హైదరాబాద్: చంద్రబాబు రోజుకో స్టేట్ మెంట్ తో భ్రమ కల్పిస్తున్నారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన ఊపిరితో కొట్టుకుంటున్న పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈనెల 23 తర్వాత ఉత్కంఠకు తెరపడుతుందన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే ప్రచారం చేసుకుంటున్నారని, తమదే అధికారమని చంద్రబాబు భ్రమపడుతున్నారన్నారు. ఎన్ని సీట్లో చెప్పకుండానే అధికారంలోకి వస్తామని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుపై అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరిగి సాధించిందేమీ లేదని చంద్రబాబు జాతీయ నేతలను కలిసి ఫొటోలు మాత్రమే తీసుకోగలిగారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో వైయస్ జగన్మోహన్రెడ్డి కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సర్వేలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. మా డిమాండ్లు అంగీకరించిన వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన వారికే మా మద్దతు ఉంటుందని తెలిపారు. సర్వేలపై తేల్చేందుకు ఈనెల 19న మేం సిద్ధం..మీరు సిద్దమా ? అంటూ సవాల్ విసిరారు. టీడీపీది గతం.. వైయస్ఆర్సీపీది భవిష్యత్ అని అర్ధమవుతోందన్నారు. ఏనాడైనా కరువుపై చంద్రబాబు కేబినెట్ నిర్వహించారా..? ఫలితాలు వచ్చే కొద్ది రోజుల ముందు కేబినెట్ ఎందుకు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.మంచినీటి సమస్యనైనా కేబినెట్లో చర్చించారా.. పెడుతున్న కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు తీరులో ఎక్కడా హుందాతనం కనిపించడంలేదన్నారు. చంద్రబాబుకు రిటైర్ మెంట్ దగ్గరపడిందని ఇదే చివరి కేబినెట్ అన్నారు.40 ఏళ్ల అనుభవం అంటూ గొప్పులు చెప్పుకునే చంద్రబాబు చేతికి ఈ రాష్ట్రాన్ని ఎందుకు అప్పజెప్పామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు.ఈసీని,సీఎస్ ను దూషించి చంద్రబాబు సాధించిందేంటని ప్రశ్నించారు.