వైయస్ జగన్ను కలిసిన తిత్లీ తుపాన్ బాధితులు
ఇళ్లు కోల్పోయి రోడ్డునపడ్డామని కన్నీరు పెట్టుకున్న ప్రజలు
కురుపాం: తిత్లీ తుపాన్లో ఇళ్లు కోల్పోయి బాత్రూమ్లలో తలదాచుకుంటున్నామని కురుపాం నియోజకవర్గం జీసీగూడ పంచాయతీకి చెందిన కోటకొండ గ్రామస్తులు ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కన్నీరుపెట్టుకున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కోటకొండ గ్రామానికి చెందిన తుపాన్ బాధితులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తిత్లీ తుపాన్ వల్ల ఇళ్లన్ని నేలమట్టం అయ్యాయని, ఇళ్లు లేక బాత్రూమ్లలో తలదాచుకుంటున్నామని, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇంటి పైకప్పుగా వేసుకొని జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లతో పాటు రేకుల షెడ్తో నిర్మించిన స్కూల్ కూడా కూలిపోయిందన్నారు. 80 ఇళ్లు కూలిపోతే 40 ఇళ్లు మాత్రమే ప్రభుత్వం గుర్తించిందన్నారు.
మన ప్రభుత్వం వచ్చిన తరువాత అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు. బాధతో కాలం వెల్లదీస్తున్న తమకు జననేత హామీ సంతృప్తిని ఇచ్చిందన్నారు. చంద్రబాబు బస్సుల మీద పోస్టర్లు వేసుకొని తుపాన్ బాధితులు ఆదుకుంటున్నామని ప్రచారం చేస్తుకుంటున్నాడని బాధితులు మండిపడ్డారు. ప్రచారానికి ఉపయోగించే ఖర్చు బాధితుల సంక్షేమానికి ఉపయోగిస్తే కొంతైనా మేలు జరుగుతుందనే జ్ఞానం చంద్రబాబుకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు తుపాన్ బాధితులను ఆదుకోవడం పేపర్లకే పరిమితమైందని, ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.