బాబు సర్కార్ సిగ్గుమాలిన పనులు

గుంటూరుః టీడీపీ అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. దేవాలయాలు, మసీదులు, మహాత్ముల విగ్రహాలను కూల్చేసే కార్యక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తోంది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో జాతిపిత విగ్రహాన్ని కూల్చివేసి బుడమేరు కాలువలో పడవేసిన ఘటన మర్చిపోక ముందే గుంటూరు జిల్లా సీతానగరంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని తొలగించారు. ఈ సారి అదే స్థానంలో ఏకంగా చంద్రబాబు బొమ్మలతో ఫ్లెక్సీలు పెట్టడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. 

పుష్కర ఏర్పాట్లకు అడ్డుగా ఉందన్న సాకుతో మహాత్మాగాంధీ విగ్రహాన్ని పడగొట్టడం పట్ల...స్థానికులు  ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో మహాత్మాగాంధీ విగ్రహం తొలగింపుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై పోరాడడంతో తిరిగి జాతిపిత విగ్రహాన్ని పున:ప్రతిష్టించిన విషయం తెలిసిందే. ప్రజలు, ప్రతిపక్షలు, చట్టాలను వేటినీ బాబు సర్కార్ లెక్కపెట్టడం లేదు. రానున్న రోజుల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాష్ట్ర ప్రజానీకం హెచ్చరిస్తోంది
Back to Top