ప్రజలకు ఐతే అబద్ధాలు చెప్పి లేకపోతే తికమక పెట్టి ఎట్టైనా ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది టీడీపీ. అందుకే వైయస్ఆర్ సీపీ ఓట్లను మాయం చేసే కుట్రలు పన్నింది. ఆ కుట్ర బయటపడే సరికి ప్రతిపక్షంపై నెపం తోసేందుకు నానా తంటాలు పడుతోంది. సర్వేలు చేసి ఓట్లు తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తే, ఫామ్ -7 తో టిడిపి ఓట్లను వైయస్ఆర్ కాంగ్రెస్ తొలగించిందని అంటున్నాడు చంద్రబాబు. ఇది వినే ప్రజల్లో బోలెడంత కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. అసలు నిజాలేమిటో ఇప్పుడు చూద్దాం. ఐటి గ్రిడ్ అనే సంస్థ చంద్రబాబు ప్రభుత్వానికి సేవా మిత్ర అనే యాప్ తయారు చేసి ఇచ్చింది. ఇందులో రాష్ట్రంలో వివిధ పథకాల లబ్దిదారుల వివరాలే కాదు, ప్రజల ఆధార్ తో సహా ఇతరత్రా అన్నిరకాల సమాచారాలూ ఉన్నాయని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ సంస్థే ప్రజల నుంచి మరింత సమాచారం కోసం సర్వేను కూడా చేసింది. ఊరు, పేరు, ఎవరికి ఓటేస్తారు లాంటి ప్రశ్నాపత్రాలతో రాష్ట్రంలో కాకుల్లా తిరిగిన సర్వే వ్యక్తులు ఈ సంస్థ నుంచి వచ్చిన వారే. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా ఎలాంటి కేసులూ లేకుండా పోవడానికి కారణం ఇదే. ప్రభుత్వ అండతో ఐటి గ్రిడ్ చేసిన సర్వే కనుకే దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక సర్వే ఆధారంగా వచ్చిన డేటా మొత్తాన్నీ హైదారాబాద్ లో ఉన్న ఐటిగ్రిడ్ ప్రధాన ఆఫీసుకు తరలించి, ప్రభుత్వ వ్యతిరేకత కనపరచిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేసారు. అంటే ఇది ప్రజా సమాచార చౌర్యమే కాదు, ప్రజా హక్కుల ఉల్లంఘన కూడా. దీనిపైనే ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. మరి చంద్రబాబు చెబుతున్న ఫామ్- 7 కి ప్రతిపక్ష పార్టీకీ ఏమిటి సంబంధం అనేది కూడా చూద్దాం. ఫామ్-7 అనేది ఓటరుగా నమోదు అయిన వారి వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం ఉద్దేశించబడిన విభాగం. ఓటరు నమోదులో తప్పులు దొర్లాయి అనిపిస్తే వాటిని సవరించమని కోరుతూ ఫామ్- 7 ద్వారా వినతి పంపుతారు. ఇది వ్యక్తిగతంగానే కాకుండా బూత్ లెవెల్ లో ఉన్న పార్టీ సభ్యులు కూడా ఒకటి కంటే ఎక్కువ అభ్యర్థనలు ఫామ్- 7 రూపంగా పంపవచ్చు. అంటే తప్పుడు ధృవీకరణలు ఉన్నాయనో, దొంగ ఓట్లు అనో తెలిసినప్పుడు పార్టీలు ఈ ఫామ్ -7 ను ఆశ్రయిస్తున్నాయి. ఫామ్ -7 దరఖాస్తు చేసిన వెంటనే ఆ ఓటరు పేరు లిస్టు నుంచి తొలగించే వీలు లేదు. స్థానిక అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాతే ఓటరు పేరును లిస్టునుంచి తొలగిస్తారు. అంటే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ చేస్తున్న దొంగ ఓట్ల ఉదంతాలను బైటపెట్టేందుకు ఫామ్-7 ద్వారా ప్రయత్నం చేసింది. మరణించిన వారి పేర కూడా ఓట్లు ఉండటాన్ని ప్రశ్నించింది. ఈ విషయాన్నే మార్చి, చంద్రబాబు టీడీపీ ఓట్లను వైయస్ఆర్ సీపీ ఫామ్ 7 ద్వారా తొలగించిందనే అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. టీడీపీ అధికారంలో ఉంది కనుక ప్రజా సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కు అందించి, దానిద్వారా ప్రతికూల ఓట్లను మాయం చేయడం సాధ్యం అయ్యింది. కానీ ప్రతిపక్షంలో ఉండీ ఎలాంటి అధికారం లేని వైయస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ ఓట్ల జాబితాను గల్లంతు చేసింది అనడం ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఫామ్ 7 ఇస్తే ఎలాంటి విచారణ చేయకుండా, అధికారులు ఓట్లను తొలగించేస్తున్నారా? అంటే ఇదే పద్ధతిలో ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్లు కూడా టీడీపీ మాయం చేయడం నిజమే అవుతుందిగా??? ఇక్కడ సింపుల్ గా తేలిన విషయం ఏమిటంటే ఫామ్ -7 ద్వారా దొంగ ఓట్లు తొలగించమని ప్రతిపక్ష పార్టీ కోరుతోంది. ఈ ఫామ్ 7 కేవలం దరఖాస్తు మాత్రమే అని, దీని ద్వారా ఓట్లను తొలగించమని, దానిపై ఎంక్వైరీ ఉంటుందని సాక్షాత్తూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జేకే ద్వివేదీ స్పష్టత ఇచ్చారు. ఫామ్ 7 ద్వారా ఇప్పటికి కేవలం 10,000 ఓట్లు మాత్రమే తొలగించామని కూడా స్పష్టం చేసారు. అంటే ఈ 10,000 ఓట్లూ దొంగ ఓట్లని స్పష్టం అయినట్టే కదా. అదండీ సంగతి...ప్రభుత్వం డేటాను దొంగిలించి ప్రైవేటు వ్యక్తులకు అందించి, ప్రతిపక్ష ఓట్లను గల్లంతు చేస్తోందన్న విషయాన్ని దారి మళ్లించేందుకు ఫామ్ 7ను తెరపైకి తెచ్చాడు చంద్రబాబు. ప్రజలను గందరగోళంలో ముంచి తన తప్పులనుంచి తప్పించుకోవాలనుకునే బాబు హడావిడిని చూసి తెలుగు ప్రజలు నీ కన్ఫ్యూజన్ కాకులెత్తుకెళ్లా అని తిట్టుకుంటున్నారు....ఎట్టకేలకు వాస్తవాలను ఏపీ ప్రజలు తెలుసుకొని నివ్వెరపోతున్నారు.