బాబూ.. బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?


 తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదాను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌ను విఫలం చేయాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని  పార్టీ ఆరోపించింది. ‘ప్రత్యేక హాదాకు చంద్రబాబు, టీడీపీ వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు’అని వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గన్‌మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా, మంగళవారం జరగనున్న బంద్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నాయకులు సన్నద్ధమయ్యారు. అలాగే, అన్ని వర్గాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బంద్‌ను విఫలం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలను గృహ నిర్బంధం చేసింది. బంద్‌ను నిర్వీర్యం చేయడానికి పోలీసులకు, అధికార యంత్రానికి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వైఎస్సార్‌ సీపీ ఆరోపించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న పోరాటంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బంద్‌కు మద్దతు ఇవ్వాలని, ఇలాంటి అడ్డుకునే చర్యలను టీడీపీ విరమించుకోవాలని వైయ‌స్ఆర్‌ సీపీ హితవు పలికింది.



Back to Top