గుర్తున్నాయా...ఎన్నికల ముందు రోజు వరకూ చంద్రబాబు చెప్పిన మాటలు. చూపించిన ప్రచారచిత్రాలు. రాయలసీమ చివరి ఊరి వరకూ నీళ్లిచ్చా అన్నాడు.కృష్ణా నీళ్లను రాయలసీమకు పారించా అన్నాడు. నదుల అనుసంధానంతో కరువును జయించా అన్నాడు. పచ్చదనం పీటేసుకుని ఆంధ్రప్రదేశ్ వాకిట్లో కూర్చోడానికి నేనే కారణం అన్నాడు. నీళ్ల గురించి బాబు చెప్పిన మాటలేమిటి? వాస్తవంగా ఉన్న పరిస్థితులేమిటి? ఒకసారి చూద్దాం. సాగర్ నుంచి తరలించిన నీటితో రాయలసీమలో సిరులు అంటూ ఊదరగొట్టింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ అదంతా అబద్ధం అని ఎన్నికల తర్వాత బయటపడుతోంది.రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి నిల్వలు లేక జలాశయాలు బోసి పోతున్నాయి. సీమలోనే కాదు కోస్తా తీరంలోనూ తీవ్ర నీటి కొరత ఏర్పడింది. సాగునీరే కాదు తాగునీరు కూడా దొరకని పరిస్థితి. శ్రీశైలం,నాగార్జున సాగర్, పులి చింతల, సోమశిల, తుంగభద్ర, వెలిగోడు, సీబీఆర్, పీఏబీఆర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు దాదాపుగా లేవు. రాష్ట్రంలో 667 మండలాల్లో 460కి పైగా మండలాల్లో తీవ్రమైన నీటి సమస్య ఉంది. ఇప్పటికే టాంకర్లలో మంచినీటి సరఫరా జరుగుతోంది. అంటే కనీస స్థాయినీటి నిల్వలు కూడా లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం పారించానని చెప్పుకుంటున్న గొప్ప మాటలన్నీ నీటిమూటలే అని అర్థం అవుతోంది. ఇక అపర భగీరధుడు అమరావతీ నాధుడు అంటూ కీర్తించి కిరీటాలు పెట్టిన పచ్చ పత్రికలు ఇప్పుడు కరువు మండలాల జాబితాలు ప్రకటిస్తున్నాయి.మరోపక్క చంద్రబాబు కరువు భత్యాల కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు. అందినంత దండుకోవడం, అధికారం చేజారిపోయేలోపు చిల్లర కూడా సర్దేసుకోవడం అనే లేకితనం చంద్రబాబులో కనిపిస్తోంది. ఇన్నేళ్లూ రాష్ట్రం సుభిక్షం అనిచెప్పిన నోటితోనే కరువు నిధులను గుటకాయస్వాహా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు టీడీపీనేతలు. చివరకు కేంద్రం ఏటా విడదల చేసే ఉపాధి హామీ నిధులను కూడా బిల్లుల చెల్లింపుల పేరుతో తమ్ముళ్ల ఎక్కౌంట్లకు సర్దుబాటు చేసేస్తున్నారు. ఎన్నికలకు కొద్దినెలల ముందే పంచాయితీశాఖా మంత్రి కుప్పలు తెప్పలుగా కాంట్రాక్టు పనులు పురమాయించారు.వాటన్నిటి బిల్లుల క్లియరెన్సుల కోసం ఉపాధిసొమ్ములు, కరువు నిధులను మళ్లించేస్తున్నారు. అంటే ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే తమ్ముళ్ల జేబులు నింపేసేందుకు ఆత్రుత పడిపోతున్నారు చంద్రబాబు.