తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు, వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు చేపట్టిన పాదయాత్రలు సుపరిపాలనకు నాందీ పలికాయని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తండ్రీకొడుకులు పాదయాత్ర చేసిన ఘటనలు దేశంలో ఎక్కడా కనిపించవని, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇది సాధ్యమైందన్నారు. వారి పాదయాత్రల్లో తాను కూడా భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ‘ప్రజాప్రస్థానం’ 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహానేతకు నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. అలాగే నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, కాకమాను రాజశేఖర్, చెల్లా మధుసూదన్రెడ్డి, వర్షవర్ధన్రెడ్డి, నారాయణమూర్తి సహా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఏమన్నారంటే..వారి మాటల్లోనే - దేశాన్ని కదిలించిన ప్రజాప్రస్థానం: అంబటి రాంబాబు, మాజీ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. ఎండలు మండే ఏప్రిల్ నెలలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే సంకల్పంతో ఆయన ఈ యాత్ర చేపట్టారు. ఇచ్చాపురం వరకు సాగిన ఈ పాదయాత్రలో వైఎస్సార్ సాధారణ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ రోజుల్లో కార్వాన్లు, సౌకర్యాలు లేకపోయినా రోడ్డు పక్కనే విశ్రాంతి తీసుకుంటూ యాత్ర కొనసాగించారు. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి, తర్వాత సంక్షేమ పాలనకు బాటలు వేసింది. వైఎస్సార్ పాదయాత్ర ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో కూడా ప్రభావం చూపింది. పాదయాత్రలో మొదటి రోజు నుంచి చివరి వరకు తాను, లగడపాటి రాజగోపాల్, భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొనడం గర్వకారణం. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరింత సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తండ్రికి మించిన నాయకుడిగా నిలిచారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పాలనలో ప్రతిబింబింపజేశారు. - రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు: గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైయస్సార్ను తలచుకునేందుకు గర్వపడుతున్నాను. వైఎస్సార్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పింది. ఈ రాష్ట్రం ఎలా ఉందో నెక్స్ట్ జనరేషన్కు చెప్పాలంటే ..2004కు ముందు, తరువాత రాష్ట్ర పరిస్థితులు ఎలా మారాయో చర్చించాల్సిన అవసరం ఉంది. మండు వేసవిలో ప్రజల సమస్యలను తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పాలన అందించడం వైఎస్సార్ నాయకత్వానికి నిదర్శనం. వైఎస్సార్ ప్రజాప్రస్థానం పాదయాత్ర కేవలం రాజకీయ యాత్ర కాకుండా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఉద్యమంగా నిలిచింది. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్ కూడా పాలనలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. - తండ్రీకొడుకుల పాదయాత్ర చరిత్రాత్మకం: అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ దేశ చరిత్రలో తండ్రీకొడుకులు ఇద్దరూ పాదయాత్రలు చేసి ప్రజల్లో మమేకమవడం అరుదైన విషయం. వైఎస్సార్ సుమారు 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు రూపకల్పన చేశారు. అలాగే వైఎస్ జగన్ 3,600 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. తండ్రి ఒక్క అడుగు వేస్తే తనయుడిగా నాలుగు అడుగులు ముందుకు వేస్తూ సంక్షేమ పాలన అందించారు. - సువర్ణ అక్షరాలతో నిలిచిన చారిత్రక ఘట్టం: మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైయస్ఆర్ పాదయాత్ర ప్రారంభమైన రోజును సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన అవసరం ఉంది. ఆనాటి పరిస్థితుల్లో రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, మహిళలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైయస్ఆర్ మండుటెండల్లో మహాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. ఆ పాదయాత్ర ప్రభావం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రక మలుపు తీసుకువచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్పై తొలి సంతకం పెట్టిన నాయకుడు వైయస్ఆర్రు. అలాగే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వైయస్ఆర్ అడుగుజాడల్లోనే ప్రస్తుత నాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డి గారు నడుస్తున్నారు, వైయస్ఆర్సీపీ స్థాపించి తండ్రిని మించిన తనయుడిగా గత ఐదేళ్ల పాలన సాగించారు. వైయస్ఆర్ ఆలోచనలతోనే వైయస్ఆర్సీపీ నూటికి నూరుపాళ్లు ముందుకు సాగుతోందని అని మల్లాది విష్ణు అన్నారు. - పేదల గుండెల్లో చిరస్థాయిగా వైయస్ఆర్కు స్థానం: రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ఈ రోజుకీ కొనసాగుతున్నాయి. పేదల ఆరోగ్యానికి, విద్యకు ఇవి అండగా నిలిచాయి. జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించి వేల ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుంది. వైఎస్ జగన్ కూడా రాయలసీమ అభివృద్ధికి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు.