కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
హౌసింగ్లో ఏపీ ఆదర్శం
22 Oct 2022 10:56 AM
గృహ నిర్మాణంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా గుర్తింపు
కేంద్రమంత్రి నుంచి అవార్డు అందుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ
జాతీయ గృహ నిర్మాణ సమ్మేళనంలో పాల్గొన్న అజయ్జైన్
అత్యాధునిక టెక్నాలజీతో జగనన్న కాలనీలు నిర్మిస్తున్నట్లు వెల్లడి
అమరావతి: గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్లోని రాజ్కోట్లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్జైన్ వివరించారు.
అత్యాధునిక సాంకేతికత..
తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ చొప్పున మొత్తం 1,145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీకాస్ట్ టెక్నాలజీ, షియర్వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అజయ్జైన్ వివరించారు.
కాలనీలు కాదు.. అధునాతన గ్రామాలు
ఇక అల్పాదాయ వర్గాలు, పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఇళ్లలో వారు సగౌరవంగా జీవించేలా చూడడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ లక్ష్యమని అజయ్జైన్ స్పష్టంచేశారు. అందుకు అనుగుణంగానే కాలనీలకు బదులు అధునాతన గ్రామాలను సృష్టిస్తున్నామని, 17,005 లే అవుట్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు.
రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. లేఅవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ జేఎండీ ఎం. శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ ఈ సదస్సులో పాల్గొన్నారు.
నేడు విశాఖలో టిడ్కో ఇళ్ల పంపిణీ
విశాఖపట్నం మురికివాడల్లోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు అందిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీలోని మొత్తం 13 ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించనుంది. ఇటీవల మంగళగిరి, తెనాలిలలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించిన టిడ్కో అధికారులు మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోనూ నేడు తొలి విడతగా 2,632 యూనిట్లను లబ్ధిదారులకు అందించనున్నారు. విశాఖ మహానగరంలో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా, తొలి విడతలో రాజీవ్ కాలనీ, పైడిమాంబ కాలనీ, చిలకపేట, ఆదర్శ గ్రామం, సీహార్స్ కాలనీ, గౌరీనగర్, సుద్దగెడ్డ, ఏఎస్ఆర్ కాలనీ, టీఆర్ ముత్యమాంబ కాలనీ, రాతిచెరువు, అగనంపూడి, పరవాడ, చినముషిడివాడ ప్రాంతాల్లో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రజలు జీవించేందుకు అవసరమైన కనీస వసతులు కూడా లేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ 13 కాలనీల్లో నేడు పక్కా ఇళ్లతోపాటు రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించి నిరుపేదలు సగౌరవంగా జీవించే స్థాయిలో ఇళ్లను నిర్మించారు. అన్ని వసతులతో పూర్తిచేసిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, అందుకు అవసరమైన ఏర్పాట్లుచేసినట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా వీటిని శనివారం లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వివరించారు. పంపిణీ ప్రాంగణంలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లో పంపిణీ ఏర్పాట్లను శుక్రవారం టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.
డిసెంబర్లో మరో 8 వేలు
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నాం. శనివారం మొదటి విడతగా 2,632 యూనిట్లను 13 ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందిస్తాం. డిసెంబర్లో మరో 8 వేల ఇళ్లను పంపిణీ చేస్తాం. మిగిలిన యూనిట్లను వచ్చే మార్చి నాటికి అందిస్తాం. టిడ్కో ఇళ్లు నిర్మించిన అన్నిచోట్లా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని మౌలిక వసతులు కల్పించాకే ఇళ్లను అప్పగిస్తున్నాం.
– చిత్తూరు శ్రీధర్, టిడ్కో ఎండీ