ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వైయస్‌ జగన్‌ చెప్పలేదు

అభిమాని అనడంతో అనుమానం బలపడింది
పదివేల కాల్స్‌ ఎవరికి చేశాడో తేల్చాలి
ఇంట్లో డబ్బులు ఇవ్వని వ్యక్తి మటన్‌ బిర్యానీ విందు ఇస్తాడా
ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి.. ఫ్లెక్సీ ఎక్కడిది
నిందితుడు శ్రీనివాసరావుది టీడీపీ సానుభూతి కుటుంబం
పనిచేసే రెస్టారెంట్‌ ఓనర్‌ కూడా టీడీపీ క్రియాశీలక కార్యకర్తే
పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీని పిలిపించి విచారణ చేపట్టాలి
జీవితం సెటిలయ్యే వ్యక్తి దొరికాడని చెప్పాడంట.. అతనెవరో తేలాలి
చంద్రబాబు, డీజీపీ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం
హైదరాబాద్‌: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ప్రాథమిక విచారణ కూడా చేపట్టకుండా గంటలో మీడియా ముందుకువచ్చి డీజీపీ అభిమాని చేశాడని చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. హత్యాయత్నం వైయస్‌ జగన్‌ పాదయాత్ర బస శిబిరంలో కాదని, హైసెక్యూరిటీ ఉన్న ఎయిర్‌పోర్టులో జరిగిందన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యా ప్రయత్నం జరిగిందని నిమిషాల్లో మీడియా ప్రసారాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచానికి మొత్తం తెలిసిందని, కానీ చంద్రబాబు మాత్రం 4:30కు ప్రెస్‌మీట్‌ పెట్టి రిపోర్టు మాకు రాలేదు అని చెప్పడం బాధ్యతారహితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) ఎయిర్‌పోర్టులో భద్రత చూడడమే వారి పని అని విచారణకు సపరేట్‌గా వేరే స్టేషన్‌ ఉందన్నారు.  ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం ఘటనను సుమోటోగా తీసుకొని ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. మెడికల్‌ రిపోర్టు రాలేదని, వైయస్‌ జగన్‌ పోలీసులకు కంప్లయింట్‌ ఇవ్వలేదని చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు సుమోటోగా కేసు విచారణ చేపడుతారని కూడా తెలియదా అని నిలదీశారు. దాడి జరిగిన వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే గంటలో వైయస్‌ జగన్‌ అభిమాని అని, ఫ్లెక్సీ ఉందని, సింపథి కోసం వైయస్‌ఆర్‌ సీపీ చేసిందని మాట్లాడడం దుర్మార్గమన్నారు. డీజీపీ వైఖరిని రిటైర్డ్‌ డీజీపీ ఆంజనేయరెడ్డి కూడా తప్పుబట్టారన్నారు. 

హత్యకు యత్నించిన శ్రీనివాసరావు వైయస్‌ జగన్‌ అభిమానా..? అభిమాని ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్తా..? కిరాయి హంతకుడా..? టీడీపీకి అమ్ముడుపోయిన వ్యక్తా..? అతని ఉద్దేశం ఏంటీ ఇన్ని కోణాలు ఉన్నప్పుడు గంటకే అభిమాని అని చెప్పడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. నిందితుడి బాబాయి నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఠానేలంక 2వ వార్డు మెంబర్‌గా టీడీపీ నుంచి పోటీ చేశాడని, ఎంపీపీ ఠానేలంక వాసికి మద్దతుగా పనిచేశారని క్లీయర్‌గా చెప్పారు.  

విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి కీలకమైన అంశాలను వెల్లడించారని ఇక్బాల్‌ చెప్పారు. నిందితుడు శ్రీనివాసరావు సుమారు తొమ్మిది ఫోన్లు మార్చాడని, పది వేల కాల్స్‌ మాట్లాడాడని చెప్పారన్నారు. రెస్టారెంట్‌లో పనిచేసే వ్యక్తికి ఇన్ని ఫోన్లు మాట్లాడే అవసరం ఏంటీ..? ఇన్ని కాల్స్‌ చేశారంటే ఎంత పథకం ఉందో తేల్చాలి. లోతుగా విచారణ చేయాల్సిన కేసును డీజీపీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 
శ్రీనివాసరావు నెల క్రితం తన జీవితం సెటిల్‌అయిపోయే వ్యక్తి దొరికాడని, స్నేహితులకు మటన్‌ బిర్యానీతో  విందు ఇచ్చాడని తెలిసిందని, ఇంట్లో కూడా డబ్బు ఇవ్వని వ్యక్తి విందు ఇచ్చాడంటే దీనిపై కూడా విచారణ చేపట్టాలన్నారు. జనవరి నుంచి కత్తి పెట్టుకొని ఉన్నాడని కమిషనర్‌ చెప్పారని, సినీ నటుడు శివాజీ ఆపరేషన్‌ గరుడ గురించి చెప్పిన సమయం కూడా అప్పుడేనని టైమింగ్‌ కనిపిస్తుంది కాబట్టి శివాజీని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజాలు నిగ్గుతేలుతాయన్నారు. ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్‌ రెస్టారెంట్‌లోకి కత్తి ఎలా వచ్చింది? ఆ రెస్టారెంట్‌ యజమాని టీడీపీ క్రియాశీలక కార్యకర్త, గాజువాక టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని కూడా లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
విశాఖ కమిషనర్‌ వెంటనే పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. నిందితుడు వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్త కాదు. ఆ కుటుంబం అంతా టీడీపీకి పనిచేస్తున్నారని ఆ గ్రామస్తులే చెబుతున్నారన్నారు. ఫోన్లు ఎలా మార్చాడు. పది వేల కాల్స్‌ ఎవరికి చేశాడు. దీన్ని లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. హత్యాయత్నం మరెవరిపైనైనా జరిగి ఉంటే యాక్షన్‌ చేసి సింపథి సాధించేవారని, కానీ వైయస్‌ జగన్‌ ఎయిర్‌పోర్టులో ప్రాథమిక చికిత్స చేయించుకొని హైదరాబాద్‌కు చేరుకొని డైరెక్ట్‌గా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇంటికి వెళ్లి ఎవరో డైరెక్షన్‌ ఇస్తే ఆస్పత్రికి వెళ్లారనడం ముమ్మాటికీ బాధ్యతారహితమన్నారు.  గాయం ఎంత పరిమాణంలో అయిందనేది కూడా డాక్టర్లు రికార్డు చేశారన్నారు. 

దర్యాప్తులో భాగంగా ఏసీపీ నాగేశ్వరరావు వారి టీమ్‌ హైదరాబాద్‌లో వైయస్‌ జగన్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చారని, వైయస్‌ జగన్‌ వారితో హుందాగా వ్యవహరించారన్నారు. ‘పోలీసు వ్యవస్థను గౌరవిస్తాను. పోలీసులు గవర్నమెంట్‌కు పనిచేయాలి కానీ.. వ్యక్తుల కోసం పనిచేయకూడదు. ఒకవేళ పక్కకు జరగకుండా ఉంటే కత్తి మెడకు తగిలితే మీరు వచ్చి కూడా లాభం ఉండేది కాదు కదా.. డీసీపీ అంత తొందరంగా అభిమాని అని చెబితే ఎలా నమ్మకం కదురుతుంది. ఐ సెల్యూట్‌ ఆఫీసర్స్‌. ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చారన్నందున కోర్టుకు వెళ్లాం’ అని వైయస్‌ జగన్‌ వారికి చెప్పారన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వైయస్‌ జగన్‌ చెప్పలేదని, కావాలని కొందరు తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. ఇప్పటికైనా అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసు ఎంత దూరమైన వెళ్తుంది కాబట్టి నిందితుడు శ్రీనివాసరావుకు భద్రత కల్పించాలన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top