ఓటుకు కోట్లు కేసు మూలంగా ఏపీకి తీవ్ర నష్టం


– రాజ్యాంగంపై ప్రజలను నమ్మకం సడలుతోంది
– బాబు హయాంలో చట్టం తన పని తాను చేయలేకపోతోంది
– చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు
– చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలి
విజయవాడ: చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, చట్టం తన పని తాను చేసుకోలేకపోతుందన్నారు. ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన చంద్రబాబుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. 

టెన్‌ఫోన్‌లో సంభాషించిన చంద్రబాబు వాయిస్‌ స్పష్టంగా ఉన్నా..ఆడియో ల్యాబ్‌లో ఆ వాయిస్‌ ఆయనదే అని టెస్ట్‌లో తేల్చారన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చంద్రబాబును విచారణ చేయకపోవడం బాధాకరమన్నారు. ఆయన్ను ఎందుకు విచారణ కు పిలువలేదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు టెలీఫోన్‌ సంభాషణలు 93 శాతం మ్యాచ్‌ అవుతుందని ల్యాబోరేటరీలు తేల్చాయన్నారు. చంద్రబాబు వచ్చిన తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థలపై, రాజ్యంగంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను తనకు అనుకూలంగా మల్చుకుంటూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. 

చంద్రబాబు విషయంలో చట్టం తన పని తాను చేసుకోలేకపోతుందన్నారు. ఇంతకు ముందు చంద్రబాబు కంటే మేధావులు, నాయకులు పలువురు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వారిని కోర్టుకు పిలిచి విచారించారని గుర్తు చేశారు. అయితే చంద్రబాబును ఎందుకు విచారణకు పిలువలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు సంబంధించిన కేసులో వ్యక్తిగత కేసు వేస్తే ఆ కేసే పూర్తిగా మాఫీ అయినట్లు నిసిగ్గుగా వ్యవహరిస్తున్నారన్నారు. కోర్టు వీళ్లకు క్లీన్‌షిట్‌ఇచ్చినట్లు జబ్బలు చరుచుకోవడం దారుణమన్నారు. టీడీపీ నేతల తీరు రాజ్యాంగ వ్యవస్థలు తమను ఏమీ చేయలేవన్న అహంకార ధోరణిలో ఉన్నారన్నారు. ఇది ప్రజా స్వామ్యవ్యవస్థలో మంచిపద్ధతి కాదన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటేనే సీబీఐ, లేదా ఉన్నత సంస్థతో విచారణ చేపట్టాలన్నారు. 

స్టిఫెన్‌సన్, రేవంత్‌రెడ్డి, చంద్రబాబుకు సంబంధించిన కేసు కాదు అన్నారు. స్టిఫెన్‌సన్‌ తన వాగ్మూలంలో చంద్రబాబు పేరు చెప్పారన్నారు. ఈ వాగ్మూలం ఆధారంగా విచారణచేపట్టాలన్నారు. ఈ కేసు వి«ధంగా ఏపీ అన్ని విధాల నష్టపోయిందన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు తమ భవిష్యత్తును కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కును తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణసర్కార్‌ వద్ద మోకరిల్లి, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా పిరికిపందలా హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారన్నారు. ఇక్కడికి వచ్చి ఏమీ లేనట్లు నాటకాలు అడే నటుడు చంద్రబాబు అని మండిపడ్డారు. అమరావతికి వచ్చి ఉద్యోగులను ఇబ్బందులు పెట్టారన్నారు. ఉద్యోగస్తులకు కనీస వసతులు కల్పించలేకపోయారన్నారు. కేసీఆర్‌ ఎక్కడ లోపల వేస్తారో అన్న భయంతో చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పారిపోయివచ్చారన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నా చంద్రబాబు తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు మౌనంగా ఉన్నారన్నారు. ఎక్కడ సీబీఐ ఎంటర్‌ అవుతుందో అన్న భయంతో చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీకి ఊడిగం చేశారన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. కారణంగా ఓటుకు నోట్లు కేసు వల్లే చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. 

ఈ కేసు మూలంగా ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసులో వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. రాజ్యాంగ పరంగా వచ్చిన అధికారాన్ని రాగాద్వేషాలకు అనుగుణంగా అమలుచేయాల్సిన వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం, కేసుల నుంచి బయటపడేందుకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన పీపీల నియామకం విషయంలో కూడా చంద్రబాబు స్వార్థంగా ఆలోచన చేశారన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారని, ఈ విషయాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top