మహాఘట్టం.. ప్రజాప్రస్థానం

ప్రజల అవసరాలను గుర్తించారాయన.. తన భాగస్వామ్య ఆవశ్యకతనూ కనిపెట్టారాయన.. కరవుకాటకాలతో అల్లాడుతున్న పల్లె జనం అవస్థలూ ఆయన దృష్టి దాటిపోలేదు.. సమస్యలను గాలికొదిలి.. అయ్యా! ఇది కావాలని నినదించిన గొంతులను బందూకులతోనూ, వాటర్ క్యానన్లతోనూ నొక్కేందుకు ప్రయత్నిస్తున్న చర్యలు ఆయన గుండెలను మండించాయి. ఆ దుర్దినాల ఛాయలనుంచి రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారాయన.. మహాత్మా గాంధీ తెల్లవాడికి వ్యతిరేకంగా చేట్టిన దండి సత్యాగ్రహం ఆయన స్ఫురణలోకి వచ్చింది. ఆ దిశగా అడుగులేశారు. 2003 ఏప్రిల్ 9న డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పాదయాత్ర ఆయనను మహానేతగా మలిచింది.  
ఒకవైపు నిప్పులు చెరుగుతున్న ఎండ... మరోవైపు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని రోజులు. ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకుని వారికి మంచిరోజులొస్తాయని భరోసా ఇస్తూ ఆయన సాగారు. కరవు కోరల్లో నలుగుతున్న ప్రజానీకం కన్నీటిని తుడవాలని... గుండె చెదిరి ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పాలన్న లక్ష్యంతో... సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మండుటెండలో సొంత పనిమీద కాస్త దూరం నడవలేని రోజుల్లో జనం బాట పట్టారు. ప్రజల కోసం సరికొత్త ప్రస్థానానికి నాంది పలికారు. అందుకే భారతదేశ చరిత్రలోనే అదొక సాహస ఘట్టంగా చిరస్థాయిగా నిలిచింది.
2003 ఏప్రిల్ 9: చరిత్రలోనే కీలక ఘట్టం ప్రారంభమైన రోజు. ప్రజా ప్రస్థానం పేరుతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. 40 డిగ్రీలు దాటిన మండటెండను సైతం లెక్కచేయకుండా ఏకబిగిన 68 రోజుల పాటు పాదయాత్ర చేస్తూ జనం గుండెలను తట్టారు. చేవెళ్లలో ప్రారంభించిన వైఎస్ కాలినడక 1475 కిలోమీటర్లు సాగింది. 11 జిల్లాల్లోని 56 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జూన్ 15 వ తేదీ వరకు ఏకబిగిన ప్రజల మధ్య కొనసాగింది. మండుటెండలో చేవెళ్ల నుంచి ప్రారంభమైన ప్రజాప్రస్థానం శ్రీకాకుళం జిల్లా సోంపేట చేరేసరికి వరుణుడు కరుణించాడు. మరుసటి రోజు పాదయాత్ర ముగియనుందనగా, సోంపేటలో భారీ వర్షం వైఎస్‌కు స్వాగతం పలికింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన కాలినడక 68 వరోజు సాయంత్రానికి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరుకుంది. అశేష జనవాహిని సాక్షిగా ప్రజాప్రస్థానం ముగిసింది.  ఒక నాయకుడిగా నా బాధ్యత నిర్వహించానని డాక్టర్ వైయస్ఆర్ ప్రజా ప్రస్థానం ముగింపునాడు అన్న మాట ఆయన అంకితభావానికి ప్రతీకగా నిలిచింది. 
మహానేత పాదయాత్ర సాగిందిలా...
తొలివారం: 2003 ఏప్రిల్ 9-15 వరకు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 160 కిలోమీటర్లు
రెండోవారం: ఏప్రిల్ 16-22 వరకు మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 159 కిలోమీటర్లు
మూడోవారం: ఏప్రిల్ 23-29 వరకు నిజామాబాద్ జిల్లాలో 181 కిలోమీటర్లు
నాలుగోవారం: ఏప్రిల్ 30-మే 6 వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 172 కిలోమీటర్లు
అయిదోవారం: మే 7-13 వరకు ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 167 కిలోమీటర్లు
ఆరోవారం: మే 14-20 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 103 కిలోమీటర్లు
ఏడోవారం: మే 21-27 వరకు తూర్పు గోదావరి జిల్లాలో 97 కిలోమీటర్లు
ఎనిమిదోవారం: మే 28-జూన్ 3 వరకు తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో 157 కిలోమీటర్లు
తొమ్మిదోవారం: జూన్ 4-10 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 166 కిలోమీటర్లు
పదోవారం: జూన్ 11-15 వరకు శ్రీకాకుళం జిల్లాలో 114 కిలోమీటర్లు

Back to Top