బాబు నీడ‌లో ఫ్యాక్ష‌న్ జాడ‌

 చంద్రబాబు 2014 లో అధికారం చేపట్టినప్పటి నుండీ మళ్లీ ఫాక్షన్ హత్యలు పడగ విప్పాయి. ముఠా దాడులు, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలే టార్గెట్ గా హత్యా రాజకీయాలు పెచ్చుమీరిపోయాయి. వైఎస్ హయాంలో తుడిచిపెట్టుకుపోయిన ఫాక్షన్ దాడులను బాబు మళ్లీ ప్రోత్సహించి, తన రాజకీయ అవసరాలకు పావులుగా వాడుకుంటున్నాడు. పాత కక్షలు రెచ్చగొట్టడం, రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయించి, చంపించడం లాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. నేడు అనంతలో జరిగిన కేశవ రెడ్డి హత్యోదంతం ఇందుకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. మంత్రి పరిటాల సునీత వర్గీయులే ఆత్మకూరుకు చెందిన ప్రతిపక్ష పార్టీ నేత మాజీ సర్పంచ్ కేశవరెడ్డిని దారుణంగా హత్య చేసారని అంటున్నారు. ఈ హత్యలో మంత్రి సునీత సోదరుడి ప్రమేయం ఉందని బాధితులు, కేశవరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. 
గతంలో న్యాయవాది నరేంద్రను అధికార పార్టీ నేతలకు చెందిన వ్యక్తులే దారుణంగా చంపారు. కర్నూల్ లో ప్రభాకర్ నాయుడిని హత్య చేసారు. అనంతపురం ఎన్.హనుమాపురం సర్పంచ్  తూర్పు విశ్వనాథ్ పై కాల్పులు జరిపి హత్య చేసారు. తెలుగుదేశం నేత తిమ్మప్ప వర్గీయుల వల్ల ప్రాణహాని ఉందని ఎన్నిసార్లో మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదని మృతుడి సోదరుడు వాపోయాడు. పులివెందులలోనూ ప్రతిపక్ష పార్టీకే చెందిన రంగేశ్వర్ రెడ్డిని వేటకొడవళ్లతో నరికి చంపారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలోని తాహిసిల్దార్ కార్యాలయంలోనే మరో ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ప్రసాద్ రెడ్డి హత్యకు గురయ్యాడు. సీమలోనే కాదు కోస్తాతీరంలోనూ ఫాక్షన్ హత్యలను పెంచి పోషించింది టిడిపి...
2014 ఏప్రిల్ లో గుంటూరు జిల్లా తెనాలిలో వైసిపి యూత్ వింగ్ లీడర్ మెడిశెట్టి క్రిష్ణ హత్య
2014 అక్టోబర్ లో కృష్ణా జిల్లా విజయవాడలో బొగ్గవరపు వాసు హత్య
పల్నాడు లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి కుమారుడు సాంబయ్య హత్య
2015లో అనంతలోని కిష్టిపాడులో కొపరేటివ్ బాంక్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి హత్య
2015లో కర్నూల్ లో ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ వసంతరావు హత్య
2016లో పులివెందులలో గజ్జల రామిరెడ్డి హత్య.
2017లో ఆళ్లగడ్డలో ఇందూరి ప్రభాకర్ రెడ్డి హత్య.
2017లో కర్నూల్ జిల్లాలో పత్తికొండ వైసీపి ఇన్ ఛార్జ్ చెరుకుపాడు నారాయణ రెడ్డి, సాంబశివుడుల హత్య. 
నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ అధికార పార్టీకి నేతలే బాహాటంగా కాల్పులు జరిపిన ఘటన ఎవ్వరూ మరిచిపోలేరు. ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా ఇచ్చి మరీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు శిల్పా మోహన్ రెడ్డి. ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డిపై టిడిపి నేత మధు  పోలీసుల ఎదుటే కాల్పులకు తెగబడ్డాడు. సాధారణ నాయకుడికి గన్ మెన్ల ప్రొటెక్షన్ కల్పించడమే కాక, దాడి చేసింది శిల్పా వర్గీయులేనంటూ టిడిపి ప్రభుత్వం అబద్ధ ప్రచారం చేయాలని ప్రయత్నించింది. అయితే టిడిపి నేత రౌడీషీటర్ మధు కాల్పుల వ్యవహారం అంతా పోలీసుల సమక్షంలో, మీడియా రికార్డు చేయడంతో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీ నేతలకే తొత్తులుగా పనిచేస్తూ, ప్రతిపక్షానికి చెందిన వారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా ఉంటున్నారన్న నిజం నంద్యాల కాల్పుల వ్యవహారం బయటపెట్టింది. 
ఇక ఎపిలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న ఈ తరుణంలోనూ టిడిపి గూండాలు బరితెగించిపోతున్నారు.  ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ప్రజలను బెదిరిస్తున్నారు, ఆ పార్టీ జెండా, స్టిక్కర్లు అంటించుకున్న వాహనాలపై దాడులు చేసి ధ్వంసం చేస్తున్నారు. పాదయాత్రలో జగన్ ను కలిసిన వారిపై స్థానిక టిడిపి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న చురుకైన కార్యకర్తలను, అభిమానులను, స్థానిక నేతలనే టార్గెట్ గా చేసుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్న దారుణాలకు అంతు ఉండటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమూల చూసినా హత్యాకాండలూ, హాహాకారాలే మిన్నంటుతున్నాయి. రాజకీయ హత్యలు, బహిరంగ బెదిరింపులు, ప్రభుత్వ కార్యాలయాల్లోనే దాడులు, హత్యలు గతంలో ఎప్పుడూ లేనంగా పెచ్చుమీరిపోయాయి. రౌడీలు, గూండాలు, కూనీకోర్లు, కబ్జాదారులే కాదు, చివరకు టిడిపి నాయకులు కూడా రౌడీషీటర్లలా ప్రవర్తిస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హత్యారాజకీయాలను పెంచి పోషిస్తున్న చంద్రబాబు నాయకత్వం అంతమైనప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏర్పడతాయి. ప్రజలకు మనశ్శాంతి దక్కుతుంది. 

 
Back to Top