చిటపటలు.. చెణుకులు.. ఉరుములు

పులి కనుమ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలోని 46వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి భావించారు. అందుకే ఆ ప్రాజెక్టును ప్రారంభించి 75 శాతం పనులు పూర్తి చేశారు. ఆ మహానుభావుడు చనిపోయిన తరువాత మూడేళ్లలో ఈ ప్రభుత్వం 25 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు. రాజన్న బతికుంటే మీకీ కష్టం వచ్చేదా? - పెద్దకడబూరు బహిరంగ సభలో షర్మిల

మంత్రాలయం:

‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా 29వ రోజు షర్మిల పెద్దకడబూరు మండలంలో 14.6 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో ఆమె ప్రభుత్వంపై చిటపటలాడారు. చంద్రబాబుపై చెణుకులు విసిరారు. అధికార, విపక్షాల కుమ్మక్కుపై ఉరుములు ఉరిమారు.  పులి క నుమ ప్రాజెక్టుతో పాటు జిల్లాలో ఏ ప్రాజెక్టును కూడా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గానీ, వైఎస్ తరువాత అధికారాన్ని అనుభవిస్తున్న సీఎంలు గానీ పట్టించుకోలేదని పెద్ద కడుబూరు సభలో  విమర్శించారు. 50వేల ఎకరాలకు సాగునీరు అందించే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పనులకు రెండుసార్లు శిలాఫలకాలు వేసి చంద్రబాబు  మరిచిపోతే వై.ఎస్. పూర్తిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్ పనులే ఆగిపోయాయని, అవి కూడా పూర్తయితే రైతులకు ఎంతో మేలు ఒనగూరేదన్నారు. ఎల్‌ఎల్‌సీ కాలువను ఆధునికీకరించి తుంగభద్ర నుంచి నీరు కూడా తెప్పించుకోలేని  ప్రభుత్వం ఇప్పుడు పాలన సాగిస్తోందని చెణుకు విసిరారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి రైతన్న ఏడుస్తున్నాడని, రైతు కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వం ఎంతోకాలం కొనసాగదని షర్మిల స్పష్టం చేశారు. పాదయాత్రలో దారి వెంట వస్తుంటే రైతులు సాగునీటితో పాటు తాగునీరు లేక పడుతున్న బాధలు చెపుతుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు రాజులా బతికిన రైతు రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజన్నకు రైతంటే చాలా ఇష్టం. రైతుకు ఎంత చేసినా తక్కువే అని భావించేవారు. అందుకే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం చేశారు. రూ. 12వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. రోజుకు ఏడుగంటల కరెంటు ఇచ్చారు. రైతుకు ఏ కష్టం లేకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం రైతన్నల ఉసురు తీస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని పైకి తిడుతూ దుష్టపరిపాలన కొనసాగేలా కాపాడుతున్న చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నా ప్రజలు నమ్మరన్నారు.

ఆకట్టుకుంటూ.. ముందుకు సాగుతూ..

     ‘మరో ప్రజా ప్రస్థానం’లో భాగంగా అలుపెరగకుండా పాదయాత్ర సాగిస్తున్న షర్మిల గ్రామస్థులను, కూలీలను, విద్యార్థులను కలిసి వారితో ముచ్చటిస్తూ ముందుకు వెళుతున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. అక్కా... అన్నా... అవ్వా.... తమ్ముడూ... అని ఆప్యాయంగా పలుకరిస్తూ వారు ఎదుర్కొంటున్న బాధలను ఓపిగ్గా వింటున్నారు. బడికి వెళ్లే పిల్లలు కలిసినప్పుడు తల్లిలా వారికి భవిష్యత్తు గురించి చెపుతున్నారు. ‘చదువుకోవాలమ్మా... బాగా చదువుకోవాలి. డిగ్రీ కంటే పెద్ద చదువులు చదవాలి. రాజన్న కలలు కన్నట్లు మీరు డాక్టరో, ఇంజినీరో కావాలి’ అని పెద కడుబూరు కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఉద్భోదించిన తీరు అమ్మను గుర్తుకు తెచ్చింది.

ఫీజులు కట్టలేకనే, పిల్లలు సైతం పనికి వెళ్లకపోతే పూట గడవదనో చదువు మాన్పించిన తల్లులను కలిసినప్పుడు ‘ ఒక్క ఏడాది ఎలాగోలా చదివించండక్కా! తరువాత జగనన్న సీఎం అవుతారు. పిల్లలందరికీ చదువు ఫ్రీగా చెప్పిస్తాడు. వారిని స్కూలుకు పంపించినందుకు మీ అకౌంట్‌లో డబ్బులు కూడా వేస్తాడు’ అని ధైర్యం చెప్పి చదువు అవసరాన్ని పెద్ద కూతురులా తల్లులకు వివరిస్తున్నారు. రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

భారీగా తరలివస్తున్న జనం

     షర్మిల సాగిస్తున్న పాదయాత్రకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గురువారం పెద కడుబూరు మండలంలో సాగిన పాదయాత్రకు జీపులు, ఆటోలు, లారీల్లో భారీగా జనం తరలివచ్చారు. పెద కడుబూరు మండల కేంద్రంలో సాగిన బహిరంగసభను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. మూడు రోడ్ల కూడలిలో ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, నరవ రమాకాంత్ రెడ్డి విడివిడిగా ఏర్పాటు చేసిన రెండు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి అక్కడే బహిరంగసభలో మాట్లాడ గా, కిక్కిరిసిన జనంతో నిలబడడం కూడా కష్టంగా మారింది. పాదయాత్ర వెంట కూడా వేలాదిగా జనం తరలివచ్చారు. దాంతో దుమ్ము లేచి దారి పొడువునా పొగలా కమ్ముకుంది.

     పాదయాత్రలో ఉన్న ఇతర నాయకులు, ప్రజలు దుమ్ముకు భయపడి ముక్కులకు చేతిరుమాళ్లు అడ్డు పెట్టుకుంటే షర్మిల మాత్రం ఇబ్బందిగా ఉన్నా అలాగే పాదయాత్ర కొనసాగించారు. బుధవారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ షర్మిలతో పాటే బస చేసి గురువారం కూడా జిల్లాలోనే ఉన్నారు. గురువారం నాటి పాదయాత్రకు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), పి. రామకృష్ణారెడ్డి(మాచర్ల)లతో పార్టీ శాసనసభా పక్షం ఉపనేత శోభా నాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాల నాగిరెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, సాయి ప్రసాద్ రెడ్డి, ఇతర నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మధుసూదన్, రమాదేవి, ఎం.ఎల్. కాంతారెడ్డి, నిడ్జూరి రాంభూపాల్ రెడ్డి, వై. సీతారామ రెడ్డి, దేశాయి కృష్ణ, అత్రి గౌడ్, మహేందర్ రెడ్డి, విరూపాక్షప్ప పాల్గొన్నారు.

Back to Top