రాజెలా ఉంటే మంత్రులు, సైనికులూ అలాగే ఉంటారు. రాజు పీడించేవాడైతే సేవకులూ అలాగే తయారౌతారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పీడనే సాగుతోంది. సామాన్యులను అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, మరోవైపు పచ్చ నేతలు పొడుచుకు తింటున్నారు. వేధింపులకు గురి చేస్తున్నారు. అడుగుడునా అవమానాలు, ప్రతిక్షణం చావు భయం, బతుకు భయం అన్నట్టుగా ఉంది. వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలంలోని సిద్ధారెడ్డి పల్లెలో ఇటీవల ఓ సంఘటన కలవరం పుట్టిస్తోంది. అధికారం ఉన్న పార్టీకి తొత్తుల్లా పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ నైజానికి ఇదో ఉదాహరణ. హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడన్న కారణంతో ఓ సామాన్య రైతుతో చాపాడు SI శివశంకర్ ప్రవర్తించిన తీరు ఎవ్వరికైనా ఆగ్రహం తెప్పిస్తుంది. బూటు కాలితో రైతును తన్నుతూ, బూతులు మాట్లాడుతూ, బండి మీద నుంచి పడిపోతున్నా పట్టించుకోకుండా మెడపై కొట్టి మరీ అరెస్టు చేసిన ఆ పోలీసు దాష్టీకాన్ని బాధితుడు కన్నీరు పెట్టుకుంటూ చెబుతున్నాడు. ఈ పోలీసు ఆ ప్రాంతంలోని టిడిపి ఇంఛార్జ్ నాయకుడి కులస్థుడు. ప్రత్యేకంగా ఆ నేత పిలిపించుకుని నియమించుకున్న అధికారి. పచ్చకండువా కప్పుకోవెందుకని సామాన్యులను వేధించుతున్నాడని చాలామంది చెబుతుంటారు. ఇక తాజాగా వెలుగు చూసిన మరో సంఘటన విశాఖ జిల్లా వేపగుంటలోది. ఇదీ ఓ అధికారి నిర్వాకమే. జీవీఎంసి జోన్ 6 జోనల్ కమీషనర్ సత్యనారాయణ స్వీపర్లపై చేసిన దౌర్జన్యం అమానుషంగా ఉంది. చుట్టూ సిబ్బంది, పోలీసులు ఉండి కూడా ఆ ఉన్నతాధికారిని వారించే ప్రయత్నమైనా చేయలేదు. వృద్ధుడని కనీస కనికరం లేకుండా ఉన్నత స్థాయి అధికారి వారిపై చేయి చేసుకోవడం, పబ్లిక్ గా తిట్టడం, తోసేయడం చూస్తే అధికారులంటేనే కంపరం పుడుతుంది. కిందిస్థాయి ఉద్యోగులైనంత మాత్రాన, లేక విధినిర్వహణలో తప్పులు చేసినంత మాత్రాన పై అధికారులకు కింది స్థాయి సిబ్బందిని చేయి చేసుకునే అధికారం ఉంటుందా? ఇది అహంకారం, అధికార దుర్వినయోగం కాదా? ముఖ్యమంత్రి అంతటి వాడు, ఎమ్మెల్యేలు, ఎంపీలే తల పొగరుగా మాట్లాడుతూ, అధికారుల జుట్టులు పట్టుకుని ఈడుస్తుంటే, చెంపదెబ్బలు కొడుతుంటే మనం చేయకూడదా అనుకున్నట్టున్నాడీ అధికారి. అందుకే అంత పాశవికంగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లు. అన్యాయాన్ని ఎదిరించినా, బాధ్యతగా ఎదురు తిరిగి ప్రశ్నించినా ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ఊడిగం చేసే వ్యవస్థలు కలిసి సామ్యానులను వేధిస్తున్నాయి. జన్మభూమికమిటీలు గ్రామాల్లో దాష్టీకాలు చేస్తున్నాయి. పచ్చనేతలు బడుగు జీవితాలను గుప్పెట పెట్టుకుని హింసిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి మూలా ఎస్సీఎస్టీల వేధింపులు ఎక్కువయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రే ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ అవమానకరంగా మాట్లాడారు. ఆర్టీసీ ఉన్నతాధికారి వర్ల రామయ్య కూడా కులం పేరుతో దూషణలు చేసాడు. మంత్రి ఆదినారాయణ గిరిజనులను నోటికొచ్చినట్టు తిట్టాడు. ఇక ఆ పార్టీ నేతలు గిరిజన మహిళలను దుస్సాసనుల్లా చీరలు లాగి మరీ కొట్టడం, ఎస్సీఎస్టీ యువకులపై దాడులు చేయడం నిత్యకృత్యం అవుతోంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి అధికారులపై కానీ, అక్రమాలు తీసుకున్న చర్యలు శూన్యం. రావణాసురుడి లాంటి చంద్రబాబు పాలనలో అధికారుల తీరు రాక్షసులనే తలపిస్తోందని వాపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ దారుణాలకు చరమగీతం పాడే రోజు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.