పచ్చదొర పాలన

()రాజధాని పేరుతో భూ దురాక్రమణ
()రాష్ట్ర సంపద విదేశీయులకు తాకట్టు
()అభివృద్ధి పేరుతో గుళ్లు, విగ్రహాల కూల్చివేత
()స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో వైయస్సార్సీపీ పోరాటం

హైదరాబాద్‌: ఎందరో మహనీయుల కృషి ఫలితంగా బ్రిటీష్‌ బానిసత్వం నుంచి భారతదేశానికి విముక్తి అయితే లభించింది కానీ...పాలకుల చేతిలో మాత్రం ప్రజలు బందీలు, బానిసలుగానే బతుకుతున్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు పాలన తీరు తెల్లదొరలను గుర్తు చేస్తోంది. నాడు వర్తక వ్యాపారం కోసం ఇండియాకు వచ్చిన బ్రిటిష్‌ దేశస్తులు మన ఆస్తులు లాక్కొని మన మీదే దౌర్జన్యం చేశారు. అయితే చంద్రబాబే ప్రస్తుతం విదేశీయులను మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి మన సంపదను వారికి దోచిపెడుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం పేరుతో వేల ఎకరాల పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొని, వాటిని విదేశీ కంపెనీలకు కట్టబెడుతున్నారు. తన బినామీలకు విలువైన భూములు కట్టబెట్టి చంద్రబాబు లబ్ధిపొందుతున్నారు. రాజధాని నిర్మాణంలో స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని అనుసరిస్తూ విదేశీయులకు 58 శాతం, రాష్ట్రానికి 42 శాతం వాటా వచ్చేలా ఒప్పందం కూదుర్చుకొని రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. 

దుశ్సాసన పాలన
నాడు బ్రిటీష్‌ దేశస్తులు మన సంస్కృతిని కాలరాస్తూ గూళ్లు, గోపురాలు కూల్చారు. అదే పద్ధతిలో అభివృద్ధి పేరుతో ఏపీలో  చంద్రబాబు ఏళ్ల నాటి దేవాలయాలు, మసీదులు, చర్చీలు కూల్చివేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున కూల్చివేసి జాతికే మచ్చ తెచ్చారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్న దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. విభజన చట్టంలోని ప్రత్యేక హోదా అంశాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారు.

ఎన్నికల హామీలకు తూట్లు
ప్రజాసమస్యలను గాలికొదిలేసి అవినీతి, అక్రమాలే ధ్యేయంగా రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగుతోంది. రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా కుంభకోణాలతో రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్‌ వన్‌ గా మార్చడంతో పాటు...అత్యంత ధనవంతులుగా, ప్రజలను హింసిస్తున్న నాయకులుగా టీడీపీ వారు దేశవ్యాప్తంగా కొన్ని సంస్థలు నిర్వహించిన రిపోర్ట్‌ లో టాప్‌ స్థానంలో నిలిచారంటేనే ఏపీలో పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. విభజనతో నష్టపోయిన ఏపీని...చంద్రబాబు తన నయవంచక పాలనతో మరింత అన్యాయానికి గురిచేస్తున్నాడు. నేను మారాను. అధికారంలోకి వస్తే ఇళ్లు కట్టిస్తా, రుణాలన్నీ మాఫీ చేస్తా. ఉద్యోగాలు ఇస్తా. నిరుద్యోగ భృతి ఇస్తా నాకు ఓటేయండంటూ వినయంగా ప్రజలను ప్రాధేయపడి...కుర్చీ ఎక్కాక ప్రజలను నిలువునా దగా చేశారు. 

అన్నింటా అవినీతి
సాండ్‌ మాఫియా, ల్యాండ్‌ మాఫియా, లిక్కర్‌ మాఫియా, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ మాఫియా, ఓటుకు నోటు కుంభకోణం, పట్టిసీమ దందా, అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు. అందుగలదు ఇందులేదని ఎందెందు వెతికినా టీడీపీ అవినీతే కనిపిస్తోంది. దీనికి తోడు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ చంద్రబాబు చలిమంట కాల్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు.  కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు,నిరుద్యోగులు, మహిళలుఇలా అన్ని వర్గాల వారిని బాబు నయవంచన చేశారు. అంతటితో ఆగకుండా దేవుడిమాన్యాలను దోచుకోవడం మొదలు ఆలయాలను, మసీదులను, దర్గాలను, మహాత్ముల విగ్రహాలను కూల్చేయిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. బాబు పాలనపై విసిగివేసారిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు.  

ప్రశ్నిస్తే అక్రమ కేసులు
టీడీపీ నాయకుల దందాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఏపీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలన్నా, ప్రతిపక్షాలన్నా, చట్టాలన్నా చంద్రబాబు సర్కార్‌ కు ఏమాత్రం గౌరవం లేదు. అందినకాడికి దండుకోవడం అడ్డొచ్చిన వారిపై దాడులు చేయడమే లక్ష్యంగా బాబు సర్కార్‌ పాలన సాగుతోంది. ప్రభుత్వ అవినీతి, అరాచకాలను ప్రశ్నించిన ప్రతీ ఒక్కరిపై అక్రమ కేసులు బనాయిస్తూ బాబు పైశాచిక పాలన సాగిస్తున్నారు. రెండేళ్లలోనే టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బాబును నమ్మి ఓటేసి మోసపోయామని పశ్చాత్తాప పడుతున్నారు. మాకొద్దు బాబోయ్‌ ఈ దుర్మార్గపు పాలన అని గగ్గోలు పెడుతున్నారు. బాబు బానిసత్వం నుంచి  స్వేఛ్చను ప్రసాదించాలని కోరుకుంటున్నారు. 

స్వేచ్ఛ కోసం నిరంతర పోరాటం
స్వాతంత్యోద్యమం రగిలించిన స్ఫూర్తితో స్వేచ్ఛ కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతర పోరాటం చేస్తోంది. వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేళ్లుగా చంద్రబాబు సర్కార్‌పై పోరాడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతూ..బాధితులకు అండగా నిలుస్తున్నారు. మరో వైపు విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే..ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమిస్తున్నారు. రాజధాని భూ దురాక్రమణ, ప్రాజెక్టులపేరుతో దొచుకున్న అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు వంటి విషయాలపై చట్టసభల్లోనూ, కోర్టుల్లోనూ న్యాయపోరాటం చేస్తున్నారు. నాడు స్వాతంత్య్రం కోసం 200 ఏళ్ల పాటు తెల్లదొరలపై పోరాటం చేస్తే..రెండున్నరేళ్లుగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చంద్రబాబు అరాచక, అవినీతి పాలనపై ఉద్యమిస్తున్నారు. 
Back to Top