చంద్రబాబు ఎన్నికల అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతున్నాయి. ప్రత్యేకించి రుణమాఫీ విషయంలో చంద్రబాబు ద్వంద ధోరణి దాన్ని నిరూపిస్తోంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు వెనుక రుణమాఫీ హామీ ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నో రైతు కుటుంబాలు తమ రుణాలు మాపీ అవుతాయని ఆశించి నాడు చంద్రబాబుకు ఓటేసాయి. కానీ గద్దె ఎక్కగానే తన బుద్ధి చూపించారు బాబు. అధికారంలోకి వస్తే రుణమాఫీపై తొలిసంతకం అన్న నోటితోనే రుణమాఫీ కమిటీ ఏర్పాటుకు సంతకం చేసి సగం హామీని అటకెక్కించాడు. రకరకాల కొర్రీలు పెట్టి లబ్దిదారులను వడగట్టాడు. రుణమాఫీ చేయడాన్ని కూడా విడతల వారీ చేసి వంచించాడు. నాలుగు విడతలు అన్నది కాస్తా ఐదు, ఆరు విడతలు ఇస్తాననే వరకూ సాగింది. కానీ రైతుల అప్పు మాత్రం మాఫీ కాలేదు. రుణాలు తీర్చకపోవడం వల్ల బ్యాంకులు వారికి కొత్త అప్పులు ఇవ్వనే లేదు. బ్యాంకుల్లో తనఖాలో ఉన్న బంగారం విడిపిస్తా అని చంద్రబాబు వేయించిన దండోరా కూడా అబద్ధమే అయ్యింది. ఏ ఒక్కిరకీ తాకట్టు బంగారం విడిపించలేదు. డ్వాక్రా రుణాల మాఫీ కూడా అమలు కాలేదు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరక పోయినా అన్నీ నెరవేర్చామంటూ ప్రగల్బాలు పలుకుతూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారు. కానీ ఈసారి ప్రజలు బాబు అబద్ధాలను నమ్మలేదు. నిజాయితీగా చేయగలిగే వాటిని మాత్రమే హామీ ఇస్తాను, చేయలేని వాటి గురించి అబద్ధపు హామీ ఇవ్వలేను అని నిక్కచ్చిగా చెప్పిన నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికల్లో 151 సీట్లతో బ్రహ్మరధం పట్టారు. నేడు 23 స్థానాలతో ముక్కీ మూలిగీ ప్రతిపక్షంలో నిలబడ్డ టీడీపీ అధినేత తాను చేసిన హామీలకు ప్రస్తుత ముఖ్యమంత్రిని బాధ్యుడిని కమ్మంటున్నారు. రుణమాఫీ పూర్తిగా ఇచ్చేసాం అన్న నోటితోనే నేడు రుణమాఫీ బకాయిలను తీర్చమంటూ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం అంటూ పచ్చ శ్రేణులను రెచ్చగొడుతున్నాడు. ఇంతకు మించిన అన్యాయం, అక్రమం మరొకటి లేదు. బాబు నక్క జిత్తులను తెలుసుకుని అధికారం నించి ఊడగొట్టి దూరంగా నెట్టిన ప్రజలే, ఇలాంటి చౌకబారు విన్యాసాలు చేస్తే మరోసారి ముఖం వాచేలా చీవాట్లు పెడతారని ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిదేమో!