విద్యార్థుల‌కు మ‌రో సంక్షేమ ప‌థ‌కం

జగనన్న విదేశీ విద్యా దీవెనపై ఉత్తర్వులు 

ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ఇకపై ప్రభుత్వమే భరించనుంది

 మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

అమరావతి: ఆంధప్రదేశ్‌లో విద్యార్థుల కోసం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో సంక్షేమ పథకం తీసుకొచ్చింది. విదేశీ విద్యను అభ్యసించే అర్హులైన వాళ్ల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’పై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకం లాగే.. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేసేలా ఈ పథకాన్ని అమలు చేయనుంది. 

ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ఇకపై వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించనుంది. 

నాలుగు వాయిదాల్లో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదంటే ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు జమ చేస్తుంది ప్రభుత్వం. ఫస్ట్‌సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు ఉంటుంది. అలాగే.. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్‌ లేదంటే ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు ఉంటుంది. 

అర్హతలు ఇవే
పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదంటే.. సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందనుంది. వయసు.. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులని ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో స్థానికుడై ఉండి.. అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుంది. ప్రతి ఏటా సెప్టెంబర్‌–డిసెంబర్‌, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నొటిఫికేషన్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ చేత అర్హుల ఎంపిక ఉండనుంది. 

గతానికి, ఇప్పటికీ తేడా..

2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టింది గత ప్రభుత్వం. చంద్రబాబు సర్కారు సమయంలో ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు వర్తింప చేయలేదు. అయితే ఇప్పుడు వాళ్లకు సైతం వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. గతంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి  వర్తించేది. ఇప్పుడు ఆ ఆదాయ పరిమితి పెంచారు.  ప్రపంచంలోని కొన్నిదేశాలకే వర్తింపు చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తించనుంది. చంద్రబాబు హయాంలో ఎస్సీలకు రూ. 15 లక్షలు, ఎస్టీలకు రూ. 15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండేది‌. ఇప్పుడు టాప్‌ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించనుంది. అలాగే.. 101 నుంచి 200 లోపు ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజులను చెల్లించనుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వం హయాంలో 300 మంది ఎస్సీలకు, 100 మంది ఎస్టీలకు, 400 మంది కాపులకు, 1000 మంది బీసీలకు , 500 మంది మైనార్టీలకు పరిమితి విధించించింది. ఇప్పుడు టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎంతమంది సీట్లు సాధించినా వర్తింపు చేస్తూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. 

గత ప్రభుత్వ విదేశీ విద్యా పథకంలో పలు లోపాలు:
► గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్య అమల్లో పలు లోపాలను గుర్తించింది విజిలెన్స్‌ & ఎన్‌ఫోర్స్‌ మెంట్‌విభాగం. 

► లబ్ధిదారుల ఎంపికలో ఆదాయ పరిమితులు పాటించలేదని నిర్ధారించింది.

► ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే లబ్ధిదారులైన కొందరు విద్యార్థులు తాము చదువుతున్న యూనివర్శిటీని, వెళ్లాల్సిన దేశాన్ని కూడా మార్చుకున్నారని గుర్తించింది. 

► ఆధీకృత సంస్థకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్శిటీలను మార్చుకున్నారు కొందరు విద్యార్థులు.

► గత ప్రభుత్వంలో స్కీం నుంచి డబ్బు పొందాక కోర్సులు పూర్తిచేయకుండానే వెనుదిరిగి వచ్చిన కొందరు విద్యార్థులు. 

► ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు అన్న నిబంధనను ఉల్లంఘించి ఒకే కుటుంబంలో ఒకరికి అంతకంటే ఎక్కువమందికి పథకం వర్తింపజేశారు. 

► ఈ పథకంలో లబ్ధి పొందిన వారి చిరునామాల్లో వెతికినా..  వాళ్లు కనిపించని వైనం. 

► అన్నికంటే ముఖ్యంగా 2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి చెల్లించాల్సిన రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టిన గత ప్రభుత్వం.

తాజా వీడియోలు

Back to Top