అగ్రిగోల్డ్‌ పాపంలో టీడీపీ నేత‌ల‌కు వాటాలు

 


శ్రీకాకుళం: అగ్రిగోల్డ్‌ పాపంలో చంద్రబాబు, లోకేష్‌తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, నాయకులకు వాటాలు ఉన్నాయని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ఆరోపించారు. ఈ విషయాన్ని మారుమూల గ్రామాలకు వెళ్లి అడిగితే అక్కడి బాధితులే బాహాటంగా చెపుతున్నారని పేర్కొన్నారు. ఈ పాపం తెలుగుదేశం పార్టీని శాపంలా వెంటాతునే ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్‌ వ్యాపార లావాదేవీల్లో చంద్రబాబు, లోకేష్‌తో పాటు మంత్రులు జోక్యం చేసుకోకుండా వదిలేస్తే ఏదోవిధంగా తంటాలు పడి వారే మదుపుదారులకు చెల్లింపులు చేసేవారని అన్నారు. విలువైన ఆస్తులు స్వాహా చేసుకునేందుకు లోకేష్‌ రంగంలో దిగడంతో ఖాతాదారులు నెత్తిన టోపీ పెట్టించారని విమర్శించారు.

ఆధారాలతో సహా అనేక మంది బాధితులు, అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే పాలకులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. పొదుపు చేసుకున్న బాధితులకు చెల్లించేందుకు అవసరమైన రూ.1100 కోట్లు ప్రభుత్వమే చెల్లించి స్వాహా చేసుకున్న ఆస్తులు విక్రయించాలన్నారు. కోర్టుకు కూడా తప్పుదారి పట్టిస్తున్న పాలకులు తీరు అందరికీ తెలిసిందే అన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు మీరు చేసిన కుట్రలో అమాయకులైన డిపాజిట్‌దారులు బలైపోవాల్సిందేనా? అని నిలదీశారు. ఎన్నో ఫైనాన్స్‌ కంపెనీలు బోర్డులు తిప్పేసిన వెంటనే ఖాతాదారులకు చెల్లింపు జరిగాయని, అగ్రిగోల్డ్‌ విషయంలో అలా ఎందుకు జరగలేదన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు మీకు అవసరం కాబట్టి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న ఖాతాదారులను ఎందుకు అరెస్టులు చేస్తున్నారని నిలదీశారు.


Back to Top