ఆసుపత్రి నుంచి వైయస్‌ జగన్‌ డిశ్చార్జ్‌


హైదరాబాద్‌: విశాఖ ఎయిర్‌ పోర్టులో హత్యయత్నానికి గురై హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్న వైనయస్‌ జగన్‌ కొద్ది సేపటి క్రితం డిశ్చార్జ్‌ అయ్యారు.  విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాలూరు నియోజకవర్గం మక్కువ మండల చప్పబచ్చమ్మపేట నుంచి గురువారం ఉదయం 10 గంటలకు కారులో బయల్దేరారు. సరిగ్గా 12.15 గంటలకు విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. అక్కడ తన కోసం ఉన్న విశాఖ నేతలతో ముచ్చటించి వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. సరిగ్గా 12.32 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోని ప్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు తన సహచర వెయిటర్స్‌ సురేష్, రమాలతో కలిసి టీ, మంచినీటి బాటిల్స్‌తో వీఐపీ లాంజ్‌లోకి వచ్చారు. అందరికీ టీ సర్వ్‌ చేయగా, జననేత మాత్రం తనకు కాఫీ కావాలని కోరారు. వెయిటర్‌ రమా తీసుకొచ్చిన కాఫీని సేవిస్తున్న సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసరావు ‘మీరు సూపర్‌ అన్నా.. ఈసారి మీరు తప్పకుండా 160 సీట్లు గెలుస్తారు. మీదే విజయం’ అని మాటలు కలపడంతో జననేత చిరునవ్వుతో స్పందించారు. అదే అదనుగా  శ్రీనివాసరావు ‘సార్‌.. మీతో సెల్ఫీ కావాలని ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్నాను..  అని అనగా, వైయ‌స్ జగన్‌ చిరునవ్వుతో దగ్గరకు రమ్మన్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి పార్టీ కో ఆర్డినేటర్‌ మధుసూదనరెడ్డి మరికొంత మంది నేతలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు. అప్పటి వరకు వెయిటర్‌ చెప్పిన మాటలు విన్న జగన్‌ తనను కలిసేందుకు వచ్చిన నేతలను పలుకరించేందుకు ఎడమ చేతివైపు ఒక్కసారిగా తిరిగారు. అప్పటికే పక్కా పథకంతో వాటర్‌ బాటిల్‌ రేపర్స్‌లో దాచి తీసుకొచ్చిన పందెం కోళ్లకు కట్టే కత్తిని సరిగ్గా 12.38 గంటల సమయంలో బయటకు తీసి వెయిటర్‌ శ్రీనివాసరావు జననేతపై దాడికి తెగపడ్డాడు. మెడపై పొడిచేందుకు యత్నించగా..సరిగ్గా అదే సమయంలో జననేత ఎడమచేతి వైపు తిరగడంతో కత్తి గురితప్పి భుజంలోకి దూసుకెళ్లింది.ఘటన జరిగిన వెంటనే ఎయిర్‌పోర్టు వైద్య సిబ్బంది హుటాహుటిన వీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. అన్నా రక్తం ఎక్కువగా పోతోంది.. రండన్నా ఆస్పత్రికి వెళ్దాం అంటూ నేతలు ఎంత ఒత్తిడి చేసినా పర్వాలేదు  ప్రజలు, దేవుని ఆశీస్సులున్నాయి. నాకేం కాదు అంటూ ఆయన వారించారు. ఓ వైపు రక్తం కారుతున్నా బాధను పంటికింద అదిమిపెట్టి చిరునవ్వుతోనే కంగారు పడకండి అంటూ నేతలకు ధైర్యం చెప్పారు. అక్కడకు చేరుకున్న ఎయిర్‌పోర్టు వైద్యురాలు లలితా స్వాతి తమ సిబ్బందితో జగన్‌కు ప్రాధమిక వైద్యం చేశారు. రక్తం కారకుండా కట్టడి చేశారు. సెప్టిక్‌ కాకుండా ముందుజాగ్రత్తగా టీటీ ఇంజక్షన్‌ చేశారు.
ఆ తర్వాతైనా పదండన్నా ఆస్పత్రికి వెళ్దాం అని నేతలు ఎంతగా బ్రతిమిలాడినా పర్వాలేదు..నాకేం కాదు.. మీరు ధైర్యంగా ఉండండంటూ వడివడిగా అడుగులేస్తూ ముందుకు సాగారు. తాను హైదరాబాద్‌ వెళ్లాల్సిన 6ఈ–809 ఇండిగో విమానం బయలుదేరే సమయం (13.05 గంటలు) దగ్గరపడుతోందని, తనవల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడకూడదంటూ.. విమానంవైపు కదిలారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రయాణికులతో కలిసి జగన్‌ ఎక్కిన ఇండిగో విమానం హైదరాబాద్‌ బయలుదేరింది. హత్యాయత్నం అనంతరం తనపై పార్టీ నేతలు దాడి చేస్తారన్న భయంతో నిందితుడు శ్రీనివాసరావు నన్ను అరెస్ట్‌ చేయండి..నన్ను అరెస్ట్‌ చేయండి అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. జగన్‌ వారించడంతో నేతలు అతడ్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు.  వైయ‌స్ జ‌గ‌న్‌ను హైద‌రాబాద్‌లో చేర్పించ‌గా ఆప‌రేష‌న్ చేశారు. ఇంకా కొంత స‌మ‌యం విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు.
Back to Top