మదనపల్లెలో చిన్నారి రిషిక ప్రియా హత్యపై జ‌నాగ్రహం

నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి

వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ నిస్సార్ అహమ్మద్ డిమాండ్

మదనపల్లె: చిన్నారి రిషిక ప్రియా హత్య ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మదనపల్లె వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. భాదిత కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నీరుగుట్టువారిపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ‌మ్మ‌ద్‌ మాట్లాడుతూ, చిన్నారి రిషిక ప్రియా హత్య సమాజాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకుని చట్టపరంగా అత్యంత కఠిన శిక్షలు విధించాలని కోరారు.

మదనపల్లె ప్రాంతంలో గంజాయి, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మత్తు పదార్థాల ప్రభావంతో అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయని, మహిళలపై అఘాయిత్యాలకు ఇవే ప్రధాన కారణమని మండిపడ్డారు. అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. రిషిక ప్రియా హత్యకు పాల్పడిన అనుమానితుడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, అలాంటి మానవ మృగాన్ని సమాజానికి పాఠం చెప్పేలా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

Back to Top