ఏపీ పోలీస్‌ను.. ఎల్లో పోలీస్‌గా మార్చిన బాబు

పోలీస్‌ సంస్మరణ దినోత్సవంలో ప్రతిపక్షంపై ఆరోపణలు సిగ్గుచేటు
తుని రైలు దగ్ధం వైయస్‌ఆర్‌ సీపీపై నెట్టడం బాబు అసమర్థత
ఇన్నాళ్లయినా దోషులను ఎందుకు పట్టుకోలేదు
అమరావతి చెరకుతోట దహనం సమయంలో ఎస్పీలను ఎందుకు బదిలీ చేశారు
టీడీపీ అధికారంలోకి వచ్చాక 200ల మంది వైయస్‌ఆర్‌సీపీ నేతల హత్యలు
పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తిత్వం చంద్రబాబుది
హైదరాబాద్‌: ఏపీ పోలీసులను.. ఎల్లో పోలీసులుగా మార్చిన చంద్రబాబు పోలీస్‌ సంస్మరణ దినోత్సవంలో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురదజల్లడం సిగ్గుచేటని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. విధి నిర్వాహణలో సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులతో పోరాడి మరణించిన పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. ఆ వేడుకకు హాజరైన రాష్ట్రాధిపతులు పాల్గొని పోలీసుల త్యాగాలను కొనియాడతారు. ఇంకా పోలీస్‌ వ్యవస్ధను ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశాలపై చర్చిస్తారు. కానీ చంద్రబాబు సంస్మరణ దినోత్సవాన్ని ప్రధాన ప్రతిపక్షంపై విమర్శలు చేసే కార్యక్రమానికి పూనుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులను దుర్మార్గులుగా చిత్రీకరించాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారన్నారు. 

తునిలో రైలు దగ్ధం సంఘటన, అమరావతి రాజధానిలో చెరుకు తోటలు, పోలవరం కాల్వలకు గండ్లు కొట్టిన సంఘటనలు ప్రధాన ప్రతిపక్షం చేసిందని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తునిలో కాపు గర్జన జరుగుతున్న సమయంలో కొందరు రైలు తగలపెట్టడం జరిగిందని, నిమిషాల్లో చంద్రబాబు టీవీల ముందుకు వచ్చి ఇది కాపులు చేసింది కాదు.. వైయస్‌ జగన్‌ మనుషులు కడప నుంచి వచ్చి తగలబెట్టారని మాట్లాడారన్నారు. అదే విధంగా రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులను తగలబెట్టించిన చంద్రబాబు అది కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై తోశారన్నారు. పోలవరం కాల్వకు గండికొట్టి నీరు వెళ్లిపోతే కడప నుంచి వచ్చిన వారు చేశారని మాట్లాడారన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఇప్పటికీ గుర్తించలేదని ప్రశ్నించారు. నిఘా వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్‌ డిపార్టుమెంట్‌ ఏం చేస్తుందని నిలదీశారు. ముద్దాయిలు ఎవరో తేల్చకుండా వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లడం సమంజసం కాదన్నారు. 
 
అమరావతిలో చెరకు తోట దహనం సమయంలో ఇద్దరు ఎస్పీలు ఉన్నారని, వారు నిజాయితీ విచారణ జరుపుతున్న సమయంలో ఒక్కరోజులో ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు చంద్రబాబూ అని అంబటి ప్రశ్నించారు. తుని రైలు సంఘటన, చెరకు తోట దగ్ధం చేసింది టీడీపీ కార్యకర్తలేనని బయటకు వస్తుందనే భయంతోనే బదిలీ చేశారన్నారు. చంద్రబాబు తన అసమర్థతను వైయస్‌ఆర్‌ సీపీపై రుద్ధే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వైయస్‌ జగన్‌కు అంటగడుతున్నారని, ఆరోపణలు చేసిన వారు ఎందుకు నిరూపించలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటే దానికి చంద్రబాబు వైఖరి కారణమన్నారు. నేషనల్‌ క్రైం రికార్డు ఆఫ్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) సర్వే చేస్తే దేశ వ్యాప్తంగా నేరాల నమోదులో ఆంధ్రరాష్ట్రం నాలుగో∙స్థానం, మహిళలపై వేధింపుల కేసుల్లో అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటక్‌ డిఫామ్స్‌ అనే సంస్థ సర్వే చేస్తే ఏపీ నాల్గవ స్థానంలో ఉందన్నారు. మహిళలపై అరాచకాల కేసుల్లో ఐదుగురు నిందితులు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలే ఉన్నారన్నారు. 

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే చట్టపరంగా ఏ యాక్షన్‌ తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. మహిళపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోకపోగా.. చంద్రబాబే దగ్గరుండి ఇద్దరినీ పిలిచి రాజీ చేశారన్నారు. అదే విధంగా ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ బాలసుబ్రమణ్యంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దౌర్జన్యం చేస్తే ఎలాంటి చర్య లేదన్నారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా గందరగోళం సృష్టించిన కాల్‌ మనీ సెక్స్‌రాకెట్‌లో సుమారు 200ల అశ్లీల వీడియోలు బయటపడ్డాయని పచ్చమీడియా చెప్పినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవన్నారు. టీడీపీ నాయకులు సెక్స్‌రాకెట్‌లో ఉన్నారని, వారిని చంద్రబాబు కాపాడే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాల కోసం చంద్రబాబు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను అతి దారుణంగా ఉపయోగించుకున్నారన్నారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసుల సాయంతో సుమారు 200ల మంది నాయకులు, కార్యకర్తలను హతమార్చారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. చెరుకులపాటి నారాయణరెడ్డిని అతిదారుణంగా హత్య చేశారని, ఆ కేసులో ఎస్‌ఐని కూడా ముద్దాయిగా ఉన్నాడన్నారు. తెరచాటున ఉండి అనేక ఘోరాలకు పాల్పడుతున్న చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీ నేతలు రౌడీలు, గుండాలని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇదే అదునుగా జీవో ఇచ్చి టీడీపీ నేతలపై ఉన్న క్రిమినల్‌ కేసులు చంద్రబాబు ఎత్తివేశారని, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై క్రిమినల్‌ ఉన్న కేసులు ఎత్తివేశారన్నారు.  నారా హమారా అని గుంటూరులో ఒక కార్యక్రమం చేపట్టి ముస్లింలకు అండగా ఉంటానన్న చంద్రబాబు నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు తన ఇష్టానుసారంగా వాడుకుంటున్నాడని దుయ్యబట్టారు. చివరకు ఐటీ దాడులు జరుగుతున్న తరుణంలో కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసుకొని టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తే ఐటీ వారికి పోలీసు ప్రొటెక్షన్‌ ఇవ్వమని తీర్మానించిన నీచుడు చంద్రబాబు అని విరుచుకుపడ్డారు. ఎప్పటిలా ఎదిరించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు ఐటీ అధికారులపై నమోదు చేయకపోవడం సంతోషమన్నారు. 

చంద్రబాబు పోలీస్‌ నిఘా వ్యవస్థను అంతా వైయస్‌ఆర్‌ సీపీ నుంచి ఎవరు వస్తారు.. ఎవరికి ఎంత చెల్లించాలనే దానిపై పెట్టారని అంబటి అన్నారు. అరకులో ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని మావోలు హతమార్చితే మీ నిఘా వ్యవస్థ ఏం పనిచేస్తుందని చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బాగు చేసేందుకు కాకుండా ప్రతిపక్షంపై పెట్టారన్నారు. చంద్రబాబు లాంటి ఉగ్రవాది ఎవరూ లేరని, ముఖ్యమంత్రి పదవి కోసం ఎంత దారుణనికైనా దిగజారే వ్యక్తిత్వం చంద్రబాబుదన్నారు. టీడీపీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
Back to Top