‘‘11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న మన రాష్ట్రం... పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించకమానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారు చేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి’’ - ‘ఎక్స్’లో వైఎస్ జగన్ ట్వీట్ ‘పన్నుల ఆదాయం వృద్ధిలో మన రాష్ట్రం.. దేశంలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇదీ చంద్రబాబు 22వ ర్యాంక్ విజన్..!’ అంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ.. సీఎం చంద్రబాబు కల్పిత గణాంకాలతో చెబుతున్న అవాస్తవాలను ఎండగడుతూ.. కూటమి సర్కారు ఆర్థిక విధానాలను కడిగిపారేశారు. చంద్రబాబు నాయకత్వంలో అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారం చేయడం లాంటి అంశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించగలిగిందంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ప్రచారం ఎక్కువ.. పని తక్కువ..అబద్ధాలు, మోసాలు.. ఇదీ బాబు 22వ ర్యాంక్ విజన్ » రాష్ట్రం తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోందనేందుకు ప్రభుత్వ ఆదాయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం కల్పిత జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) గణాంకాలతో ప్రజలను మభ్యపెట్టి, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందనే తప్పుడు భావన కలిగిస్తోంది. » 2024–25లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 11.75 శాతం (నామినల్ జీఎస్డీపీ)గా ఉందని, జాతీయ వృద్ధిరేటు 9.8 శాతం మాత్రమేనని.. అలాగే 2025–26లో రాష్ట్ర వృద్ధి 10.75 శాతంగా ఉంటుందని, జాతీయ వృద్ధిరేటు 8.0 శాతం మాత్రమేనని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ప్రకారం 2023–24 నుంచి 2024–25 మధ్య రెండేళ్ల కాలానికి సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 11.09 శాతంగా చూపిస్తోంది. అంతేకాదు.. వాస్తవ (రియల్) జీఎస్డీపీ వృద్ధి పరంగా ఈ ఏడాది రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉందని కూడా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవేవీ స్వతంత్ర సంస్థలు విడుదల చేసిన గణాంకాలు కావు. ఇవి పూర్తిగా చంద్రబాబు కార్యాలయంలో తయారు చేసిన అంకెలే. వాటినే వాస్తవాలుగా ప్రచారం చేస్తున్నారు. » ఆ గణాంకాలే నిజమైతే ప్రభుత్వ ఆదాయాల్లోనూ అదే స్థాయి వృద్ధి కనిపించాలి. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి 9 నెలలకు కాగ్ గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. ఆశ్చర్యకరంగా రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పన్ను ఆదాయాల వృద్ధి (సీఏజీఆర్) కేవలం 1.97 శాతం మాత్రమే ఉంది. 11.09 శాతం భారీ జీఎస్డీపీ వృద్ధిని చూపిస్తున్న రాష్ట్రం.. పన్ను ఆదాయాల్లో మాత్రం కేవలం 1.97 శాతం వృద్ధి సాధించడం ప్రపంచంలోని ఆర్థిక నిపుణులందరికీ ఆశ్చర్యంగా అనిపించక మానదు. ‘విజనరీ’ నాయకత్వంలో తయారుచేసిన కల్పిత గణాంకాల వల్లే ఇలాంటి అంకెలు సాధ్యమవుతాయి. » ఇంకా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి 9 నెలల పాటు 23 రాష్ట్రాల పన్నుల ఆదాయాలను కాగ్ విడుదల చేసింది. పన్ను ఆదాయాల వృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ను ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 23 రాష్ట్రాల్లో పన్ను ఆదాయాల వృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ 22వ స్థానంలో ఉంది. అంటే చివర నుంచి రెండో స్థానంలో ఉంది. » అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయాలు 9.64 శాతం పెరిగితే, ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయాలు మాత్రం 1.97 శాతం మాత్రమే పెరిగాయి. అయినా కూడా చంద్రబాబు ప్రకారం ఆర్థిక రంగంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు కేంద్ర ప్రభుత్వానికంటే మెరుగైనదట! చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏదైనా విషయంలో మొదటి స్థానం సాధించగలదంటే... అది కేవలం ప్రభుత్వ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, విషప్రచారం లాంటి విషయాల్లో మాత్రమే!!