పోలవరాన్ని ఎందుకు అటకెక్కిస్తున్నారు?

హైదరాబాద్: అన్ని అనుమతులూ లభించడంతో పాటు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. పోలవరాన్ని విభజన చట్టంలో పేర్కొన్నారని, అయినా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇపుడున్న ప్రాజెక్టులపై ప్రతి ఏటా రూ. 2,000 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకూ ఖర్చు చేసి రెండు మూడేళ్లలో వాటిని పూర్తి చేయాలని తమ పార్టీ కోరుతోందన్నారు. కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే ఆశాజనకంగా లేవని.. టీడీపీ నేతలు చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోందని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిస్తామని చెబుతున్న వారు హంద్రీ-నీవా, గాలేరు-నగరికి పూర్తిస్థాయిలో నిధులెందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు.
 
 రాయలసీమలోని 7,000 చెరువులకు నీళ్లు ఇవ్వగలిగామని టీడీపీ మంత్రి ఒకరు సంతోషంగా చెప్పారని, అయితే అందుకు కారణమైన మహనీయుడు ఎవరనే విషయం చెప్పలేదని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులనే మొక్కలు నాటి పెంచి పోషించిన వ్యక్తి పేరును చెట్టు ఫలాలు తింటున్నపుడైనా స్మరించుకోవాలనే కనీస విజ్ఞత వారికి లేకుండా పోయిందన్నారు. పదేళ్ల క్రితం ఎవరు కృషి చేస్తే.. ఇప్పుడు చెరువులకు నీళ్లివ్వగలిగారో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. ఈరోజు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు ఈ స్థాయిలో ఉన్నాయంటే అందుకు కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డేనని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. పులిచింతల, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, పట్టిసీమ కాలువలు.. ఇలా ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా వాటి ని తీర్చిదిద్దిన ఘనత వైఎస్‌దేనని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని అప్పట్లో వైఎస్ ఆలోచించారని ఆయన అన్నారు.
Back to Top