పవన్‌ కల్యాణ్‌ చెత్తులెత్తేశాడు.. బట్టలు విప్పేశాడు

మంత్రి అంబటి రాంబాబు

బాబు శపథాన్ని నెరవేర్చేందుకు జన సైనికులను తాకట్టు పెట్టిన పవన్‌ కల్యాణ్ 

బాబుతో కుదిరిన డీల్‌ ఏమిటో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలి
 
ప్యాకేజి స్టార్‌ కాకపోతే.. నీవెందుకు బాబుతో కలుస్తున్నావ్‌?

సూటిగా ప్రశ్నించిన మంత్రి అంబటి రాంబాబు

మళ్ళీ మళ్ళీ చెబుతున్నా.. నీవు ప్యాకేజీ స్టార్‌ వే.. 
 
టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీ.. కాపులను అణచివేసిన పార్టీ
 
సీఎం వైయ‌స్‌ జగన్‌ గారు కాపులకు అండగా నిలిచారు.. 
 
కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్‌ కు లేదు

మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

 తాడేప‌ల్లి: పవన్‌ కల్యాణ్‌ చెత్తులెత్తేశాడు.. బట్టలు విప్పేశాడని  రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన శపథాన్ని నెరవేర్చడమే ధ్యేయమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చాటి చెప్పుకున్నారని ధ్వజమెత్తారు. జనసేన కార్యకర్తలు, కాపులను చంద్రబాబుకు పవన్‌ తాకట్టు పెడుతున్నారని చెప్పారు. పవన్‌ జనసేనను ప్రారంభించింది ప్రజల కోసం కాదని, చంద్రబాబు కోసమేనన్నారు. మంత్రి తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.  

బాబుకు ఊడిగమే ఆయన సిద్ధాంతం:
    ఇవాళ పవన్‌కళ్యాణ్‌ ప్రసంగం విన్న తర్వాత ఒకటి గుర్తుకొస్తుంది. రాజకీయాల్లో హత్యలేమీ ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి. స్వయం కృతాపరాధాల వల్లనే నాయకులు విఫలం అవుతారంటారు. తాను ఒక  ఫెయిల్యూర్‌ పొలిటీషీయన్‌ను అని గుర్తొచ్చే పవన్‌ అలా మాట్లాడి ఉంటాడు.
    పవన్‌కళ్యాణ్‌ అనే వ్యక్తి పార్టీ ప్రారంభించింది రాజకీయాలు చేయడం కోసం కాదని, కేవలం చంద్రబాబును, టీడీపీని కాపాడటం కోసమేనని గతంలోనే చెప్పాం. చంద్రబాబును అధికారంలోకి తీసుకు రావడం కోసమే పవన్‌కళ్యాణ్‌ రాజకీయ పార్టీని పెట్టారనేది నిజం. తొలిసారి 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా టీడీపీకి సపోర్టు చేసి గెలిపించాడు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు మూడో పార్టీగా పోటీకి దిగి టీడీపీకి సహాయం చేశారు. అయినా రెండు పార్టీలు ఓడిపోయాయి.
    ఈరోజు ఎన్నికల సమయం వచ్చేసరికి మరలా తన ప్రత్యర్థి జగన్‌గారు అని పవన్‌ చెబుతున్నాడు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి అధికారం లాక్కుని ప్రజలకు ఇస్తామంటున్నాడు. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి పవన్‌కళ్యాణ్‌? అంటే నీ దృష్టిలో చంద్రబాబును తిరిగి సీఎం సీటులో కూర్చొబెట్టడమా? దీనిపై పవన్‌కళ్యాణ్‌ నుంచి స్పష్టమైన సమాధానం రావాలి. మరలా చంద్రబాబుకు అధికారం కట్టబెట్టడానికే తాను రాజకీయం నడుపుతానని పవన్‌కళ్యాణ్‌ మరోమారు చెబుతున్నాడా? అని నిలదీస్తున్నాను. 

ఎన్నికలకు ముందే సరెండర్‌:
    అధికారం, రాజకీయంపై పవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే, అతను ఎన్నికలకు ముందే చేతులెత్తేశారు. కానీ దాన్ని ఆయనకు మద్దతు ఇస్తున్న అభిమానులతో పాటు కాపు సోదరులు, జన సైనికులు, ఆయన పక్షాన ఉండి పోరాడుతున్నామంటున్న వీరమహిళలు అర్ధం చేసుకోలేకపోయారు. పవన్‌ ఎప్పటికీ సీఎం కాలేడు. చంద్రబాబును సీఎం చేయడం కోసమే ఆయన పని చేస్తున్నాడని మేం చెబుతున్నాం. తాను సీఎం రేస్‌లో లేనని నిన్న చెప్పిన పవన్, ఇవాళ మాట మార్చారు. ఎన్నికలు అయ్యాక సీఎం పదవి గురించి ఆలోచిస్తానంటున్నాడు. 

వారికి అధికారం రాదు:
    పొలిటికల్‌ టూరిస్టులకు ఎప్పటికీ అధికారం రాదు. అసలు జనసేనకు ప్రజామద్ధతు, బలమే లేదని స్వయంగా పవన్‌ చెప్పాడు. 137 చోట్ల పోటీ చేస్తే, ఒక్క చోటే గెల్చామన్న పవన్, ఇక ముందు కూడా తాము సింగిల్‌గా పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతామని స్పష్టంగా చెప్పాడు. 
    ‘అయ్యా పవన్‌.. తిని తొంగుంటే పార్టీ గెలిచిద్దా.. మెజార్టీ స్థానాలు గెలుచుకుంటావా..? లేదా క్యాష్‌ ప్యాకేజీ తీసుకుని షూటింగులు చేసుకుంటే నీ పార్టీకి మద్ధతు పెరుగుతుందా..? వారాహిని అందంగా తయారు చేసుకుని యాత్ర మొదలుపెట్టకుండా దాన్ని తుప్పుబట్టేలా చేస్తే జనసేనకు మద్ధతు పెరుగుతుందా..?  ఏదో పొలిటికల్‌ టూరిస్టుగా అప్పుడప్పుడు ఆంధ్రాకు వచ్చి జగన్‌మోహన్‌రెడ్డి గారిని, వైఎస్‌ఆర్‌సీపీని తిడితే.. చంద్రబాబును పొగిడితే.. మీకు అధికారం వస్తుందా..?’ 

తాకట్టు పెట్టే ప్రయత్నం:
    శాసనసభలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయ్యాకనే మళ్లీ అక్కడకు అడుగు పెడతానని శపథం చేశాడు గదా.. ఆ వీరశపథాన్ని నెరవేర్చేందుకే వవన్‌కళ్యాణ్‌ ఈరోజు అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. అందుకు వీరమహిళలు, జనసైనికులు, కాపుసోదరులు, ఆయన అభిమానులందర్నీ టీడీపీకి, చంద్రబాబుకు తాకట్టు పెట్టే దుస్థితికి పవన్‌ దిగజారిపోయాడనే విషయం అందరూ గమనించాలని కోరుతున్నాను. 

బాబు ముష్టికి ఆరాటం:
    చంద్రబాబుతో పొత్తుకు తాను అంత తేలిగ్గా అంగీకరించనని స్వయంగా వపన్‌కళ్యాణ్‌ చెబుతున్నాడు. అంటే, ఆయన ముష్టి వేస్తే కాపు జాతి మొత్తాన్ని తాకట్టుపెట్టే దుస్థితికి అంతగా దిగజారిపోయావా...? రాజకీయాల్లో ఇంతకన్నా ఘోరం ఏం చూస్తాం.. పవన్‌ కళ్యాణ్‌ ..? అని నిలదీస్తున్నాను.

జగన్‌గారిని ఎందుకు దించాలి..?
    మాట్లాడితే జగన్‌గారిని అధికారంలో నుంచి దించుతాం. ఆ పని చేసే వరకు పోరాడతాం.. ఆయన్ను దించడమే మా లక్ష్యమంటూ.. మా పొత్తులంటూ పవన్‌కళ్యాణ్‌ ఎందుకు రంకెలేస్తున్నాడు..? అసలు, మా జగన్‌గారిని అధికారంలో నుంచి ఎందుకు దించాలనుకుంటున్నావు..? స్వచ్ఛమైన, నీతిమంతమైన పరిపాలన నీకు నచ్చదా పవన్‌కళ్యాణ్‌ ..? అని నిలదీస్తున్నాను. నువ్వు భుజానెత్తుకుని మోస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్న జగన్‌ గారిని అధికారంలో నుంచి దించేయాల్నా..? అని ప్రశ్నిస్తున్నాను. 

అమ్ముడు పోయింది నువ్వు కాదా సకలకళా వల్లభా?:
    రెండు మూడు దేశాలు, రెండు మూడు భాషలు వచ్చిన వాళ్లను పెళ్లిళ్లు చేసుకున్న వపన్‌కళ్యాణ్‌ కంటే సకలకళా కోవిదులు, సకలకళా వల్లభులు ఎవరైనా ఉంటారా..?. 
    నేను అడిగే కొన్ని ప్రశ్నలకు పవన్‌కళ్యాణ్‌ సమాధానాలివ్వాల్సిన పరిస్థితి ఉంది. నోవాటెల్‌లో పవన్‌ను చంద్రబాబు కలిసి మాట్లాడాడు. పవన్‌ ఏమో బాబు హైద్రాబాద్‌లో ఉండగా, వారింటికి వెళ్లి మరీ కలిసొచ్చాడు. పవన్‌ రాజకీయంలో రహస్యాలేమీ ఉండవు అంటున్నాడు కదా.. మరి, ఇన్నిసార్ల బాబు, పవన్‌ల కలయికల్లో ఏం మాట్లాడుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి కదా..?
    పవన్‌ను ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతామన్నారే.. ఇప్పుడు ఏ చెప్పుతో ఈ ప్యాకేజీ స్టార్‌ను కొట్టాలి..?  మేం ఇప్పటిదాకా విమర్శిస్తుంటే, చాలా మందికి కోపం వచ్చింది. అందుకే, ఈరోజు మరోమారు చెబుతున్నదేమంటే, ఖచ్చితంగా పవన్‌కళ్యాణ్‌ బాబుకు అమ్ముడు బోయాడనడం ముమ్మాటికీ పచ్చి నిజం. 

ఆ నైతిక హక్కు పవన్‌కు లేదుః
    గతంలో చిరంజీవిగారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు తనను నమ్ముకున్న వారిని వపన్‌కళ్యాణ్‌లాగా ఎవరికి తాకట్టు పెట్టలేదే..? ప్రజారాజ్యం తరఫున పది స్థానాలు గెలుపొందితే.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో తన పార్టీని విలీనం చేసి తద్వారా ఒక పెద్ద పదవిని అనుభవించి రాజకీయాలకు నమస్కారం పెట్టారు. చిరంజీవికి ఉన్న రాజకీయ విలువ కూడా ఆయన తమ్ముడు పవన్‌కళ్యాణ్‌కు లేదా..?
    2014లో అధికారం కట్టబెట్టిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై బాబును నిలదీస్తానన్నావు. మరి, ఏ సమస్య పై నువ్వు నిలదీశావు పవన్‌..?  కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేసినప్పుడు ఆయన్ను రకరకాలుగా చంద్రబాబు హింసించినప్పుడు వపన్‌కళ్యాణ్‌ ఎక్కడికి వెళ్లాడు..? ఆరోజు వైఎస్‌ఆర్‌సీపీ ముద్రగడకు అండగా ఉండి.. మీటింగులు కూడా పెట్టిందని కాపు జాతి గుర్తు చేసుకోవాలి. అసలు, కాపు జాతి గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్‌కళ్యాణ్‌కు లేదని స్పష్టం చేస్తున్నాను. 

కాపులకు అండగా జగన్‌గారుః
    చంద్రబాబుకు తాకట్టుపెట్టేందుకు కాపు జాతినంతటినీ చంకలో పెట్టుకుని వస్తానని మాటిచ్చి వచ్చిన పవన్‌కళ్యాణ్‌ను నమ్ముకోవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని తెలుసుకోవాలి. కాపులపై క్రిమినల్‌ కేసుల్ని తీసేసి.. వారికి కాపునేస్తం పథకంతో పాటు ఇతర అన్ని సంక్షేమ పథకాల్ని అందజేసి.. కాపులకు రాజకీయంగా, సామాజికంగా అన్నింటా ప్రాధాన్యమిచ్చిన నాయకుడు జగన్‌గారు. 

పోలవరంపై ఈనాడు బురద రాతలుః
    రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును కేంద్రమే ప్రతీ పైసా ఖర్చుపెట్టి పూర్తి చేసి జాతికి అంకింతం చేయాలని విభజన చట్టంలో ఉంటే, మరి ఈ చంద్రబాబు మాత్రం మేం కడతాం.. మీరు డబ్బులివ్వండని కేంద్రం చుట్టూ అదేపనిగా తిరిగాడు. 2013–14 రేట్ల ప్రకారమే తాను ప్రాజెక్టును నిర్మిస్తామని 2016లో చంద్రబాబు అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అప్పటికే ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు రాయపాటి సాంబశివరావు కంపెనీకి ఉండగా, ఆ కంపెనీని కాదని రామోజీరావు బంధువుకు చెందిన నవయుగ కంపెనీతో నామినేటెడ్‌గా అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అప్పట్లో ఎలాంటి పారదర్శక విధానాల్ని పాటించలేదు.  
    ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రివర్స్‌ టెండర్‌ విధానంతో పూర్తి పారదర్శకంగా వ్యవహరించడం మెఘా కంపెనీకి నిర్మాణ బాధ్యత మేం అప్పగించడం కూడా తెలిసిందే. మరి, ఈరోజు ఈనాడులో పోలవరం గురించి రాస్తూ కాంట్రాక్టర్‌ను మార్చబట్టే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమని రాసుకుంటున్నారు.
    అంటే, రామోజీరావు కొడుక్కు స్వయాన వియ్యంకుడు నవయుగ విశ్వేశ్వరరావు కంపెనీని తీసేశారనే అక్కసు ఈనాడు కథనంలో కనిపిస్తుంది. దోచుకో.. తినుకో కార్యక్రమంలో భాగంగా రామోజీరావు, నవయుగతో పాటు చంద్రబాబుకు వచ్చే వాటాలన్నీ ఇప్పుడు రావడం లేదు కనుక మా ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. 

మేము వచ్చాకే ఆ రూపురేఖలు మారాయిః
    సీఎంగా జగన్‌గారు బాధ్యతలు చేపట్టాకనే, పోలవరం ప్రాజెక్టు రూపురేఖలు మారాయని గుండెలపై చెయ్యేసుకుని నేను చెబుతున్నాను. స్పిల్‌వే పూర్తి చేయడమే కాకుండా నది డైవర్షన్‌ను మేమే చేశాం. లోయర్‌ కాఫర్‌డ్యాం, అప్పర్‌ కాఫర్‌ డ్యాం మా హయాంలోనే పూర్తయ్యాయి. గతంలో వీటన్నింటినీ అప్పటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేశారు. కాఫర్‌ డ్యాం పూర్తికాకుండా డయాఫ్రం వాల్‌ ఎలా కట్టారయ్యా..? అని గతంలో ఎన్నో మార్లు అడిగాను. దానికి చంద్రబాబు, రామోజీరావు దగ్గర్నుంచి సమాధానం రాలేదు. పిచ్చిరాతలు రాసి ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నాన్ని ఇకనైనా రామోజీరావు మానుకోవాలని మంత్రి  అంబటి రాంబాబు అన్నారు.

Back to Top