ఈ పోరు ఆగదు...ఇది ఆరంభం మాత్రమే


విశాఖపట్టణం, డిసెంబరు 5: "ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కేస్తున్నారు. వ్యవసాయ రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలి అని చెప్పారు. మంగళసూత్రాలు నిలవాలంటే బాబు రావాలన్నారు. టీవీల్లో ఊదరగొట్టారు. జాబు కావాలి అనే లక్షల మంది ఓట్లేశారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కచెల్లెమ్మలతో పనైపోయింది. రైతులతో పనైపోయింది. పిల్లలతో, చదువుకుంటున్న విద్యార్ధులతో పనైపోయింది. అంతే బాబు అసలు రంగు బయటపడింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గాలికొదిలేశారు" అని ముఖ్యమంత్రి తీరును, టీడీపీ ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పారబట్టారు.

రాష్ట్రంలో రూ. 87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉంటే చంద్రబాబు కేవలం రూ. 5 వేల కోట్లు విదిల్చి దబాయిస్తున్నారని.. రైతులకు కోటి పైచిలుకు బ్యాంకు అకౌంట్లు ఉంటే కేవలం 22 లక్షల మందిని మాత్రమే లెక్కతేల్చాలని దుయ్యబట్టారు. డ్వాక్రా రుణాలు రూ. 14 వేల కోట్లు ఉంటే.. వాటి మాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇంటికి ఒక ద్యోగమిస్తానని చెప్పిన చంద్రబాబును తాను అసెంబ్లీలో అడిగితే.. గవర్నమెంటు ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు అంటూ ఆయన మాటమార్చారని మండిపడ్డారు.
"చంద్రబాబు ప్రజలతో పని ఉన్నప్పుడు.. ప్రజల ఓట్లు కావాల్సిఉన్నప్పుడు.. తాను సీఎం కుర్చీలో కూర్చోవాలనుకున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఎన్నికలు అయిపోయాక ప్రజలతో పని తీరిపోయాక ఓట్లు వచ్చేశాక చంద్రబాబు మరో మాట చెప్తారు. బాక్సైట్ తవ్వకాలు అయినా పీసీపీఐఆర్ అయినా చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి .. ఇప్పుడు చేసేది మరొకటి" అంటూ విరుచుకుపడ్డారు.

 "ఎన్నికల హామీలను తుంగలో తొక్కేసిన టీడీపీ పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే.. చంద్రబాబు తన హామీలను నెరవేర్చకపోతే జనవరి 6,7 తేదీల్లో నేనే నిరహారదీక్ష చేస్తా. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆత్మహత్యలు ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయని ఆయన హేళనగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు గట్టిగా బుద్ది వచ్చేలా చెప్తున్నా.. ఆత్మహత్యలు చేసుకున్న ఆ 86 మంది రైతుల కుటుంబాలను వాళ్ల ప్రతి ఇంటికి వెళ్లి పరామర్శిస్తాను. సంక్రాంతి పండుగ తరువాత వాళ్ల ప్రతి ఇంటికీ వెళ్లి ఓదారుస్తాను. అప్పటికైనా చంద్రబాబుకు అర్ధమవుతుంది" అని శ్రీ వై.ఎస్.జగన్ ప్రకటించారు.

ఎన్నికల హామీలను నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించింది. విశాఖ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో శ్రీ వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ.. చంద్రబాబు ఎన్నికల హామీలను ఎలా తుంగలో తొక్కేసిందీ గణాంకాలతో సోదాహరణంగా వివరించారు. హుద్-హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రజలు కలసి రావాలని పిలుపునిచ్చారు. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ప్రజలతో పనైపోయాక హామీలు తుంగలో తొక్కారు...

"ఇన్ని వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కదలివచ్చి నడిరోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. కారణమేమిటని ఆలోచించే పరిస్థితిలో ఈ నాయకులు, పాఠకులు లేరు. ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారు? ప్రజలతో పని ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడారు? ప్రజలతో పని అయిపోయాక ఏం మాట్లాడుతున్నారు? అనేది ఒక్కసారి గుండెల మీద చేయివేసుకుని గుర్తుచేసుకుని చెప్పాలని ఈ నాయకులను, ఈ పాలకులను ప్రశ్నిస్తునారు. ఎన్నికలకు ముందు ఆ వేళ ఇదే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టి హైదరాబాద్ వచ్చారు. మేమే రాష్ట్రాన్ని విడగొట్టామని ఢిల్లీలో చెప్పి ఎంపీలతో చేతులు పైకెత్తించారు.

హైదరాబాద్ వచ్చిన తరువాత ఎన్నికలు వస్తున్నాయి కదా అని రెడు మేనిఫెస్టోలు విడుదల చేశారు. సీమాంధ్ర మేనిఫెస్టో అని చెప్పి బుక్ పైకెత్తారు. తెలంగాణ మేనిఫెస్టో అని చెప్పి రెండో బుక్ పైకెత్తారు. బుక్ ఓపెన్ చేస్తే అందులో కూడా ఊదరగొట్టే హామీలే ఉన్నాయి. వస్తూనే మెట్టమొదటి సంతకం రుణమాఫీపైనే అని ఊదరగొట్టారు. జాబు కావాలంటే బాబు రావాలి. మంగళ సూత్రాలు నిలవాలంటే బాబు రావాలి. రైతులకు రుణమాఫీ జరగాలంటే బాబు రావాలి. అని టీవీల్లో ఊదరగొట్టారు. బాబు రావాలి జాబు కావాలి అని లక్షల మంది ఓట్లేశారు. బాబు రావాలి రైతుల రుణాలు మాఫీ కావాలని రైతులు ఓట్లేశారు. ఎన్నికలు అయిపోయాయి అక్కా చెల్లెమ్మలతో పనైపోయింది. రైతులతో పనైపోయింది. విద్యార్ధులతో పనైపోయింది. అంతే బాబు అసలు రంగు బయటపడింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామినీ గాలికొదొలేశారు.

రైతు రుణాలపైనా, ఖాతాల లెక్క పైనా ఫ్లేటు ఫిరాయింపే...

ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలుసు రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లు ఉన్నాయని.. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇవాళ రూ. 87 వేల కోట్ల రైతుల రుణాలకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమంటున్నాడో తెలుసా..? 'నేనెప్పుడు చెప్పాను రైతుల వ్యవసాయ రుణాలని? నేను క్రాప్ రుణాలని చెప్పాను' అని మళ్లీ రుణాల విషయంలో ఫ్లేటు ఫిరాయించారు. మరో వైపు రూ. 87 వేల కోట్ల రుణాలకు గాను రాష్ట్రంలో దాదాపు కోటి పైచిలుకు అకౌంట్లు ఉన్నాయి. మొన్న చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి 22 లక్షల మంది రైతులు అని తేల్చేశారు.

అదికూడా.. ఇవాళ విశాఖపట్నానికి జగన్ వస్తున్నాడు.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయని... ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో చేస్తున్నట్టు చెప్పారు. కోటి పైచిలుకు అకౌంట్లు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే అలా బిస్కెట్లు వేసినట్లుగా కాస్తో కూస్తో ఇస్తామంటున్నారు. ఆ 22 లక్షల మంది రైతులకైనా ఎంత ఇస్తారో అంటే.. అది మాత్రం నన్ను అడగొద్దు ఇప్పుడు చెప్పను అంటారు. ఎంత ఇస్తారో చెప్పరు. ఎంత మందికి ఇస్తారో చెప్పరు. కానీ రోజూ బుకాయిస్తూ పోతారు. ఇలా చంద్రబాబు కోటి పైచిలుకు రైతులకు సంబంధించిన రూ. 87 వేల కోట్ల రుణాల సంగతిని పక్కన పెట్టేశారు.

నమ్మినందుకు రూ. 14 వేల కోట్ల అపరాధ వడ్డీ భారం...

డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ. 14 వేల కోట్ల రుణాలు ఉన్నాయి. ఆ రుణాలు మాఫీ అవుతాయని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కోటి ఆశలతో ఎదురుచూశారు. డ్వాక్రా రుణాలు రూ. 14 వేల కోట్లు, రైతుల రుణాలు రూ. 87 వేల కోట్లు కలిపితే రూ. 1, 01 లక్షల కోట్లు అప్పులున్నాయి. ఈ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు, రైతులకు ఎన్నికల వేళ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి మాటలు నమ్మి అప్పులు కట్టినందుకు అపరాధ వడ్డీ కింద రూ. 14 వేల కోట్లు కడుతున్నారు. ఈ లక్ష కోట్ల రూపాయల అప్పు మీద కేవలం వడ్డీ భారమే రూ. 14 వేల కోట్ల రూపాయలు అయితే.. చంద్రబాబు కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించి '20 శాతం మాఫీ అయిపోయింది' అని చెప్తున్నాడు. మాట మీద నిలబడని ఇటువంటి పెద్ద మనిషికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా? అని అడుగుతున్నా.

ప్రయివేటు ఉద్యోగాలయితే నీతో పనేంటీ బాబూ?

'ప్రతి పిల్లాడికి ఉద్యోగమిస్తాను. నాకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. నాకు దేశానికి ట్యూషన్లు చెప్పిన అనుభవం ఉంది' అని ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. ఒకవేళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇస్తానని ఛాలెంజ్ చేశాడు. ఇవాళ రాష్ట్రంలో కోటి 75 లక్షల ఇళ్లున్నాయి. కోటి 75 లక్షల ఇళ్లకు రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావని కాలర్ పట్టుకుని అడగడానికి పిల్లలు రెడీగా ఉన్నాతు. ఇదే అసెంబ్లీలో అంటే ఆయన నిస్సిగ్గుగా అంటారు..'గవర్నమెంటు ఉద్యోగాలు ఇస్తానని నేను ఎప్పుడు చెప్పాను? అని అంటాడు. బాధ అనిపించింది. చంద్రబాబును అడిగాను అయ్యా గవర్నమెంటు ఉద్యోగాలు అయితే నీతో పని, ప్రయివేటు ఉద్యోగాలు అయితే నీతో పనేందయ్యా? ప్రయివేటు వ్యక్తుల దగ్గరకు పోవాలి కదా? అన్నాను. ఇలా పూటకొక మాట రోజుకొక అబద్ధం చెప్తున్నాడు.

అవ్వాతాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారు...

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజున రాష్ట్రంలో 43,11,686 పెన్షన్లు ఉన్నాయి. ఆ పెన్షన్లు తీసుకునే అవ్వాతాతలకు ఆ డబ్బు రాకపోతే కడుపునిండా అన్నం కూడా తినని పరిస్థితి. అలాంటి అవ్వాతాతల జీవితాలతో చంద్రబాబు చలగాటమాడుతున్నాడు. . ఒక్కో పింఛనుదారునికి రూ. వెయ్యి చొప్పున చెల్లించడానికి నెలకు రూ. 431 కోట్లు అవసరమవుతాయి. ఈ విధంగా ఏడు నెలల కాలానికి దాదాపు రూ. 3000 కోట్లు చెల్లించాలి. అంతకు ముందు ఇవే పింఛన్లకు రూ. 200 చొప్పున చెల్లించడానికి మొత్తం రూ.130 కోట్లు అవసరమవుతాయి. ఐదునెలలకు రూ. 750 కోట్లు కావాలి. ఇది వరకు మొత్తం పింఛను, పెరిగిన పింఛను మొత్తం చెల్లించడానికి పన్నెండు నెలలకు గాను రూ. 3,700 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్ లో కేవలం రూ. 1338 మాత్రమే కేటాయించారు. అంటే బడ్జెట్ కేటాయింపుల రోజునే పింఛన్లను అడ్డగోలుగా కత్తిరించాలని చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు" అని శ్రీ జగన్ ఎండగట్టారు. ఈ అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్లపై కమిటీలు వేశాడు. ఆ కమిటీలో ఉన్నదంతా టీడీపీకి చెందిన కార్యకర్తలు. వాళ్లు కత్తిరింపులకే ఉన్నారు అన్న రీతిలో వ్యవహరించారు.

కుక్కలకు వేసినట్లు పొట్లాలు వేయడమే తుపాను సాయమా?

విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో హుద్-హుద్ తుపాను వచ్చింది. ఆ తుపాను వచ్చినపుడు 10 రోజులపాటు ప్రతి ప్రాంతంలోనూ తిరిగాను. ఆ ప్రాంతాలకు వెళ్లినపుడు భయానకమైన వాతావరణం కనిపించింది. చంద్రబాబు ఏమైనా చేశారా అని అడిగా. చంద్రబాబు ఏం చేశారంటే.. ఇలా ఒక వ్యాన్ కాలనీలోకి వచ్చేది. ఒక కాలనీలో దాదాపు వెయ్యి మంది నివాసం ఉంటారు. ఆ కాలనీలోకి ఎప్పుడు వస్తుందో తెలీదుకానీ ఒక వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ లోపల పులిహోర పొట్లాలు, పాల ప్యాకెట్లు ఉండేటివి. వెయ్యి మంది నివాసం ఉండే కాలనీకి 200, 300 మందికి సరిపోయే పొట్లాలు ఉంటాయి. ఆ పొట్లాలు విసిరేవారు. కుక్కలకు విసిరేసినట్లు విసిరేసేవారు. చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. చేసే సహాయమేదో ప్రతి ఇంటికి వెళ్లి చేయొచ్చుగా.. ఏందుకు వెళ్లి ఇవ్వలేకపోయారు అని అడుగుతున్నా.

పంట నష్టానికి ఒక్క రూపాయి ఇచ్చారా?

హుద్-హుద్ తుపాను వల్ల 5 లక్షల 94 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు కట్టొద్దంటే కట్టని కారణంగా పంటల భీమా కూడా అందని పరిస్థితి. ఈ 5 లక్షల 94 వేల ఎకరాలకు చెందిన రైతులకు చంద్రబాబు కనీసం ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని అడుగుతున్నాను.

దెబ్బతిన్న బోట్లకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?

హుద్-హుద్ తుపాను వచ్చినపుడు హార్బర్ ప్రాంతం మొత్తం చెల్లాచెదురైంది. అప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో నాకిప్పటికీ గుర్తుంది. 400 బోట్లు పోయాయి, 64 బోట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఈ చంద్రబాబు బోట్లకు ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చారా అని శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడగగా ఇవ్వలేదు అని జనం బిగ్గరగా అరిచారు.

బాబు మెడలు వంచే వరకూ పోరాటం..

ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఒక మాట చెప్తారు. చంద్రబాబును కడిగేయడానికి.. రాబోయే రోజుల్లో చంద్రబాబు మెడలు వంచేందుకు. నాకు తోడుగా మీ అందరి సాయం కావాలని కోరుతున్నా. ఇందులో భాగంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్న దారుణాల గురించి డ్వాక్రా అక్కచెల్లెమ్మల గురించి, అవ్వాతాతల గురించి, చదువుకున్న పిల్లల గురించి కలెక్టర్ దగ్గరకు వెళ్లి అర్జీ ఇస్తాం. ఇది మొదటి అర్జీ. ఇది చివరిది కాదు. ఈ ప్రభుత్వం మీద పోరాటం ఇంతటితో మొదలవుతుందని చంద్రబాబును హెచ్చరిస్తున్నాం.

Back to Top