అందరిదీ ఒకే మాట.. జగనే సిఎం కావాలి

శనివారం పాదయాత్ర ముగిసే సమయానికి.. 45 రోజులు, 624.50 కి.మీ.లు
చిన్నచింతకుంట (పాలమూరు జిల్లా), 2 డిసెంబర్‌ 2012: కార్మికులు, కర్షకులు, ఏ వర్గం వారి మనోభావమైనా ఒక్కటే... అందరి నోటా ఒకే మాట.. ప్రజల బాధలు పట్టించుకోని ఈ అసమర్థ ప్రభుత్వం తమకు వద్దని. ప్రజలను కన్నబిడ్డల్లా ప్రాణప్రదంగా చూసుకున్న దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు ‌శ్రీ జగన్మోహన్‌రెడ్డే సిఎం కావాలని రాష్ట్ర ప్రజలంతా నినదిస్తున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి పాలమూరు జిల్లా వరకు వైయస్‌ఆర్‌ కుటుంబ పట్ల ఇదే మాట. ఇదే అభిమానం. 
ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కు అయిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 45వ రోజు శనివారం అత్యంత వెనుకబడిన పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కొనసాగింది. వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు దారి వెంట ఆమెతో కలిసి కదం తొక్కారు. తమ సమస్యలు, బాధలు శ్రీమతి షర్మిలకు చెప్పుకొన్నారు. జగనన్న రావాలని, తమ కష్టాలు తీరాలని కాంక్షించారు. శ్రీమతి షర్మిల శనివారం మొత్తం 18.5 కిలోమీటర్లు పాదయాత్రగా నడిచారు.

ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల వద్ద వివిధ వర్గాల ప్రజలు తమ గోడును, ఆకాంక్షను ఇలా వెల్లడించారు. ‘దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు తోక ముడిచిన బీటీ విత్తన కంపెనీలు ఇప్పుడు జూలు విదిలించాయి. విత్తనాల ధరలు పెంచిన ఆ సంస్థలు అన్నదాతను అడ్డంగా దోచేసుకుంటున్నాయి. ప్రభుత్వమేమో పట్టించుకోదు. ప్రజల బాధలు పట్టని ప్రభుత్వం ఉన్నా ఒకటే పోయినా ఒకటే.’ 

‘ఎరువులు లేవు.. కరెంటు లేదు.. గిట్టుబాటు ధర లేదు.. గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే మమ్మల్నే నేరస్తులన్నారు. కేసులు పెట్టారు. జైలుకు పంపారు. ఈ పాలన మాకొద్దు..’

‘సర్కారోళ్లు పావలా వడ్డీకే రుణాలని చెప్పారు. తీరా వడ్డీ కట్టబోతే మా నడ్డి విరిచేస్తున్నారు. బ్యాంకు అధికారులు నిలబెట్టి రూ.2.50 వడ్డీలు కట్టించుకున్నారు. ఈ వడ్డీలు మేం కట్టలేం. ఈ సర్కారు పోవాలి.. జగనన్న రావాలి.’

దొంగచాటుగా అమ్ముకుంటున్నారు:
పత్తి తీస్తున్న చిన్నచింతకుంటకు చెందిన రైతు కుర్మన్నను శ్రీమతి షర్మిల పలుకరించినప్పుడు ఆయన ఇలా చెప్పుకొని బాధపడ్డారు. ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అరకిలో బీటీ పత్తి విత్తనాలు సంచికి రూ.1,800 ఉండేది. వైయస్‌ఆర్‌ వచ్చి కోర్టుల కలబడి అదే సంచిని రూ.600కే ఇప్పించిండు. ఎన్ని కావాలనుకుంటే అన్ని సంచులు దొరికినయి. ఆ దేవుడు పోయినంకా వచ్చినోళ్లు రూ.950 ఎక్కించిండ్రు. ఊరికి ఐదు, పది సంచులు ఇచ్చి మిగతా సంచులకు దొంగతనంగా రూ.2,000కు అమ్ముకుంటుండ్రు. అంత ధర పెట్టి ఇత్తనాలు కొనలేక దొరికిన ఇత్తనాలు తెచ్చి పెట్టినా.. వైయస్‌ఆర్ బతికి ఉన్నప్పుడు రూ.250 ఉన్న యూరియా ఈ రోజు రూ.850, రూ.300 ఉన్న డీఏపీ ఇయ్యాల రూ.1,250.. అప్పో, సప్పో చేసి సాగుచేసినా కరెంటు లేక పంట పండలేదు. ఎకరాకు 10 క్వింటాళ్లు.. వచ్చే పత్తి ఈ ఏడు 3 క్వింటాళ్లు ఎల్లింది‌ (దిగుబడి వచ్చింది). ఈ పంటతో అప్పులెట్టా కట్టాలి? నేను నా పిల్లలు ఏం తినాలక్కా? నాయిన ఉన్నట్టు లేదక్కా.. అన్న రావాలక్కా.. జగనన్న వస్తేనే అప్పుల నుంచి బయటపడి మా రైతులు బతుకుతారక్కా’ అని కుర్మన్న వాపోయాడు.

అన్నదాతల మీదే కేసులు పెట్టారు : 
‘దేవరకద్ర మార్కెట్‌కు ఆముదాలు తీసుకుపోతే క్వింటాల్ ధర రూ.2,500 కూడా పలకలేదక్కా. వై‌యస్‌ఆర్ ఉన్నప్పుడు ఇవే ఆముదాలు క్వింటా‌ల్‌కు రూ.4,500 పలికింది. గిట్టుబాటు లేకుండా ధాన్యం ఇచ్చేది లేదని అధికారులకు తెగేసి చెప్పినా.. నాకు గిట్టుబాటు కావాలని పట్టుబట్టినా.. ధర్నాకు కూచున్నా.. నాకు మద్దతుగా మిగిలిన రైతులు నిలబడ్డారు. మమ్మల్ని క్రిమినల్సు అన్నారు. 40 మంది రైతన్నల మీద కేసులు పెట్టారు. రెక్కల కష్టానికి గిట్టుబాటు కావాలంటే మమ్మల్ని ఈ సర్కార్ దొంగలు అన్నది. చంద్రబాబు జమానాల కరెంటు బిల్లులు కట్టలేదని మమ్మల్ని జైల్లో పెట్టించాడు. ఈ పాలన ఇంకా ఉంటే మళ్లీ చంద్రబాబు జమానా ఒత్తదక్కా..’ అని పెదవడ్డెమాన్‌ రైతు ఇంద్రసేనారెడ్డి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

తప్పు మాట్లాడితే ఇక్కడే సంపండి: 
‘మీ అందరికీ దండం పెట్టి ముసలోణ్ణి చెప్తున్నా.. రాజన్నంత మంచి మనిషి ఎవ్వడూ లేడు. ఈ సర్కారు ఉంటే మనం బతకలేం. నాకు 85 ఏళ్లు. నా తరం అయిపోయింది. ఈ సర్కారు సోర పిల్లగాండ్లను (యువకులను) బతకనీయదు. మన సర్కారు రావాలే.. అందరం కలిసి రాజన్న కొడుకును నిలబెట్టుకుందాం.. నేను తప్పు మాట్లాడితే నన్ను ఇక్కడే సంపండి’ అని పెదవడ్డెమాన్‌కే చెందిన 85 ఏళ్ల వృద్ధుడు మమ్మద్ సయ్య‌ద్‌ గ్రామస్తుల వద్ద ఉద్వేగంతో చెప్పాడు. కర్ర సహాయంతో మాత్రమే నడవగలిగే ఆయన మహానేత వైయస్‌ఆర్ ‌కుమార్తె శ్రీమతి షర్మిలను చూసేందుకు ఒంట్లో ఉన్న జవసత్వాలను కూడదీసుకొని మరీ జనం మధ్యకు వచ్చాడు.

‌ఈ సిఎం నా పింఛన్ ఊడపీకిండు : 
‘నేను వికలాంగురాలిని.. రాజశేఖరరెడ్డి ఫస్టు సీఎం అయినప్పుడు రూ. 200 పింఛన్ ఇచ్చిండు. మ‌ళ్ళీ వచ్చినప్పుడు రూ. 500 జేసిండు. కిరణ్‌కుమార్‌రెడ్డి సారు వచ్చి నా పింఛన్ ఊడపీకిండు. నన్ను చూడక్కా.. నాకు 25 ఏళ్లు.. ఐదేళ్ల పిల్లలా లేనా? నేను ఏం పని చేసుకుంటానక్కా.. బుద్ధి లేనోళ్లు సర్కారులో ఉండొద్దక్కా..’ అని నెల్లికొండిలో వెంకటేశ్వరమ్మ అనే వికలాంగురాలు.. షర్మిల వద్ద కన్నీరు పెట్టింది.

16 కేజీల బియ్యమెట్టా సరిపోతాయి? ‌:
‘కుటుంబానికి 16 కిలోల బియ్యం ఇత్తున్నారు. ఐదుగురం ఉన్న కుటుంబానికి నెలకు 16 కిలోలు సరిపోతాయా? కిరణ్‌కుమార్‌రెడ్డి నెలకు 16 కిలోల బియ్యమే తిని బతుకుతున్నాడా? బయట కిలో బియ్యం రూ.25 ఉన్నయి. ఆయన రూ. 16 రూపాయలు తగ్గించి రూ.100 భారం పెంచిండు. పావలా వడ్డీ అని చెప్తాడు కానీ బ్యాంకుకు పోతే రూ. రెండున్నర వడ్డీ పడుతోంది. ఇదేం సర్కారక్కా.. దీన్ని కూలగొట్టాలక్కా.. జగనన్న వత్తేనే మా బతుకులు బాగుపడ్తాయి’ అని అల్లిపురానికి చెందిన శ్రీ పాయి ఆంజనేయ మహిళా గ్రూపునకు చెందిన మహిళలు వడ్ల లక్మి, వాకిట మణెమ్మ, సత్తెమ్మ, వెంకటేశ్వరమ్మ అనే మహిళలు శ్రీమతి షర్మిలతో తమ బాధలు పంచుకున్నారు.

జగనన్న వస్తారు.. రాజన్న రాజ్యం తెస్తారు:
ప్రజల బాధలు విన్న శ్రీమతి షర్మిల స్పందించారు. ‘ప్రజలు ఇన్ని సమస్యలతో సతమతమవుతుంటే.. చూస్తూ కూడా చంద్రబాబు.. ఆ ప్రభుత్వంతోనే కుమ్మక్కై దానిపై అవిశ్వాసం పెట్టనంటున్నారు. ప్రాణాలు.. చెలకలు చాలా విలువైనవి. దయచేసి వాటిని పోగొట్టుకోవద్దు.. నిలబడి సాధించుకుందాం. ఒక్క ఏడాది ఓపిక పడితే మీరు కోరినట్టే జగనన్న అధికారంలోకి వస్తారు. మనలను రాజన్న రాజ్యం దిశగా తీసుకొని పోతారు. రాజన్న రాజ్యంలో రైతును రాజులాగా చూసుకుంటారు. గుడిసెలు లేని రాష్ట్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు. ప్రతి ఇంటినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు’ అని శ్రీమతి షర్మిల బాధితులందరికీ భరోసా ఇచ్చారు.
Back to Top