నేడు, రేపు విజయమ్మ ఫీజు దీక్ష

  • ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభం
  • ఫీజుల పథకాన్ని వైయస్‌లాగా కొనసాగించాలని డిమాండ్‌
  • 2011 ఫిబ్రవరిలో వారం రోజుల పాటు
  • ఇక్కడే ఫీజు దీక్ష చేసిన వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి
  • ఒంగోలులోనూ ఒక రోజు నిరసన
  • ఇటీవల ఏలూరులో విజయమ్మ దీక్ష
  • అయినా మొద్దు నిద్ర వదలని సర్కారు
హైదరాబాద్, 6 ‌సెప్టెంబర్‌ 2012 : ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పోరుబాట పట్టారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ వద్ద విజయమ్మ ఫీజు దీక్షను ప్రారంభిస్తున్నారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఉదాత్తమైన ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకానికి కాంగ్రెస్‌ సర్కార్‌ రకరకాల నిబంధనలు విధిస్తూ, ఆంక్షలు పెడుతూ చివరికి రద్దు చేయాలన్న కుట్ర చేస్తున్నదని విద్యార్థులు, వారి తల్లదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.    

విజయమ్మ గురువారం ఉదయం 9.30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు ధర్నా చౌక్‌కు చేరుకుని దీక్షలో కూర్చుంటారు. వైయస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలాంటి పరిమితులు లేకుండా అర్హులైన పేదలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేశారు. దీనితో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఆయన హయాంలో ఈ పథకం కింద లబ్ధి పొంది ఇంజనీరింగ్‌తో సహా పలు వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఉన్నతోద్యోగాల్లో చేరి తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారు.

ఇలాంటి బృహత్తరమైన పథకాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా మునుపటి లాగే కొనసాగించాలన్న డిమాండ్‌తో విజయమ్మ రెండు రోజుల దీక్ష చేస్తున్నారు. చదువును సామాజిక పెట్టుబడిగా భావిస్తూ వైయస్ ప్రవేశపెట్టిన ఈ పథకం వెనుక ఉద్దేశాన్ని ఏమాత్రం గ్రహించలేకపోయిన ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించి, ఈ ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు ఇదే ప్రదేశంలో నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఒంగోలులో ఈ ఏడాది జనవరి 4న కూడా విద్యార్థుల ఫీజుల సమస్యపైనే ఆయన ఒక రోజు ధర్నా చేశారు.

పోరు బాటలో విజయమ్మ:

ఉప ఎన్నికల అనంతరం ప్రజలు తమపై మరింత బాధ్యతను ఉంచారని ప్రకటించిన విజయమ్మ అప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తున్నారు. తాను జైల్లో ఉన్నప్పటికీ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరాదని జగన్‌ చేసిన సూచనల మేరకు విజయమ్మ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా విజయవాడ ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం వద్ద విజయమ్మ జూలై 17న ఒక రోజు మహాధర్నాలో పాల్గొన్నారు. నేతన్నలకు మద్దతుగా వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదే నెల 23న ఆమె ధర్నా చేశారు. ఫీజులపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని తొలగించాలని కోరుతూ ఏలూరులో ఆగస్టు 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు ఆమె దీక్ష చేశారు. అంతేకాక రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఆమె పులివెందులలో జరిగిన మహాధర్నాలో కూడా పాల్గొన్నారు.  

ఫీజు పోరు దీక్షా శిబిరం ఏర్పాట్లను రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కమిటీ కో-ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ దీక్షా స్థలిలో మకాం వేసి సమీక్షించారు. వేల మంది విద్యార్థులు, ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా వేదికను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top