దూసుకొస్తున్న 'జగన్నాధ' చక్రాలు

జగన్.. జగన్.. జగన్.. ఇదే జపం.. ఢిల్లీలో మంగళవారం రాత్రి సీమాంధ్ర ఎంపీల సమావేశంలో ఈ సన్నివేశం ఆవిష్కృతమైంది. వివిధ అంశాలపై చర్చించేందుకు భేటీ అయిన లోక్­సభ సభ్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలనుకున్నారు. పరకాల నియోజకవర్గానికి నిర్వహించిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థికి కేవలం 33 శాతం ఓట్లే వచ్చాయనీ, మిగిలిన 67శాతం సమైక్యవాద పార్టీలకు దక్కిన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలనీ ఆతిథేయుడు కావూరి సాంబశివరావు సూచించారు. ఇటీవలి ఎన్డీటీవీ సర్వేలో వైయస్ఆర్­సీపీ 21స్థానాలను గెలుస్తుందన్న అంశంపై వారు ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. అదే నిజమైతే ఈ పరిస్థితినుంచి ఎలా గట్టెక్కాలనే విషయమై చర్చించారు. ఎన్నికలకు కొన్ని నెలలు ముందు చేపట్టిన ఈ సర్వే అప్పటికీ నిలిస్తే పరిస్థితి ఏమిటనే అంశంపై ఆందోళన వ్యక్తమైంది. తమతమ స్థానాలను ఎలా కాపాడుకోవాలనే విషయమై చర్చ సాగింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే టీవీ ఛానెల్సులో ఇదే అంశంపై విస్తృత చర్చలు సాగాయి. ఈ సర్వేతో వైయస్ఆర్­సీపీ యావద్దేశ దృష్టినీ ఆకర్షించిందని సమావేశం అభిప్రాయపడింది. సర్వే ఫలితాలను తక్కువ చేసి చూపించాలన్న సూచన కూడా ఇందులో వచ్చింది. తెలంగాణ అంశంపై ఏర్పాటైన విందు సమావేశాన్ని ఎన్డీటీవీ సర్వే జగన్ వైపు మళ్ళించిందని చెప్పక తప్పదు. కలలోఅయినా ఇలాంటి పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ ఊహించి ఉండదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

Back to Top