విశ్వాసం కోల్పోయిన స్పీకర్ పై అవిశ్వాసం

సభలో రూల్స్ బ్రేక్ చేసిన సభాపతి
అధికార పార్టీకి కొమ్ముకాస్తు ఏకపక్ష వైఖరి
కోడెలపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్: స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఈతీర్మానాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభా కార్యదర్శికి అందజేశారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీలకు అతీతంగా వ్యవరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో స్పీకర్ అవలంభిస్తున్న ఏక్షపక్ష ధోరణిని నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానంకు నోటీసు ఇచ్చిన తర్వాత ....అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలతో కలిసి సుజయకృష్ణ రంగారావు విలేకరులతో మాట్లాడారు.

స్పీకర్ గా కోడెల ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిపై గంటల తరబడి మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక అవాస్తవాలు మాట్లాడినా సభాపతి వారిని కట్టడి చేయలేదన్నారు. గతంలో స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలనుకున్నామని, తన వ్యవహార శైలిని మార్చుకుని సభను సక్రమంగా నడుపుతారని వెనక్కు తీసుకున్నామని వెల్లడించారు.

సభలో సెక్స్ రాకెట్ పై చర్చకు ఎక్కడా కూడా అవకాశం కల్పించలేదని వారు మండిపడ్డారు. తమ అధ్యక్షులు వైఎస్ జగన్ మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు.  నిరసన తెలిపిన ఎమ్మెల్యే ఆర్ కే రోజాను నింబధనలకు విరుద్ధంగా సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని ఫైరయ్యారు. ప్రధాన అంశంపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆమెపై ఎదురుదాడి చేసి అన్యాయంగా  సస్పెండ్ చేశారని వాపోయారు.

అసెంబ్లీలో నిరసనలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో చెప్పాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. అసెంబ్లీ ప్రాపర్టీ అయిన వీడియోలు సోషల్ మీడియాకు లీకవడం స్పీకర్ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేందుకు అవసరమైన సంఖ్యా బలం తమ పార్టీకి ఉందని సుజయకృష్ణ తెలిపారు. అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ 2 వారాల్లో సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నామన్నారు. 

Back to Top