చంద్రబాబు పదే పదే చెప్పే ఆర్థిక రాజధాని. ఐటీ హబ్ అని ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రచారం చేసే మహానగరం. విశాఖ. అలాంటి విశాఖపట్నం నగరమే కాదు జిల్లా మొత్తం అధికారపార్టీ నేతలకు కబ్జాలకు అడ్డాగా మారిపోయింది. భూ రికార్డులు మాయం కావడం, తారుమారైపోవడం, బాధ్యులను తప్పించి బాధితులకు అన్యాయం చేయడం ఈ కుంభకోణంలో అత్యంత దారుణమైన విషయం. కలెక్టర్ లెక్కల ప్రకారమే జిల్లాలో 10,000 ఎకరాలకు పైగా భూమి లెక్కలు తారుమారయ్యాయి. అంటే దాదాపు 25,000 కోట్ల విలువ చేసే భూమి మాయం అయిపోయిందన్నమాట. ఈ స్కామ్ లో మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును అదే పార్టీకి చెందిన మరో మంత్రి అయ్యన్న పాత్రుడే బయటపెట్టాడు. విశాఖ భూముల విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో తప్పనిసరై ముఖ్యమంత్రి విచారణ కమిటీ వేసాడు. ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల డిమాండ్ పై తర్వాత సిట్ కు ఆదేశించారు. తాసిల్దారులు, మంత్రులు, అధికారపార్టీ పెద్దలు కలిసి చేసిన అత్యంత భారీ కుంభకోణం ఇదని మీడియా సాక్ష్యాలతో బైటపెట్టినా ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకున్నదే లేదు. వేలాది ఎకరాల భూములు కబ్జా అయితే అరెస్టు చేసింది కేవలం ఒకే ఒక్క వ్యక్తిని. ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కున్న గంటాపై బాధితులే వందలాది ఫిర్యాదులు చేసారు. సిట్ అధికారుల ముందుకే వచ్చి మొరపెట్టుకున్నారు. 2875 కేసులు ఈ విశాఖ భూముల విషయంలో నమోదయ్యాయి. కానీ సిట్ అధికారులు మాత్రం వాటిలో కేవలం 336నే పరిగణలోకి తీసుకున్నారు. విశాఖ జిల్లాలో ఉన్న 3022 గ్రామాల్లో 2లక్షల ఎఫ్.ఎం.బి సర్వే నెంబర్లలో 16,000 నెంబర్లు గల్లంతయ్యాయి. దీనిలో సుమారు లక్ష ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినట్టు చర్చ జరిగింది. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని 10,000 ఎకరాలుగా మాత్రమే చిత్రించే ప్రయత్నం చేసారు. ముందు ఈ కుంభకోణంపై బహిరంగ విచారణ చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. హామీల విషయంలో అసంతృప్తిగా ఉన్న ప్రజలకు అధికారపార్టీ నేతల అవినీతి పర్వం కూడా బట్టబయలైతే 2019 ఎన్నికలకది అవరోధం అవుతుందని భావించే సొంత పార్టీ నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేలా పావులు కదిపారు చంద్రబాబు. టిడిపి నేతలు, వారి సహచరులు, అనుచరుల పేర్లేవీ బయటకు రాకుండా సిట్ పై ఒత్తిడి తెచ్చారు. ప్రజలిచ్చిన కంప్లైట్లనే పక్కన పెట్టి, కొన్ని ఫిర్యాదులనే ఎంపిక చేసి విచారణ చేయడంలోనే సిట్ దర్యాప్తు పక్కదారి పట్టిందని అర్థం అవుతోంది. బాధితుల్లో ఎంతో మంది మంత్రి గంటా పై ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా సిట్ తన నివేదికలో గంటాను మిస్టర్ క్లీన్ అని చెప్పింది. ప్రతిపక్షాలు, ప్రజలు అన్నట్టుగా సిట్ అనేది చంద్రబాబు జేబు సంస్థ అని, దాని నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది తప్ప బాధితులకు న్యాయం చేసేదిగా లేదని అంటున్నారు న్యాయ నిపుణులు. విశాఖ భూములు మింగిన పచ్చ రాక్షసులు కబ్జా కోరల్లో చిక్కిన భూమి - లక్ష ఎకరాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం - 10,000 ఎకరాలు భూముల విలువ - 25,000 కోట్లు గల్లంతైన సర్వే నెంబర్లు - 16,000 కబ్జాలపై నమోదైన ఫిర్యాదులు - 2,875 విచారణకు నోచుకున్నవి - 336 ఆరోపణలు ఉన్నది - టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాలపల్ల ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, రెవెన్యూ అధికారులు పై... సిట్ విచారణకు ఆదేశం - 2017 జూన్ సిట్ నివేదిక - 2018 నవంబర్ నివేదిక తర్వాత - సిట్ నివేదికపై కమిటీ నియమించిన చంద్రబాబు ఫలితం - బాధితులకు నేటికీ దక్కని న్యాయం