సక్సెస్ ఫుల్ గా రివర్స్ టెండరింగ్

 

రివర్స్ టెండరింగ్ తో దేశం చూపును తనవైపు తిప్పుకున్నారు వైయస్ జగన్. ఎన్నడూ లేని విధంగా రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంచనాల పెంపుకు కళ్లెం వేసారు. దీనివల్ల ప్రభుత్వానికి 628 కోట్లు ఆదా అవుతోంది. అంచనాలు పెంచి పనులు చేయకుండా మూడేళ్లు కాలయాపన చేసిన ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎల్ 1గా వచ్చిన ఆ సంస్థ కోట్ చేసిన మొత్తాన్ని ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణిస్తూ రివర్స్ టెండరింగ్ కు పిలుపునిచ్చింది. ఫలితంగా పోలవరం పనుల్లో అధిక వ్యయాన్ని కంట్రోల్ చేసినట్టైంది.

పోలవరంపై అవాస్తవ ప్రచారాలకు చెక్ పెట్టిన రివర్స్ టెండర్

 పోలవరం పనులు ఆపేశారంటూ ప్రతిపక్ష పార్టీ బురద చల్లాలని చూసినా, కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదీయకుండా రివర్స్ టెండరింగ్ విషయంలో పట్టుదలగా ముందుకు వెళ్లారు వైయస్ జగన్. అది మొండితనం అనీ ప్రచారం చేయబోయి బొక్కబోర్లా పడ్డాయి ప్రతిపక్షాలు, విపక్షాలు. ఎందుకంటే పోలవరం విషయంలో ఎన్నో కీలక విషయాలను తెలుసుకుని, జరిగిన అవినీతి కోణాలపై సమీక్ష చేసి, పెరిగిన అంచనా వ్యయాల గురించి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ రివర్స్ టెండరింగ్ విషయంలో పట్టుదలగా వ్యవహరించారు. ఆయన నిర్ణయం తప్పు కాదని, గత ప్రభుత్వ హయాంలో పోలవరం టెండర్లు ఏకపక్షంగా నిర్ణయమయ్యాయని నేటి రివర్స్ టెండరింగ్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

సక్సెస్ అయిన రివర్స్ టెండరింగ్

పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ట్రాన్సపరెంట్ గా జరిగిన బిడ్డింగ్లో 12.6% తక్కువ కోట్ చేసి మేఘా ఇంజనీరింగ్ పోలవరం పనులను దక్కించుకుంది. 4957 కోట్ల రూపాయిల విలువగా గత ప్రభుత్వం నిర్ణయించిన పనులను 4358 కోట్ల రూపాయిలకే కోట్ చేసింది మేఘా ఇంజనీరింగ్. ఇది అసలుసిలైన నమ్మకమైన పోటీ అనిపించుకుంది. రికార్డు టైమ్ లో పట్టిసీమ నిర్మాణం చేసి, తెలంగాణాలో భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్నినిర్మిస్తున్నప్రతిష్టాత్మక మేఘా ఇంజనీరింగ్ కోర్టు అనుమతులు లభించిన వెంటనే పోలవరం పనులను ప్రారంభించనుంది.  ప్రభుత్వం నిర్థారించిన ప్రమాణాలన్నిటినీ పాటిస్తూ నాణ్యతలో రాజీ లేకుండా పోలవరం పనులను సకాలంలో పూర్తి చేసే బాధ్యతలు తీసుకుంటోంది మేఘా ఇంజనీరింగ్.

గత పాలకుల తప్పుడు ప్రచారాలు బట్టబయలు

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి కాలేదు. ఆర్ అండ్ ఆర్ పూర్తి కాలేదు. కాపర్ డ్యామ్ నిర్మాణం 35 మీటర్ల దగ్గరే ఆగిపోయింది, వరిజినల్ డిజైన్ 45 మీటర్లకు రావడానికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు పూర్తి అవలేదు. ఇంతవరకూ 3 డిజైన్లు కూడా ఖరారు కాలేదు. కానీ చంద్ర బాబు మాత్రం 2018కే పోలవరాన్ని పూర్తి చేస్తామని నమ్మబలికాడు. 2012 మొదలైన నిర్మాణం 2018కే పూర్తి అయిపోతుందని ప్రజలను మభ్యపెట్టాడు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డయాఫ్రం వాల్ పూర్తైందని, కాపర్ డ్యాం రెడీ అనీ తన ఎల్లో మీడియాలో విపరీతమైన ప్రచారం చేయించుకున్నాడు. ఉచిత బస్సులు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను పోలవరం యాత్ర చేయమని పంపించాడు. సాంకేతికంగా పోలవరంలో ఏం జరుగుతోందా సామాన్యులకు అర్థం కాదు కనుక పోలవరం సందర్శించిన వాళ్లంతా బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయని భ్రమపడతారని చంద్రబాబు భావించాడు. కానీ బాబు అబద్ధాలను గుడ్డిగా రాష్ట్ర ప్రజలు నమ్మలేక పోయారు. కేంద్రం నిధులు ఇవ్వడానికి నిరాకరించడం, కాగ్ పోలవరం విషయంలో అవినీతి గురించి ప్రశ్నించడం, కమీషన్లు దండుకుంటూ పోలవరం పనులను నత్తనడకగా మార్చిన వైనాన్ని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ ఎండగట్టడం వంటి చర్యలు ప్రజలను ఆలోచింపచేసాయి. బాబు చెప్పిన పోలవారం కథలు పోలవరం పనులపై డప్పులు ప్రజలు తిప్పి కొట్టారు. నిన్ను నమ్మం బాబూ అంటూ అధికారం నుంచి దిగ్గొట్టారు.  ఒక్క డయాఫ్రంవాల్ కట్టేసి పోలవరమంతా పూర్తైపోయినట్టు బిల్డప్ ఇచ్చాడు చంద్రబాబు. కానీ ఆ ఒక్కటీ అయితే పోలవరం పూర్తయిపోదు. స్పిల్ వే పూర్తి కాలేదు. ఫ్లడ్ పోవడానికి కాపర్ డ్యామ్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. కాపర్ డ్యాం అసలు ఎత్తును ఇంతవరకూ పూర్తిగా నిర్మించనేలేదు. మెయిన్ డ్యాం పనులు మొదలుపెట్టే పరిస్థితి కూడా లేదు.  సాంకేతిక పరంగా చూసినా గత ప్రభుత్వం చెప్పినట్టు 2018కో 2019కో పోలవరం పూర్తి కావడం అసంభవం. కేవలం వారి రాజకీయ అవసరాలకు మాత్రమే పోలవరం పనులు జరిగిపోతున్నట్టు, పూర్తి అయిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేసారు చంద్రబాబు.

 

Back to Top