పుట్టపర్తి: ప్రతి నెలా ఒకటో తేదీ భానుడి తొలి కిరణం ప్రసరించకముందే వైయస్ఆర్ పింఛన్ కానుక చేతికి అందుతోంది. అభాగ్యుల మోముల్లో ఆనందం వికసిస్తోంది. ఏ ఆసరాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డప్పుకళాకారులకు నేనున్నానంటూ వైయస్ జగన్మోహన్రెడ్డి ఠంచనుగా పింఛన్ అందిస్తూ వారి జీవితాల్లో సంక్షేమ కాంతులు నింపుతున్నారు. అర్హతే ప్రమాణికంగా పింఛన్ కానుక ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హతే ఆధారంగా వైయస్ఆర్ పింఛన్ కానుక అందిస్తున్నారు. గత పాలకులకు భిన్నంగా పైసా లంచం లేకుండా.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా...అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజామునే వలంటీర్లు ఇంటింటికీ తిరిగి పింఛన్ పంపిణీ చేస్తుండగా...ఆ రోజు ఏ గ్రామంలో చూసినా.. పండుగ వాతావరణం కనిపిస్తోంది. మనవడు కానుక పంపాడని వృద్ధుడు...అన్నయ్య డబ్బు పంపాడని వితంతువులు, మా జగనన్న మా కోసం నిలిచాడని దివ్యాంగులు సంబరపడుతున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పాలన అందించలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు. పింఛన్ లబ్ధిదారులకు రూ.4 వేల కోట్లకుపైనే లబ్ధి రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక జిల్లా వాసులకు పింఛన్ రూపంలోనే (2019–2023) రూ.4,131 కోట్లు లబ్ధి చేకూరింది. జిల్లాలో ప్రస్తుతం 2,64,725 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, వీరందరికీ ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని ఏటా రూ.250 మేర పెంచుతూ పోయారు. ప్రస్తుతం పింఛన్దారులకు రూ.3 వేలు అందుతోంది. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ అమలులోకి రావడంతో పాటు వలంటీర్ల సేవలు ఊపందుకున్నాయి. ప్రతి వలంటీర్ తమ పరిధిలోని 50 ఇళ్లలో పింఛన్దారులకు ఒకటో తారీఖు ఉదయమే సొమ్ము అందజేస్తున్నారు. నేటి నుంచి పింఛన్ల పంపిణీ జిల్లాలో పింఛన్ కానుక పంపిణీ గురువారం తెల్లవారుజామునుంచే ప్రారంభం కానుంది. జిల్లాలో 2,74,572 మంది పింఛన్ లబ్ధిదారులుండగా, ప్రభుత్వం రూ.81.95 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను బుధవారం సాయంత్రమే సచివాలయ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసినట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు వాలంటీర్లు. ఉదయం గం. 8.00ల వరకూ 23.99 శాతం పెన్షన్ల పంపిణీ చేశారు. 15.87 లక్షల మందికి సుమారు రూ.469 కోట్లు పెన్షన్ల అందజేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 66,15,482 మంది అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగ, వివిధ రకాల చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు ఫిబ్రవరి ఒకటి నుంచి ఠంఛన్గా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం రూ.1961.13 కోట్లను విడుదల చేసింది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ పరిధిలో ఉండే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా రూ.1,961.13 కోట్లను బుధవారం ఉదయానికే జమ చేసింది. ఆయా సచివాలయాల సిబ్బంది బుధవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్ల వారీగా పంపిణీని దాదాపుగా పూర్తి చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వెల్లడించారు. కాగా, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. రాష్ట్రంలోని 26 జిల్లాల డీఆర్డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.