నీరు..నేల..నింగి..గాలిని కాపాడుకుందాం

వన మహోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ పిలుపు

ప్రతి ఒక్కరూ మూడు, నాలుగు చెట్లు నాటాలి

 ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటుదాం

33 శాతానికి అడవులను పెంచాల్సిన అవసరం ఉంది 

మనం పెంచే ప్రతి చెట్టు తర్వాతి తరానికి ఫలాలు ఇస్తుంది

పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

గుంటూరు: నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కాలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటి వీటిని కాపాడుకుందామని కోరారు. అడవుల విస్తిర్ణం ఏటేటా తగ్గిపోతుందని, వీటి శాతాన్నిపెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం వైయస్‌ జగన్‌ శనివారం గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఏమన్నారంటే..ఆయన మాటల్లోనే.. 
మనం నాటే ప్రతి మొక్కభూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాతి తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మాములుగా మనిషి బతకాలంటే ఏ జీవి అయినా కూడా ఈ లోకంలో బతకాలంటే ఆక్సిజన్‌ కావాలి. అటువంటి ఆక్సిజన్‌ ఇచ్చే ఏకైక ప్రాణి ఒక్క చెట్టు మాత్రమే. ప్రతి ప్రాణి ఆక్సిజన్‌ తీసుకొని కార్భన్ డై ఆక్సైడ్‌ను ఇస్తుంది. ప్రతి చెట్టు కార్భన్ డై ఆక్సైడ్‌ను తీసుకొని ఆక్సిజన్‌ ఇస్తుందన్నారు. ఈ సృష్టిలో బ్యాలెన్స్‌గా ఉండాలంటే చెట్లు బలంగా ఎదగాలన్నారు. రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23 శాతం మాత్రమే అడువులు ఉన్నాయి. ఇందులో 13 శాంక్షరీలు, మూడు నేషనల్‌ పార్కులు, రెండు జులాజికల్‌ పార్కులు, ఒక టైగర్‌ రిజర్వ్‌, ఒక ఎనుగు రిజర్వ్‌ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయి కదా అని గొప్పగా ఫీల్‌ కావాలా? లేక మొత్తం భూభాగంలో మూడింతల్లో ఒక భాగం అడవులు ఉండాలని జాతీయ అడవుల విధానం చెబుతున్నప్పుడు 33 శాతం ఉండాల్సిన అడవుల్లో మన రాష్ట్రంలో కేవలం 23 శాతం మాత్రమే ఉన్నాయని భాధపడాలో ఆలోచించుకోవాలి.

అశోకుడి గురించి మనం వింటుంటాం. ఆయన ఎందుకు అంత గొప్ప చక్రవర్తి అని మనం అంతా కూడా చరిత్ర పుస్తకాల్లో చూస్తే..అశోకుడు గొప్ప చక్రవర్తి, రోడ్లకు ఇరువైపు చాలా చెట్లు నాటించారని విన్నాం. ఆ చెట్లు ఎందుకు గొప్ప స్థానానికి చేరాయంటే..అవి వందల సంవత్సరాలు బతుకుతాయి, తరువాత తరాలకు మేలు చేస్తాయి. ఈ మధ్య కాలంలో వ్యవసాయానికి సంబంధించిన రివ్యూ తీసుకునేసమయంలో ఓ సీనియర్‌ పాత్రికేయుడు సాయినాథ్‌ చెప్పిన కొన్ని విషయాలు చెప్పారు. అవి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆయన అన్న మాటలు ఏంటో తెలుసా? కేవలం రెండు మూడు నెలలు పండే పంటలు చేసే సమయంలో , మిగతా తొమ్మిది నెలలు భూమిపై నేరుగా సూర్యకిరణాలు పడటంతో రాయలసీమలోని భూభాగం ఎడారిగా మారుతుందని చెప్పారు. భూమిపై ఏడాదంతా గ్రీన్‌ కవర్‌ లేకపోతే వేగంగా భూభాగం ఎడారిగా మారుతుందన్నది ఎవరూ కూడా  మరిచిపోకూడదు.

పర్యావరణం బాగుంటేనే మనమంతా కూడా బాగుంటాం. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో 2331 వృక్షజాతులు, 1461 జంతు జాతులు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జంతువులు, మొక్కలు అంతరించి పోతున్నాయి. మనం డైనోసార్స్‌ గురించి వింటుంటాం. ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే..పులులు అంతరించిపోతున్నాయి. పులుల సంఖ్య రాష్ట్రంలో కేవలం 42 మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆరు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. వీటిని గురించి మనం పట్టించుకోవడం మానేస్తే పులులు, సింహాలు ఏవి కూడా ఉండవు. మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ..రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటిదాకా నాలుగు కోట్ల మొక్కలు నాటాం. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటబోతున్నాం.

ఈ సీజన్‌లోనే 25 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంతో వన మహోత్సవంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటడం కాదు. ప్రతి ఒక్కరు మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుతామని గుర్తు ఎరగాలి. ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. గ్రామ వాలంటీర్ల చేత మొక్కల పెంపకం నాటే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను. నీడనిచ్చే మొక్కలు, టేకు మొక్కలు, ఎర్రచందనం మొక్కలు 12 కోట్లు మొక్కలు నాటేందుకు అటవీ శాఖ సిద్దంగా ఉంది. ప్రతి పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పాఠశాలలు తప్పనిసరిగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. బడి పిల్లలందరూ కూడా ముందుకు రావాలి. ఈ సందర్భంగా ప్రభుత్వం పర్యావరణ రక్షణ కోసం పూర్తిగా కట్టుబడి ఉంది.

ఇవాళ ఫార్మా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. పరిశ్రమలు వచ్చేసమయంలో పర్యావరణానికి మేలు చేస్తుందా? అన్నది ఆలోచన చేయాలి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ప్రక్షళన చేయబోతున్నామని చెబుతున్నాను. ఫార్మా రంగంలో లక్ష టన్నుల కాలుష్యం వస్తుందని నా దృష్టికి వచ్చింది. కేవలం 30 వేల టన్నులు మాత్రమే ఆడిట్‌ జరుగుతుందని, మిగతాది కాల్చివేయడం, లేదా సముద్రంలో వేయడం జరుగుతుంది. పరిశ్రమల్లో ఎంత కాలుష్యం వస్తుంది. ఏ రకంగా మనం డిస్పోజ్‌ చేయాలో ఆలోచన చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోబోతోంది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఈ ఏడాది అక్షరాల ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఎలక్ట్రసిటీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కాలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వీటిని కాపాడుకుందాం.

గాంధీజీ గతంలో ఒక మాట అన్నారు. ప్రపంచంలో ఇవాళ మనిషికి కావాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ ప్రపంచమైనా కూడా మనిషిని గ్రీడిని తట్టుకునే ప్రపంచమే లేదని గాంధీజీ చెప్పిన మాటలను సీఎం వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అందరికి పిలుపునిస్తున్నాను. అందరూ కూడా తోడుగా నిలబడాలని కోరుతూ..జై హింద్‌.

 

Back to Top