి వేశారు. 11వ తేదీ పోలింగ్ ఉంటే 9, 10 తేదీల్లో రూ. 3 వేలు అకౌంట్లలో వేశారు. రైతులు కాకపోయినా బ్యాంకుల్లో డబ్బులు వేశారు. అర్హులైన రైతులు ఎవరో కూడా చంద్రబాబుకు తెలియదు. ఓడిపోతున్నారనే తెలిసే చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడుతున్నారు. డ్రామాలు ఆపి చివరి రోజుల్లో అయినా చంద్రబాబు ఉద్యోగులకు జీతాలు ఇప్పించే ప్రయత్నం చేయాలని బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కోరారు.