టీఆర్ఎస్, టీడీపీ లాలూచీ పడ్డాయి
బాబు తాట తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయి
ఎమ్మెల్యేలను కొన్న డబ్బంతా ఎక్కడిది చంద్రబాబు
వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు
వైయస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు
విశాఖః తాను నిప్పు, నిజాయితీపరుడని అంటున్న చంద్రబాబు... నిజంగా నిప్పుయితే వేరే పార్టీ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఇచ్చి ఎందుకు కొనుక్కుంటున్నారని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎమ్మెల్యేను కొన్న డబ్బంతా ఎక్కడిదని బాబును నిలదీశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే చంద్రబాబు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా మేనేజ్ చేయవచ్చనే ధైర్యంతో చంద్రబాబు ఉన్నారని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతవరకు సమంజమని కడిగిపారేశారు. చంద్రబాబు డొల్లతనం, నైజం ఏంటో అందరికీ తెలుసునని అన్నారు.
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును తాట తీస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఏమయ్యాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ కేసులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడ్డాయని ధ్వజమెత్తారు. బాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను కూడా కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు’ అని నిప్పులు చెరిగారు. ఓటుకు కోట్లుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి ప్రజాస్వామ్య పరిరక్షణను తెలంగాణ ప్రభుత్వం కాపాడాలన్నారు.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ఎవరూ కాపాడలేరని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్ని సాక్ష్యాధారలతో కోర్టును ఆశ్రయించారని, త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చంద్రబాబును రక్షించాలని ప్రయత్నించిందని, అందుకు ప్రతిఫలంగా బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని అంబటి మండిపడ్డారు.
ఓటుకు కోట్లు కేసు చేపట్టి 14 నెలలు అవుతున్నా తెలంగాణ సర్కార్ అదనపు చార్జీషీట్ ఎందుకు దాఖలు చేయలేదని అంబటి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్సార్సీపీ ఎంతవరకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదాపై పవన్కళ్యాన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్రమోడీలు సమాధానం చెప్పాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు అంబటి బదులిచ్చారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని అంబటి తేల్చిచెప్పారు. చంద్రబాబు ప్రత్యేక హోదాను అణిచివేయాలని చూస్తే..వైయస్ జగన్ ప్రత్యేక హోదాను సాధించేందుకు ఉద్యమ రూపం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచిన నాయకుడు వైయస్ జగన్ అని తెలిపారు. చంద్రబాబు రాజీ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, ప్రత్యేక హోదా కోసం ఎవరు కలిసి వచ్చినా పోరాడేందుకు వైయస్సార్సీపీ సిద్ధంగా ఉందని అన్నారు.